రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నవి విపక్షాలు కాదు, విషవృక్షాలు. ప్రతిపక్షాల లక్ష్యం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. ఇందుకోసం అవి అబద్ధాలు ఆడటాన్ని అలవోకగా అలవాటు చేసుకున్నాయి. గత పదేండ్లుగా రాష్ట్రంలో జరిగిన ప్రగతి కండ్లముందు కనిపిస్తున్నా మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అంతిమంగా ప్రతిపక్షాలకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదు. తెలంగాణ సంక్షేమ గానం చెవులకు వినిపిస్తున్నా వినబడనట్టుగా నటిస్తున్నాయి.
ప్రాణాలను పణంగా పెట్టి, రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన్ను పట్టుకొని అవినీతిపరుడంటూ ఆరోపణలు చేస్తుంటాయి ప్రతిపక్షాలు. కానీ, ఆధారాలు చూపి రుజువు చేయమంటే మాత్రం ముందుకురావు. ఈ ప్రతిపక్షాలు భూతద్దం పెట్టి చూసినా ఆయనపై ఒక్క మరకను కూడా చూపించలేవు. ఈ విషయం ప్రతిపక్షాలకూ తెలుసు. కానీ, రాజకీయంగా ఉనికిలో ఉండాలంటే కేసీఆర్ లాంటి మహా వ్యక్తులపై మాట్లాడితే నిత్యం మీడియాలో ఉంటామనే ఉత్సుకతతో ప్రతిపక్షాలు ఇలా ప్రేలాపనలు చేస్తుంటాయనే విషయాన్ని ప్రజలు గ్రహిస్తూనే ఉంటారు.
రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేని ఓ కాంగ్రెస్ నాయకుడు ‘ధరణి’ పోర్టల్ను బంగాళాఖాతంలో విసిరేస్తానంటాడు. పారదర్శకతకు ప్రత్యక్ష సాక్షం ధరణి పోర్టల్. ఇలాంటి ఎన్నో బృహత్తర పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకు ప్రగతిఫలాలను అందిస్తున్నారు. ప్రజలు ఈ ఫలాలను అనుభవిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ విషయం లేని విపక్షాలు ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకోవడం విడ్డూరం. తెలంగాణ గంగగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుపై నోళ్లతో కన్నం వేస్తున్నారు. ప్రతిపక్షాల మోసాలను ప్రజలు చూస్తూ ఊరుకోరు. సరైన సమయంలో సరైన రీతిలో తగిన బుద్ధి చెప్తారు.
ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా ప్రజలు తీవ్రమైన సంక్షోభాన్ని చవిచూశారు. సుమారు యాభై ఐదేండ్ల కాంగ్రెస్ పాలనా కాలంలో తెలంగాణ రైతులు పడ్డ కష్టాలు మామూలువి కాదు. కరెంట్ లేక, లోవోల్టేజీతో మోటర్లు కాలిపోయి పంట నష్టపోయి ఉరికొయ్యలకు వేలాడిన రైతులెందరో. రాత్రిపూట కరెంట్ పెట్టేందుకు వెళ్లి షాక్లకు గురై మరణించిన రైతులు ఎందరో. ఇలా తెలంగాణలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి, రాష్ర్టాన్ని అంధకారమయం చేసిన చరిత్ర కాంగ్రెస్ది. ఆ పార్టీలోని నాయకులు అంతర్గత కలహాలు, పదవుల కోసం కొట్లాడుకోవడానికే పరిమితమయ్యారు. వాళ్లకు అభివృద్ధిపై పట్టింపెక్కడిది? ఇక ప్రస్తుతానికి వస్తే అబద్ధపు హామీలతో ఇంకోసారి ప్రజలను మోసం చేసేందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వండని కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావడం హాస్యాస్పదం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల జీవితాలు ఆగం కావడమే కాకుండా పైరవీకారులు, దళారుల రాజ్యంగా తెలంగాణ మారుతుందనడంలో సందేహం లేదు.
2014లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే రైతుల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలుచేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కింది. 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తూ రైతులను ఆదుకున్నారు. అంతేకాకుండా రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, గోదాంల నిర్మాణం లాంటి రైతు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు.
రైతు సంక్షేమం కోసం అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారు. అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్తురంగాన్ని ప్రగతిబాటలో పరుగులు తీయిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన కాకతీయ విద్యుత్తు పవర్ స్టేషన్, లోయర్ జూరాల, పులిచింతల జల విద్యుత్తు కేంద్రాలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ప్రజలు ప్రశాంతమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. అలాంటి ప్రజల మధ్య బీజేపీ విద్వేషం సృష్టించి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం జేస్తున్నది. విపక్షాలు ఎన్ని అబద్ధాలు, అసత్యాలు చెప్పినా, అభాండాలు వేసినా తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్కే పట్టంగడుతారనేది సుస్పష్టం.
(వ్యాసకర్త: సీనియర్ కన్సల్టెంట్)
– డాక్టర్ బీఎన్ రావు 98668 34717