మనసున్న మనిషి, తెలంగాణ జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ఉద్యమ నాయకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, పాలనలో కూడా అదే స్థాయి ప్రభావాన్ని చూపిందా? అంటే..నూటికి నూరుపాళ్లు అవుననే సమాధానమే వస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని కేవలం మాటల్లోనే కాకుండా, అమల్లో చూపించాలని సంకల్పించి అందుకు ఫలితాలు సాధించారు. పిల్లల నుంచి పండు ముదుసలి వరకు, రైతు నుంచి ఉద్యోగి వరకు, ప్రతి వర్గానికీ చేరేలా సంక్షేమ పథకాలను రూపొందించి, కొత్త గవర్నెన్స్ మాడల్ను తీసుకొచ్చారు. పాలన అంటే కేవలం అభివృద్ధి, ప్రాజెక్టులు కాదు, ప్రతి కుటుంబానికి భరోసా ఇవ్వటం కూడా ముఖ్యమని భావించిన కేసీఆర్ ముందుకు వచ్చారు. ఆ ఆలోచనల ఫలితంగానే సంక్షేమ పథకాల విస్తరణ చేపట్టి, సక్సెస్ అయ్యారు.
గర్భిణులకు ఆరోగ్య భద్రత కల్పించటంతో పాటు, పుట్టిన శిశువుకు అవసరమైన మొదటి సంరక్షణ అందించాలనే ఉద్దేశంతో 2017లో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద గర్భిణులకు సుమారు రూ.12 వేల నుంచి 13 వేల వరకు ఆర్థిక సహాయం అందించటంతో పాటు 16కు పైగా అవసరమైన వస్తువులు అందించారు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు గణనీయంగా పెరిగాయి. లక్షలాది తల్లులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. కేసీఆర్ హయాంలో వెయ్యికి పైగా రెసిడెన్షియల్ గురుకులాలను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావిధానాన్ని మెరుగుపరిచారు. ఈ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనాలు. మిషన్ కాకతీయ ద్వారా సుమారు 46,000 చెరువులను పునరుద్ధరించారు. దీంతో భూగర్భ జలాలు పెరగటం, సాగు విస్తీర్ణం పెరగటం వంటి మార్పులు చోటుచేసుకున్నాయి. మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ తాగునీరు అందించారు. సమాజంలో బలహీన వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఆసరా పింఛన్లను పెంచారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అమలు చేయటం దేశంలోనే ప్రత్యేకంగా నిలిచింది. పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులు ఇవ్వాలనే లక్ష్యంతో 2014లో టీఎస్-ఐ పాస్ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ విధానం ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ర్టానికి వచ్చాయని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. నిరుద్యోగులకు లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభించాయి. ఉద్యోగావకాశాల సృష్టి ఆర్థిక అభివృద్ధికి దారితీసింది. సంక్షేమం అనే భావనను కేవలం మాటల్లోనే కాకుండా అమల్లో చూపించిన పాలన కేసీఆర్ది. తెలంగాణలో సంక్షేమం ఒక వ్యవస్థగా మారిన కాలం కేసీఆర్ హయాం. అందుకే మనసున్న మనిషి కేసీఆర్ మానవీయమైన పాలన, మహోన్నతమైన పథకాల కోసం ప్రజలు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు.
– (వ్యాసకర్త: టీఎస్ రెడ్కో మాజీ చైర్మన్) వై సతీష్రెడ్డి