విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై మిడతల దండులాగా పడిపోవటం, ఈడీ, సీబీఐ, ఐటీ దర్యాప్తుల పేరుతో నానా హంగామా సృష్టించటం, అధికారపార్టీ నేతలను భయకంపితులను చేయటానికి ప్రయత్నించటం, వారి కుటుంబ సభ్యులను కూడా కేసుల పేరుతో వేధించటం, గవర్నర్ వ్యవస్థను పూర్తిస్థాయిలో దుర్వినియోగం చేయటం, అంతిమంగా ప్రభుత్వాన్ని కూల్చి దొడ్డిదారిన అధికారం చేపట్టటం. ఇదీ కేంద్ర సర్కారు దన్నుతో బీజేపీ అనుసరిస్తున్న కూటనీతి.
ఎనిమిది రాష్ర్టాల్లో ఈ విధంగానే ఆ పార్టీ ప్రభుత్వాలను కూల్చింది. పశ్చిమ బెంగాల్లోనూ ఇదే వ్యూహాన్ని అనుసరించింది. అయితే, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ ముందు ఆ పాచికలు పారలేదు. బొక్క బొర్లా పడింది బీజేపీ. ఆ అవమానం నుంచి, ఆ ఓటమి నుంచి ఎటువంటి గుణపాఠం నేర్వకుండా, ఇప్పుడు తెలంగాణలో కూడా అదే తరహా కుట్రకు దిగింది. చర్వితచర్వణంగా బెంగాల్ ఎపిసోడ్ తెలంగాణలో రిపీట్ అవుతున్నది.
1. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎనిమిది దఫాల్లో ఎన్నికలు జరిగాయి. మమతను ఎలాగైనా గద్దె దించాలన్న వ్యూహంలో భాగంగా, ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘంగా ఎన్నికల ప్రక్రియ ఉండేలా చూసుకున్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. ఎనిమిది దఫాల్లో ఎన్నికల ప్రక్రియను నిర్వహించటం ద్వారా తమకు ప్రచారం చేసుకోవటానికి, మమతను ఇబ్బంది పెట్టటానికి కావలసినంత సమయం ఉంటుందని బీజేపీ భావించింది. ఎన్నికలు జరుగటానికి కొంతకాలం ముందు నుంచే కమలం పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఆ పార్టీ చేసిన మొదటి పని ఆర్ఎస్ఎస్ను విస్తరించటం. 2001లో బెంగాల్లో వెయ్యి కన్నా తక్కువ ఆర్ఎస్ఎస్ శాఖలు ఉంటే వాటిని 2020 నాటికి 3,300కు విస్తరించారు. వీటి ద్వారా గ్రామీణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.
తెలంగాణలో కూడా బీజేపీ దీనిని అనుసరిస్తున్నది. ఆర్ఎస్ఎస్ ప్రచారం, కార్యకలాపాలు గతంలో ఎన్నడూ లేనంతగా హైదరాబాద్తోపాటు, వివిధ జిల్లాల్లో కనిపిస్తున్నాయి. ఇటీవల దుర్గాపూజ ఉత్సవాల్లో భాగంగా రాజధాని నగరంలోని పలు కాలనీల్లో ఆర్ఎస్ఎస్ శ్రేణులు కవాతు నిర్వహించాయి. ఇలాంటిది మొదటిసారని అక్కడి స్థానికులు తెలిపారు.
2. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహంలో రెండో దశ.. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన రోహింగ్యాలు కేంద్రంగా పెద్ద ఎత్తున ప్రచారం. వారిని రాష్ర్టానికి, దేశానికి పెనుప్రమాదంగా చిత్రీకరిస్తూ ఈ ప్రచారం జరిపింది. తద్వారా బెంగాల్లోని హిందువులలో భయాన్ని నెలకొల్పింది. హిందువులకు తానే రక్షకురాలినన్నట్లు సోషల్ మీడియాలో రకరకాల కథనాలను ప్రచారంలో పెట్టింది. తెలంగాణలో కూడా దీనినే అమలు చేస్తూ.. ముస్లింలపై విద్వేషాన్ని పెంచిపోషిస్తున్నది బీజేపీ. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా ‘మసీదులను తవ్వుదాం.. శివం (శివలింగం) దొరికితే మాది.. శవం దొరికితే మీది’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేసి జైలు పాలయ్యారు. హిందూ-ముస్లింల సఖ్యతకు, గంగా జమునీ తెహ్జీబ్కు కేంద్రంగా వర్ధిల్లిన తెలంగాణలో మతచిచ్చు రాజేయటానికి బీజేపీ అమలు చేస్తున్న పథకం ఇది.
3. మూడోదశలో భాగంగా.. బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ను బలహీనపర్చటంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఆ పార్టీ నాయకులను కేసుల పేరుతో బెదిరించింది. ముఖ్యంగా, సీనియర్ నేతలు, కీలక నేతల మనోైస్థెర్యాన్ని దెబ్బకొట్టాలని చూసింది. ఈ మేరకు శారదా చిట్ఫండ్ కుంభకోణాన్ని అవకాశంగా వాడుకున్నది. పలువురు తృణమూల్ నాయకుల ఇండ్లపై, కార్యాలయాలపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో మోదీ సర్కార్ దాడులు, సోదాలు జరిపించింది. మమత బంధువులపైనా గురి పెట్టింది. ముఖ్యంగా ఆమె మేనల్లుడు, పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న అభిషేక్ బెనర్జీపై, అతడి భార్యపై కేసులు పెట్టారు. విచారణ పేరుతో గంటలపాటు ప్రశ్నించారు. మమత ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నదని, బంధుప్రీతితో పక్షపాత వైఖరి చూపుతున్నదని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. ఈ విధంగా తృణమూల్పై దాడి చేసి, ఆ పార్టీ ఎమ్మెల్యేలను, నాయకులను భయభ్రాంతులకు గురి చేసి తమ పార్టీలోకి వచ్చేలా ఒత్తిడి తెచ్చింది బీజేపీ. ముకుల్ రాయ్, సువేందు అధికారి, శోవన్ ఛటర్జీ లాంటి అగ్రశ్రేణి తృణమూల్ నేతలు ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరారు. తృణమూల్ కంటే ముందు బెంగాల్ను అప్రతిహతంగా, దశాబ్దాలపాటు ఏలిన వామపక్ష పార్టీలనూ బీజేపీ వదల్లేదు. ఆ పార్టీల నేతలను కొనుగోలు చేసింది. లెఫ్ట్ను తీవ్రంగా దెబ్బతీసింది.
తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ ఇదే సీన్ను రిపీట్ చేస్తున్నది. టీఆర్ఎస్లో పలు పదవులు, అవకాశాలు పొంది సీనియర్ నేతలుగా చెలామణి అయిన కొందరు అవకాశవాదులను తమ పార్టీలోకి చేర్చుకున్నది. టీఆర్ఎస్ పట్ల, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల విశ్వాసంతో ఉన్న నేతలపై కేసుల పేరుతో వేధింపులకు దిగుతున్నది. ఈడీ, ఐటీ సంస్థల ద్వారా దాడులు జరిపిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి భాగస్వామ్యం లేని బీజేపీ నాయకులు.. తెలంగాణను తీసుకురావటమేగాక రాష్ర్టాన్ని పలు రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్పై, ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు, తలాతోకలేని ఆరోపణలు, సంస్కార విహీనమైన భాషను ఉపయోగిస్తున్నారు.
4. పశ్చిమ బెంగాల్లో బీజేపీకి సంస్థాగతంగా గానీ, క్షేత్రస్థాయిలోగానీ బలం లేదు. అయినప్పటికీ, ఆ పార్టీ ధన బలాన్ని నమ్ముకున్నది. ఎన్నికలు సమీపించే సమయంలో భారీ రోడ్డు షోలు నిర్వహించింది. మోదీ, అమిత్ షా ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో 102 రోడ్డు షోలు, సభల్లో పాల్గొన్నారు. జనాల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. మరోవైపు, మీడియాతో సైతం బీజేపీ అసత్యాలు పలికించింది. రాష్ట్రంలో బీజేపీ పవనాలు బలంగా వీస్తున్నాయని ఏకపక్ష కథనాలు రాయించింది. మైనార్టీ వర్గం ఓట్లు లేకపోయినా గెలుస్తామంటూ హిందువులను మతం పేరుతో ఆకర్షించి, వారి ఓట్లు పొందేందుకు ప్రయత్నించింది. నిత్యం చండీ పారాయణం చేసే మమతా బెనర్జీని హిందూ మత వ్యతిరేకిగా చిత్రించే వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. చివరకు, ప్రధానమంత్రి పదవిలో ఉన్న నరేంద్రమోదీ వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు.
సీఎం మమతా బెనర్జీని ‘దీదీ.. ఓ దీదీ’ అంటూ హేళన చేశారు. ఓట్ల కోసం ప్రధాని చిత్ర విచిత్రమైన వేషాలు వేశారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా గడ్డం పెంచి బెంగాలీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
తెలంగాణలో కూడా బీజేపీకి సంస్థాగత బలం లేదు. అయినప్పటికీ, ధనబలాన్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నది. మునుగోడు ఉపఎన్నికే తాజా ఉదాహరణ. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టును రాజగోపాల్రెడ్డికి ఇచ్చి, ఆ ఉప ఎన్నికను కృత్రిమంగా సృష్టించింది. తెలంగాణ ప్రజాక్షేత్రంలో బీజేపీ బలం నామమాత్రం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 119 స్థానాల్లో పోటీ చేస్తే.. 106 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. అయినప్పటికీ, తాము ఇక్కడ బలంగా ఉన్నామని చాటుకునేందుకు నానా తంటాలు పడుతున్నది. హైదరాబాద్లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఆర్భాటంగా నిర్వహించింది. బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఆ పార్టీ అగ్ర నాయకులు, కేంద్రమంత్రులు ఏదో ఒక వంకతో తెలంగాణలో పర్యటిస్తున్నారు. మరోవైపు, సోషల్ మీడియాలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా అనేక అబద్ధాలను బీజేపీ ప్రచారం చేస్తున్నది. కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉన్నదంటూ, పరమ భక్తుడైన కేసీఆర్ను కూడా హిందూ మత వ్యతిరేకిగా చిత్రించేందుకు విఫల యత్నం చేస్తున్నది.
ఎన్ని ట్రిక్కులు ప్రయోగించినా బీజేపీ పాచికలు బెంగాల్లో పారలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లా పడింది. మమతా బెనర్జీ మరోసారి జయభేరి మోగించారు. అంతకుముందుకన్నా ఎక్కువ సీట్లతో ఘన విజయం సాధించారు. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఏ పార్టీ గెలవనంత మెజారిటీని కైవసం చేసుకున్నారు. దీంతో బీజేపీది బలుపు కాదు వాపు మాత్రమేనని అందరికీ అర్థమైంది. బీజేపీ ఒత్తిళ్లతో, బెదిరింపులతో, అబద్ధాల ప్రచారంతో తృణమూల్ను వీడి బీజేపీలో చేరిన పలువురు నాయకులు మళ్లీ సొంత గూటిని చేరుకున్నారు. విచిత్రమైన విషయమేమిటంటే.. ఎన్నికలకు ముందు శారద కుంభకోణం అని, అవినీతి అని, అక్రమాలని, బంధుప్రీతి అని నానారభస సృష్టించిన బీజేపీ ఎన్నికల తర్వాత వాటి సంగతే వదిలిపెట్టింది. అంటే అదంతా ఎన్నికల కోసం ఆ పార్టీ ఆడిన నాటకమేనని అర్థమైంది. రోహింగ్యాలతో హిందువులకు ముప్పు అంటూ చేసిన ప్రచారం కూడా వట్టిదేనని రుజువైంది. రోహింగ్యాలు పూర్తిగా కేంద్రం పరిధిలో ఉంటారని ప్రజలకూ తెలిసి వచ్చింది.
తెలంగాణలోనూ బీజేపీకి ఇదే అనుభవం ఎదురుకానున్నది. రాష్ట్రంలో శాంతిభ్రదతల పరిస్థితి ఎంతమాత్రం అదుపు తప్పకుండా సంఘవిద్రోహ శక్తులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో, మతచిచ్చు రాజేద్దామనుకునే బీజేపీ కుట్రలు ఫలించటం లేదు. వందల కోట్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని, తద్వారా టీఆర్ఎస్ నైతికైస్థెర్యాన్ని దెబ్బ తీయాలని బీజే పీ చూసింది. కానీ, ఎమ్మెల్యేలు తమను గెలిపించిన తెలంగాణ ప్రజల పట్ల, తమ పార్టీ అధినేత కేసీఆర్ పట్ల విధేయత చూపి కుట్రధారులనే పోలీసులకు పట్టించారు. అటు మునుగోడు ఓటర్లు సైతం బీజేపీకి గట్టి గుణపాఠం నేర్పించారు. ఈ విధంగా బెంగాల్ వ్యూహం తెలంగాణలో ఇప్పటికే ఎదురు తన్నింది.
బెంగాల్లో దర్యాప్తు సంస్థలను, సంఘ్ పరివార్ను, సోషల్ మీడియాను ఉపయోగించి ఎన్నికలను యుద్ధంగా మార్చినందుకు బెంగాలీలు బీజేపీకి తగిన శాస్తి చేశారు. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి భారీ మెజార్టీతో తృణమూల్ను గెలిపించారు. తెలంగాణ పోరుగడ్డ. ఇక్కడ బెంగాల్ను మించిన తీర్పు వెలువడుతుంది.