దేశంలో ఎందరో పాలకులు వస్తుంటారు, పోతుంటారు. అందులో కొద్ది మందిని మాత్రమే ఈ చరిత్ర, సమాజం గుర్తుపెట్టుకుంటుంది. అలాంటి అతికొద్దిమంది నాయకుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు. తెలంగాణ స్వరాష్ట్రం, హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి, కోట్లమంది ప్రజలను, విద్యార్థులను, యువతను, ఉద్యోగులను ఏకతాటి మీదకు తీసుకొచ్చి కేంద్రాన్ని ఒప్పించిన నాయకుడు కేసీఆర్. ఎన్నో త్యాగాల తర్వాత తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం.
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదం తో రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కేసీఆర్. తొమ్మిదేండ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. అలాం టి వ్యక్తిపై భారతదేశంలో 54 ఏండ్లు పరిపాలన చేసి అవినీతికి మారుపేరుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు డు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
నాటి కాంగ్రెస్ పాలకులు చేసిన తప్పుడు నిర్ణయాలతో దేశాభివృద్ధి నేడు కుంటుబడిపోయింది, ఒకనాడు మనతో సమాన జీడీపీ కలిగిన చైనా నేడు ప్రపంచ ప్రగతిలో రెండవ స్థానంలో ఉన్నది. వారి ఆర్థిక ప్రగతి మనతో పోల్చుకుంటే ఐదు రెట్లు అధికంగా ఉన్నది. దీనికి కారకులు కాంగ్రెస్ పాలకులు కాదా? ఇలాం టి వాటి మీద ఎలాంటి చర్చలు చేయకుండా కేవలం అభివృద్ధి చేసే నాయకులపై ఎదురు దాడులు చేస్తూ, మాకు మళ్లీ అధికారం ఇవ్వండి, దేశ రూపు రేఖలు మారుస్తామని మాయ మాటలు చెప్తున్నారు.
ఒక్క మాటలో కాంగ్రెస్ పాలన గురిం చి చెప్పాలంటే… కరువులు, కరెంటు కష్టా లు, స్కాములు, కమిషన్లు. కరెంటు, సాగు, తాగు నీళ్లు లేక తెలంగాణ ఎడారిని తలపించింది. కరువు నివారణ కోసం కేంద్రం నిధులు విడుదల చేస్తే ఆ పార్టీ నాయకులే సగం తినేవారు. మిగిలిన పైసలు రావాలంటే అధికారులకు లంచాలు ఇవ్వాల్సిందే. ఇలాంటి తప్పులను కాంగ్రెస్ పార్టీ కప్పిపుచ్చుకొని, అభివృద్ధికి ఆదర్శమైనటువంటి ముఖ్యమం త్రి కేసీఆర్ను విమర్శించడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తున్నది.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెల రూపురేఖలే మారిపోయాయి. గ్రామాలన్నీ తారురోడ్లు , ధాన్యపురాశులు, నిండిన చెరువులు, పచ్చని పైరులు, వృద్ధుల నవ్వులు తారసపడుతున్నాయి. విశాలమైన పాఠశాల భవనాలు దర్శనమిస్తున్నాయి. మాడల్ స్కూల్స్, గురుకులాలు, పౌష్టికాహారంతో కూడిన భోజనాలు కనిపిస్తున్నాయి. మందులు దొరకని ప్రభుత్వ దవాఖానల స్థానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పాత కలెక్టర్ భవంతులు పోయి అందమైన కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు ఇట్ల ఒక్కటా, రెండా ఎన్నో నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఊరినిండా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళ, వృద్ధాప్య పింఛన్లు ఇట్లా ఏదో ఒక పథకం లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, ఎరువులు, విత్తనాలు, చెరువుల నిండా నీళ్లు, ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్తు, ధాన్యం కొనుగోళ్లతో ప్రతి రైతుకు కేసీఆర్ వెన్నెముక అయ్యారు.
ఒక్క మాటలో కేసీఆర్ పాలన గురించి చెప్పాలంటే, నాటి శ్రీరాముడి పాలనను తలపిస్తున్నది. ఇలాంటి వ్యక్తిని ప్రజల బాగు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మరోసారి ఎన్నుకోవలసిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉన్నది.
-తాళ్లపల్లి సురేందర్ గౌడ్
98497 99893