అవును, ఇప్పుడు దేశంలో ‘భారతీయ జనతా పార్టీ (బీజేపీ)’ ఆకారమైతే.. దాని ఆత్మ ‘అదానీ జనతా పార్టీ (ఏజేపీ)’. ఆత్మ కోసం ఇప్పుడు బీజేపీ తన మూల సిద్ధాంతాలను, దేశ పరువు ప్రతిష్ఠలను, నూటా ముప్ఫై కోట్ల ప్రజల భద్రతను సైతం పణంగా పెడుతున్నది. ఇది ముమ్మాటికీ నిజం.
పేపర్ లీకేజీ అనేది క్షమించరాని నేరం, అందుకే ప్రభుత్వం అత్యంత వేగంగా విచారణ జరుపుతుంటే చూడలేక సన్నాసి మాటలు మాట్లాడి నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరేమైతే మాకేంటి, రాష్ట్రం ఎటుపోతే మాకేంటి నా రాజకీయం పచ్చగా ఉంటే చాలనుకునే దుర్మార్గమైన చర్యలకు పాల్పడటం బండి సంజయ్కి మాత్రమే చెల్లింది.
అనివార్యంగా ఇబ్బంది వచ్చింది. దాన్ని ఎలా సరిదిద్దాలో కేసీఆర్కు తెలుసు. కేసీఆర్ ఏం చేస్తారోననే క్లారిటీ తెలంగాణ యువతకూ ఉన్నది. బీజేపీని, కాంగ్రెస్ నాయకులను ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా తెలంగాణ బిడ్డలు నమ్మే పరిస్థితే ఉత్పన్నం కాదు. నిరుద్యోగ సోదరులారా నోటిఫికేషన్లు ఏసింది కేసీఆరే, ప్రతిభావంతులైన నిరుద్యోగులకు అన్యాయం జరగొద్దని లీకేజీని బయటపెట్టింది కేసీఆరే. ఏ ఇబ్బంది లేకుండా మళ్లీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల్లో కూర్చోబెట్టేది కేసీఆరే. ఇది సత్యం. నిరుద్యోగ సోదరులారా! ప్రతిపక్షాల రాజకీయ రాద్ధాంతాలను వదిలేద్దాం. ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధమవుదాం. లక్ష్యాన్ని చేరుకుందాం.
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేవరకు బీజేపీ అలాగే ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో అప్పటినుంచి బీజేపీ కాస్త ఏజేపీగా మారింది. అదే ‘అదానీ జనతా పార్టీ’. ఇప్పుడు నరేంద్ర మోదీకి అదానీనే జనతా, అదానీనే శ్రీరాముడు. ఒకప్పుడు అయోధ్యలో శ్రీరాముడి గుడి నిర్మాణం కోసం ఎల్కే అద్వానీ ఆధ్వర్యంలో రథయాత్ర చేసి పార్టీని నిర్మాణం చేస్తే.. చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్టు.. బీజేపీని హస్తగతం చేసుకున్న ఈ గుజరాతీ బీజేపీ ద్వయం కోట్ల మంది బీజేపీ కార్యకర్తలను ఏజేపీ కోసం పణంగా పెడుతున్నది. అయినా.. ఎక్కడా ఆర్ఎస్ఎస్ మాట్లాడదు, విశ్వహిందు పరిషత్ నిలదీయదు.. ఇవి ప్రశ్నించే శక్తి కోల్పోయాయని అనుకోవచ్చా? దేశం కోసం, ధర్మం కోసం అంటూ ప్రగల్భాలు పలికి ప్రజలను నమ్మించి, చివరికి అదానీ కోసం అధర్మం కోసమే పనిచేస్తున్న బీజేపీ నాయకుల జూటా నినాదాలకు ఈ మూడు హిందుత్వ సంఘాలు మద్దతిస్తున్నాయా? లేదా మౌనం అంగీకారం అనుకోవచ్చా? ఈ ప్రశ్న హిందుత్వమే ప్రాణంగా, బీజేపీనే నినాదంగా బతికే ఆ పార్టీ అమాయక కార్యకర్తలను బాధించవచ్చు. కానీ అది ప్రశ్న మాత్రమే కాదు, కట్టర్ హిందువులకు బీజేపీ విశ్వరూపాన్ని బట్టబయలు చేసే ప్రశ్న. బీజేపీ నాయకుల నినాదాలు ఏజేపీ కోసమని తెలియక నమ్మి మోసపోయిన సగటు భారతీయ ఓటరును ఓదార్చే ప్రశ్న.
అదానీ పెట్టుబడులు మోదీ యుద్ధనాదాలు: ఈ దేశంలో ఒక గొప్ప నాటకం నడుస్తున్నది. దేశభక్తి మాటున దేశద్రోహం జడలు విప్పుతున్నది. అదిప్పుడు ఈ దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదానీ, చైనాకు చెందిన ఈస్ట్ హోప్ గ్రూప్ కంపెనీలో పెట్టుబడులు పెడతాడు వేలకోట్లు వెనకేస్తాడు. నరేంద్ర మోదీ చైనా మీద యుద్ధం చేస్తాడు, బార్డర్లో మన సైనికులు చనిపోతారు. అదానీ, పాకిస్థాన్కు నీడలా ఉంటూ నిత్యం ఆర్థిక సహాయం అందిస్తున్న అజర్ బైజాన్ దేశంలో పెట్రో కెమికల్స్, మైనింగ్, మెటలార్జీ పరిశ్రమల్లో వేలకోట్లు పెట్టుబడులు పెడతాడు, అందినంత సంపదను పోగేస్తాడు. నరేంద్ర మోదీ పాకిస్థాన్తో యుద్ధం చేసి ఆక్రమిత కశ్మీర్ను తీసుకొస్తానని శపథం చేస్తాడు. వందల మంది సైనికులు, ప్రజలు తీవ్రవాదుల దాడుల్లో చనిపోతారు. సెంటిమెంట్ రగిలించి పాకిస్థాన్తో క్రికెట్ మ్యాచ్లను నిషేధిస్తారు. అదానీకి మాత్రం అన్ని వ్యాపార అనుమతులను ఇచ్చేస్తారు.
పాకిస్థాన్తో ఉన్న విభేదాల కారణంగా 2021లో అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్, ఇరాన్లకు ముంద్రా పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులను నిషేధించిన అదానీ గ్రూప్.. నెల కూడా తిరగకుండానే మళ్లీ అనుమతులను మంజూరు చేసింది. అయినా నరేంద్రమోదీ కిమ్మనలేదు. కానీ ఏండ్లు దాటినా ఇంకా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్లు మాత్రం జరగడం లేదు. మన దేశాన్ని ఛిన్నాభిన్నం చేయాలనే పాకిస్థాన్తో మ్యాచ్ జరగాలని ఏ భారతీయుడు కోరుకోడు. కానీ.. ఈ దేశంలో సెంటిమెంట్లు ఒక్క క్రీడలకే ఉంటయా? వ్యాపారాలకు ఉండవా? ఇక పాకిస్థాన్కు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచే సౌదీ అరేబియాలో అదానీ పెట్టుబడులు ప్రవాహంలా సాగుతుంటాయి, తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉంటాడు. మోదీ మాత్రం పాకిస్థాన్కు అండగా నిలిచే ఏ దేశమైనా మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని హెచ్చరికలు చేస్తాడు. ఇంకా దౌర్భాగ్యమైన విషయమేమంటే.. అదానీ, శ్రీలంకలో పునరుత్పాదక విద్యుత్ కంపెనీలలో 442 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడతాడు. ఆ వెంటనే నరేంద్ర మోదీ సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు ఆర్థిక సహాయం చేస్తాడు, అక్కడి రాజకీయాల్లో వేలు పెడతాడు, వసుధైక కుటుంబమని స్టేట్మెంట్లు ఇస్తాడు. మనం టీవీల్లో చూసి మురిసిపోతుంటాం. కానీ, ఇక్కడ ఏదీ దేశం కోసం జరగడం లేదన్న సత్యాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నాం.
అదానీ పెట్టే ప్రతీ పైసా అదానీకి ఉపయోగపడుతుంది. పరోక్షంగా భారత్పై దండెత్తే చైనాకు,పాకిస్థాన్కు చేరుతుంది. కానీ కార్పొరేట్ల గుప్పిట్లోని మీడియాలు ఇవేవి ప్రజలకు తెలియనివ్వవు. అంటే దేశం ఏమైపోయినా పర్లేదు. కానీ, అదానీ బావుండాలన్నదే మోదీ ఎజెండా.
అందుకే ఇప్పుడు ప్రజలంతా బీజేపీని ఏజీపీగా పిలుస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇంకా దేశం కోసమని నమ్మిస్తున్న ఏజేపీ సోషల్ మీడియా సైన్యం పడుతున్న దుర్మార్గమైన పాట్లను దేశమంతా గర్హించాల్సిన అవసరం ఉన్నది. అదానీ అవినీతిని హిండెన్బర్గ్ నివేదిక బట్టబయలు చేయగానే బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఎలాగైనా అదానీని కాపాడలనే మోదీ-షా అత్యుత్సాహం దేశాన్ని అధోగతిపాలు చేస్తుంది. అందుకోసం అత్యంత హేయమైన రాజకీయ క్రీడకు తెరలేపింది. అంతా వారనుకున్నట్టే జరుగుతుంది.
అదానీకి నష్టం జరిగితే దేశం అల్లకల్లోలమైపోవాల్సిందేనా?: మీరు అనుకున్నట్టే హిండెన్బర్గ్ నివేదిక పతాక శీర్షికల నుంచి లోపలి పేజీల్లోకి మారిపోయింది. రాహుల్గాంధీకి జైలు శిక్ష పడింది, పార్లమెంట్ సభ్యత్వమూ ఊడిపోయింది. మీరనుకున్నట్టే బింద్రన్వాలే 2.0 దెబ్బతో పంజాబ్ అట్టుడికిపోతున్నది. మీరనుకున్నట్టే ఢిల్లీ ప్రభుత్వం దిగులుపడుతుంది. మీరనుకున్నట్టే లాలూప్రసాద్ యాద వ్ కుటుంబం సీబీఐ, ఈడీల దాడులతో ఆగమైపోతుంది. మీరనుకున్నట్టే మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం కూలిపోయింది, మీతో కలిసి దశాబ్దాలుగా కలిసి పనిచేసిన శివసేన పార్టీ బాల్ఠాక్రే కుటుంబం నుంచి చేజారిపోయింది. మీరనుకున్నట్టే మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో, అరుణాచల్ప్రదేశ్లో, బీహార్లో, గోవాలో, మణిపూర్లో, ఉత్తరాఖండ్లో ప్రభుత్వాలు కుప్పకూలిపోయి బీజేపీ సామ్రాజ్యాలు వెలిశాయి, మీరు ఉసిగొల్పిన ఈడీ దాడులకు 24 మంది కాంగ్రెస్ లీడర్లు, 11 మంది తృణమూల్ కాంగ్రెస్ లీడర్లు, 11 మంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, 8 మంది శివసేన, ఆరుగురు డీఎంకే, ఐదుగురు ఆర్జేడీ, ఐదుగురు బీఎస్పీ, ఐదుగురు సమాజ్వాదీ, ఐదుగురు టీడీపీ, ముగ్గురు ఆప్తో పాటు చిన్నాచితక పార్టీలన్ని అల్లకల్లోలమైపోతున్నాయి.
2014 నుంచి నిన్నటి కల్వకుంట్ల కవిత దాక ఏజేపీ ఈడీ దాడులతో వేధించిన నాయకుల సంఖ్య అక్షరాల 122. వీరంతా ఈడీ దాడులతో సతమతమైపోతున్నారు. మీరనుకున్నట్టే వీరంతా విచారణలు, జైలు జీవితాలతో కృంగిపోతున్నారు. మీరనుకున్నట్టే లోక్పాల్ లోకం పాలైంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రైట్ కోల్పోయింది. మీ ప్రచార దుగ్ధకు ప్లానింగ్ కమిషన్ బలైపోయింది. కానీ రైతులను కార్లతో తొక్కించిన నేతలు మాత్రం సాధువులైపోయారు, దళితులను హింసించిన నేతలు మహానుభావులైపోయారు, అవినీతి అక్రమ సంపాదనతో కోట్లు రూపాయల కట్టలు ఇంట్లో దొరికిన బీజేపీ అవినీతి రాజకీయవారసులు నీతిమంతులైం డ్రు, మొత్తంగా దేశవ్యాప్తంగా బీజేపీ నాయకుల అవినీతి, అక్రమాలు, ఘోరాలు, నేరా లు అబద్ధమైపోయాయి. కానీ ఒక్కటి నిజం.
పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్ట చింతనం,వితాథాభినివేశశ్చ త్రివిధం కర్మ మానసం ఇతరుల డబ్బు దోచుకోవాలనే ఆలోచన, పరులకు కీడు తలపెట్టాలనే తలంపు, శరీరాభిమానం ఎప్పటికి పాపమే. ఇలాంటి పాపాలకు తగ్గ శిక్ష తప్పక పడుతుందంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు.
బండి సంజయ్ అవాకులు చెవాకులు: ‘నవ్విపోదురు గాక నాకేమి సిగ్గు’ అన్నట్టుగా ఉన్నది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరు. అసలు పేపర్ లీకైందని పోలీసు కేసు పెట్టిందే టీఎస్పీఎస్సీ. లక్షల మంది బిడ్డలు ఆగమైతరనే ఆవేదనతో రాజకీయ ఇబ్బంది వస్తదని తెలిసి కూడా పేపర్ లీక్ వ్యవహారాన్ని బయటపెట్టింది. కేసును సమగ్రంగా విచారించేందుకు సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) నిందితులను విచారిస్తూ వారి దురాగతాలను నిత్యం ప్రజలకు వివరిస్తుంది. నిరుద్యోగులు రంధి పడొద్దని భరోసా కల్పిస్తుంది. ఇదంతా ఇలా ఉంటే బండి సంజయ్ మాత్రం తుపాకీ రామున్ని మరిపిస్తున్నాడు. రోజుకొక నాయకునిపై విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొనే ప్రయ త్నం చేస్తున్నాడు. ఏదైనా ఆధారాలు ఉంటే ఇవ్వమని సిట్ బృందం నోటీసులు ఇస్తే మాత్రం నేనివ్వనని లీగల్ టీంను పంపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రోజుకొక జిల్లాలో ఇంతమంది క్వాలిఫై అయ్యారు, అంతమంది క్వాలిఫై అయ్యారని విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ చిల్లర రాజకీయం పాల్పడుతున్నాడు. పేపర్ లీకేజీ అనేది క్షమించరాని నేరం, అందుకే ప్రభుత్వం అత్యంత వేగంగా విచారణ జరుపుతుంటే చూడలేక సన్నాసి మాటలు మాట్లాడి నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరేమైతే మాకేంటి, రాష్ట్రం ఎటుపోతే మాకేంటి నా రాజకీయం పచ్చగా ఉంటే చాలనుకునే దుర్మార్గమైన చర్యలకు పాల్పడటం బండి సంజయ్కి మాత్రమే చెల్లింది.
నిజంగా బండి సంజయ్ దగ్గర ఆధారాలుంటే సిట్కు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఏదైనా కోర్టుకు ఇవ్వచ్చు, ప్రజాక్షేత్రంలో చూపించొచ్చు.. కానీ వారు అలాంటివేం చేయరు. ఆయన పార్టీలోని లుకలుకలు బయటకు రాకుండా ఆయనకు దొరికిన అస్త్రం పేపర్ లీకేజీ. అంతే తప్ప ఏనాడు వారికి నిరుద్యోగుల మీద ప్రేమ లేదు, ఉండదు. ఉంటే.. దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని గద్దెనెక్కిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతుంటే బండి సంజయ్ ఎందుకు నిలదీయరు? వాళ్ల పార్టీ నాయకుడిని ప్రశ్నించడం చేతగాదు కానీ, తెలంగాణలో అధికారంలోకి వచ్చి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తమని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. పోరాడి తెలంగాణను సాధించుకున్న తెలంగాణ బిడ్డలకు ఆ మాత్రం అవగాహన లేదనుకుంటున్నాడా బండి సంజయ్?
-శ్రీపాద రమణ