రాష్ట్రంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం మార్చి 5న ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్కు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్రెడ్డి ఆయనతో వేదికను పంచుకుంటూ అన్న మాటలు కొత్త అంచనాలకు తావిచ్చాయి. తన ప్రసంగంలో రేవంత్రెడ్డి ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ మొదటి మాటగానే ‘ప్రధానమంత్రి అంటే పెద్దన్న. ప్రధాని సాయం లేకుండా రాష్ర్టాలు ఎదగలేవు’ అని అన్నారు. బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులందరి తరపున వకాల్తా పుచ్చుకొన్నట్టు ఆయన అలా మాట్లాడటం విచిత్రంగా ఉన్నది. విపక్ష పాలిత రాష్ర్టాలు మోదీని సవాలు చేస్తుంటే రేవంత్ మాత్రం పెద్దన్న అని సంబోధించడం వెనుక దిగజారుడుతనముంది. ఇద్దరి మధ్య వ్యక్తిగత బంధాన్ని మరింత బలంగా మార్చుకోవాలనే ప్రయత్నం ఆయన మాటల వెనుక దాగున్నది.
CM Revanth Reddy | పాలనాపరంగా దేశానికి ప్రధాని, రాష్ర్టానికి ముఖ్యమంత్రి పెద్ద. ఇది వ్యవస్థలో అంతర్భాగం. రాష్ర్టాలను సమదృష్టితో చూడాల్సిన బాధ్యత ప్రధానిది. బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ప్రధానికి ఎలాంటి రాజకీయ వైషమ్యాలున్నా వాటిని పక్కనపెట్టి దేశ ప్రధాని హోదాలో ఆయన అందరినీ, అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాలి. బీజేపీ పాలిత రాష్ర్టాలకే కాదు, దేశ ప్రజలందరికీ ఆయనే ప్రధాని. దేశవ్యాప్తంగా ఒకే రకమైన అభివృద్ధికి ఆయన పాటుపడాలి. అయితే అందుకు విరుద్ధంగా విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం, నిధుల కేటాయింపులో వివక్ష చూపడం మోదీకి ఓ వినోద, వికృత క్రీడగా మారింది. దేశ ప్రధాని ముందు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి గుజరాత్ ప్రస్తావన తీసుకురావడం మరో వింత. తెలంగాణలో గుజరాత్ తరహా అభివృద్ధికి కృషి చేస్తామని సభాముఖంగా రేవంత్ మాట్లాడటం కేవలం మోదీని మురిపించడానికే. గుజరాత్ రాష్ట్రమేమీ దేశానికి రోల్మాడల్ కాదు. అలాంటి అభివృద్ధే రేవంత్రెడ్డి కోరుకుని ఉంటే.. ఆయన ముందుగా కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించాల్సింది.
అదే సభలో ‘ప్రధాని కోరుకున్నట్టు దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ల డాలర్లకు చేరుకోవాలని కోరుకుంటున్నాను’ అని రేవంత్రెడ్డి అనడం వెనుక మరో అర్థం దాగి ఉంది. భవిష్యత్తులోనూ మోదీ పాలనే కొనసాగాలని రేవంత్రెడ్డి పరోక్షంగా ఆశించినట్టే అవుతుంది. గుజరాత్లో సబర్మతి నదిని ప్రక్షాళన చేసినట్టు మూసీని స్వచ్ఛంగా మార్చేందుకు తోడ్పడాలని కూడా ప్రధానిని రేవంత్ కోరారు. అయితే సబర్మతి నది స్వచ్ఛతపై గతంలో రాజ్యసభలో చర్చ జరిగింది. సబర్మతిలోకి చేరే నీళ్లను శుద్ధి చేసే ప్లాంట్లను నిర్మించినప్పటికీ.. పారిశ్రామిక వాడల నుంచి వచ్చే రసాయన జలాలు శుద్ధి కాకుండానే నదిలోకి చేరుతున్నాయని, నగరంలోని మురికినీరు కూడా నదిలోకి వస్తున్నదని ఆ సందర్భంగా సభ్యులు తెలిపారు. రేవంత్రెడ్డి ప్రసంగం అనంతరం మోదీ ఆయనను మెచ్చుకోలుగా గట్టిగా కరచాలనం చేయడం మరో మెరుపు. అయితే అదే సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని తన ధోరణిలోనే కడిగిపారేశారు.
‘మీరు మూడు పార్టీలు మారారు. మీ డీఎన్ఏలో ఏ పార్టీ ఉంది?’ అని రేవంత్రెడ్డిని ఓ ఇంటర్వ్యూలో ఇండియా టుడే ప్రతినిధి ప్రశ్నించగా.. తెలంగాణ ప్రజల డీఎన్ఏ అని ఆయన సమాధానమిచ్చారు. తమ రాజకీయ జీవితం కాంగ్రెస్తోనే అని చాలా మంది కాంగ్రెస్ లీడర్లు చెప్పే రీతిలో రేవంత్ సమాధానం లేదు. ఈ లెక్కన ఆయన కాంగ్రెస్ బలహీనతను ఆసరాగా చేసుకుని నోరున్న నేతగా ఆ పార్టీలో చేరి, తన ఆకాంక్షలను నెరవేర్చుకున్నారని అనక తప్పదు.
నష్టాల్లో నడుస్తున్న కంపెనీని కొని కొందరు లాభాల్లోకి తెస్తారు. ఆ వ్యాపార చాతుర్యాన్నే ఆయన రాజకీయాల్లో చూపించారు. అందుకే రేవంత్ ప్రసంగాల్లో జనం పట్ల ప్రేమ కన్నా, బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత విమర్శలే ఎక్కువగా కనిపిస్తాయి. హుందాతనంతో వ్యవహరిస్తూ.. ఎందరో రాజనీతిజ్ఞులు కూర్చున్న ముఖ్యమంత్రి పీఠం గౌరవాన్ని కాపాడే బాధ్యత తనపై కూడా ఉన్నదనే విషయాన్ని రేవంత్రెడ్డి గ్రహించాలి.
రాజకీయాలు నెరపడం కొందరికి జన్మతః వచ్చిన విద్య. అలాంటివారు గెలుపే లక్ష్యంగా ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు. పార్టీలు వారి విజయానికి మెట్లలాంటివి. అలాంటివారు విజయం సాధించిన తర్వాత ఎక్కిన మెట్టును వదిలేసి మరో మెట్టు చూసుకుంటారు. చదువుకొనే రోజుల్లో విద్యార్థి పరిషత్ క్రియాశీల సభ్యుడిగా ఉన్న రేవంత్.. నిజానికి ఆ విద్యార్థి సంఘం శిక్షణ ప్రకారం తన సిద్ధాంతాన్ని వదులుకోకూడదు. రాజకీయాల్లో చేరాలని ఆయన అనుకొని ఉంటే బీజేపీలో కొనసాగాలి. కానీ, ఆయన సభ్యుడిగా ఉండే కన్నా శాసించేవాడిగా ఉండాలనుకున్నారు. రాజకీయంగా బీజేపీ బలహీనంగా ఉందని రేవంత్రెడ్డి భావించారు. అందుకే ఆ జెండా పట్టుకొంటే ఓట్లు రావని గ్రహించి స్వతంత్ర అభ్యర్థిగా 2006లో జడ్పీటీసీగా, 2007లో ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2009లో టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. తెలంగాణ వచ్చాక 2017లో అప్పటికే ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్లోకి చేరారు. అలా దిక్కులేని కాంగ్రెస్ను ఆసరా చేసుకొని తన దుందుడుకు ధోరణితో ఆ పార్టీ పెద్దలను మెప్పించగలిగారు. సీనియర్లను పక్కకునెట్టి తొలుత పార్టీ అధ్యక్షుడిగా, మరో గంతేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవ్వగలిగారు.
అయితే రేవంత్రెడ్డి గొంతుపై ఓటుకు నోటు కేసు కత్తిలా వేలాడుతోంది. 2015 మేలో ఏడాది వయసున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు చంద్రబాబు పన్నిన కుట్రను అమలు చేస్తూ స్టింగ్ ఆపరేషన్లో ఆయన దొరికిపోయారన్న అభియోగమే ఆ కత్తికున్న పదును. నెల రోజుల కటకటాల జీవితం గడిపాక దొరికిన కండిషన్ బెయిల్పై ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అలా ఆయన జుట్టు మోదీ చేతిలో ఉంది. అందుకే మోదీ ముందు కీలుబొమ్మలా ఆడక తప్పడం లేదు. రాహుల్గాంధీ మాట కన్నా మోదీ మాటనే ఇప్పుడు ఆయనకు ఎక్కువ. లోక్సభ ఎన్నికలయ్యాక మోదీ కొరడా ఝుళిపిస్తే.. బీజేపీ ‘వాషింగ్ మెషిన్’ బోనులోకి వెళ్లక తప్పదు. కూచున్న సీఎం సీటు భద్రంగా ఉండాలే గానీ ఆయనకు ఏ పార్టీ అయినా ఒక్కటే.
ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో అధిక స్థానాలు వస్తే కాంగ్రెస్ తెప్ప మునిగే కాలం వచ్చినట్టే. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ బీజేపీ ఎంపీలు విర్రవీగిపోతారు. రాష్ర్టాన్ని కూడా వారే పాలిస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. కాంగ్రెస్ను ముప్పుతిప్పలు పెడతారు. అదను చూసి మోదీ-షా ద్వయం రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వాలను కూల్చడంలో వాళ్లు మహామాయగాళ్లు. పాలకపక్షాలను నిట్టనిలువుగా చీల్చిన కనికరం లేని చరిత్ర వారిది. ‘కాంగ్రెస్సే మా ప్రాణం, ఊపిరి’ అని భావించే పాత కాపులు తప్ప రేవంత్ బ్యాచ్ మొత్తం జంప్ కావచ్చు. తెలంగాణలో ఎక్కువ మంది బీజేపీ అభ్యర్థులు గెలిచేలా తెర వెనుక రాజకీయం నడుస్తోందని ఇప్పటికే కథనాలు వెలువడుతున్నాయి. ఏపీలో చంద్రబాబు కూటమి నెగ్గితే ఈ ప్రక్రియ మరింత వేగవంతం కావచ్చు. మొత్తానికి రేవంత్ చేజిక్కించుకున్న తెలంగాణ ‘చేతి’లోనే ఉంటుందా? చేజారి చిక్కులపాలవుతుందా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. జై తెలంగాణ నినాదాన్ని జనం మళ్లీ ఎత్తుకొని మట్టి గౌరవం కాపాడే సమయం ఇంకా ఎత్తిపోలేదు.
-బి.నర్సన్
94401 28169