‘భారతదేశంలో ఇప్పటికీ 63 శాతం మంది ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ప్రతి రోజు రెండు వేలమంది రైతులు వ్యవసాయాన్ని వదిలివెళ్తున్నారని, 40 శాతం మంది రైతులు వ్యవసాయం ఇష్టం లేకున్నా ఆ రంగంలోనే కొనసాగుతున్నట్టు ట్రాన్స్ఫామింగ్ ఇండియా సంస్థ ఒక సర్వేలో వెల్లడించింది. కానీ, తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన విధానాల వల్ల కేవలం 9 ఏండ్లలోనే సాగురంగం రూపురేఖలే మారిపోయాయి’ అని వివరిస్తున్నారు సామాజిక కార్యకర్త పులి రాజు.
అధికారం కోసం ఓట్ల సమయంలో ‘రైతే రాజు’, ‘రైతు దేశానికి వెన్నెముక’ అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి రైతుల చేత ఓట్లు వేయించుకొని గద్దెనెక్కుతారు నాయకులు. కాని, మరుసటి రోజు నుంచే రైతులను మర్చిపోతుంటారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతు బతుకు మాత్రం మారలేదు. వ్యవసాయ పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందాన ఉన్నాయి. ఎన్నికల ముందు దేశ రైతుల ఆదా యం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ, ఆ తర్వాత ఇచ్చిన మాట మరిచిపోవడమే కాదు, కార్పొరేట్ శక్తుల ఆదాయాన్ని రెట్టింపు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గణనీయమైన వ్యవసాయ సంస్కరణలను అమలుచేశారు. ఫలితంగా, తెలంగాణ ఎవుసం దేశానికి ఆదర్శంగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు సాగునీరు లేక బీడువారిన భూములు, కరువు, కరెంటు చావులు, రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలిచావుల వంటివి కొనసాగాయి. సుమారు పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న భారతదేశ 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నాలుగేండ్లలోనే (2018) వ్యవసాయరంగంలో ఊహకందని మార్పులు చోటుచేసుకొన్నాయి. వ్యవసాయం దండుగ కాదు, పండుగని ఆయన నిరూపించారు. సీఎం కేసీఆర్ స్వయాన రైతు కావడం ఈ రాష్ట్ర రైతులు చేసుకున్న అదృష్టం. తెలంగాణలోని ప్రతి రైతు లక్షాధికారి కావాలని, రైతు తలెత్తుకొని బతుకాలని, దేశానికి ఆదర్శంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. అందుకే వ్యవసాయరంగంలో పెను మార్పులు తీసుకొచ్చారు. దేశంలో వ్యవసాయానికి ఇంతటి ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ వ్యవసాయానికి రంగాన్ని సమూలం గా మార్చిన కొన్ని పథకాలు.
24 గంటలు నాణ్యమైన, ఉచిత విద్యుత్తు: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి గ్రామాల్లో 12 గంటలు, వ్యవసాయానికి ఏడు గంటలు మాత్రమే కరెంటు సరఫరా ఉండేది. ఆ కరెంటు కూడా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ కరెంటు కూడా నాణ్యమైనది కాక మోటర్లు, స్టార్టర్లు కాలిపోయి రైతులు అప్పుల పాలయ్యారు. రాత్రివేళలో బావుల దగ్గర కరెంట్ షాక్కు గురై ఎంతోమంది రైతులు ప్రాణాలు విడిచారు. (2009లో ఒక్క మెదక్ జిల్లాలోనే జనవరి నుంచి మే వరకు 33 మంది రైతులు కరెంట్ షాక్తో చనిపోయారు.) కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2016 ఏప్రిల్ 1 నుంచి తొమ్మిది గంటల కరెంటు, తర్వాత 2018 జనవరి 1 నుంచి 24 గంటల నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నది. ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చుచేసి వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
రైతుబంధు: రైతులకు పెట్టుబడి పెద్ద గుదిబండ. ఈ పెట్టుబడి లేకనే అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారని, రైతులకు ప్రత్యక్ష పెట్టుబడిని అందించాలని 2018, మే 10న ‘రైతుబంధు’ పథకాన్ని ప్రారంభించారు. రైతులకు ప్రత్యక్ష పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. సగటు మనిషి నుంచి ఐరాస వరకు ప్రశంసలు పొందిన పథకం రైతుబంధు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యవసాయరంగంలో 700 పథకాలు అమల్లో ఉన్నాయి. అందులో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు పథకం 20వ స్థానంలో ఉన్నట్టు యూఎన్ఓ, ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ జోష్ గ్రాసినో డిసల్వా అన్నారు. ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇప్పటివరకు గత ఐదేండ్లుగా రూ.65,192,30 కోట్ల నగదును పంపిణీ చేశారు.
రైతుబీమా : ఈ పథకం తెలంగాణ రైతులకు ఒక భరోసా. ఏ కారణం చేతనైనా 18 నుంచి 59 ఏండ్ల వయస్సు కలిగి పట్టాదారుడైన రైతు చనిపోతే ఆ కుటుంబం బజార్లో పడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఆగస్టు, 14న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎలాంటి పైరవీ లేకుండా 20 రోజుల్లోపు రూ.5 లక్షలు ఆ కుటుంబసభ్యుని ఖాతాలో జమవుతున్నాయి. ఈ ఐదేండ్లలో ప్రభుత్వమే మొత్తం ప్రీమియం రూ.5,383.83 కోట్లు చెల్లించిన ఈ పథకం ద్వారా 1,00,782 రైతు కుటుంబాలకు 5,039.10 కోట్ల రూపాయలు ఎల్ఐసీ చెల్లించింది. ఈ రైతు బీమాలో అర్హులైన రైతుల సంఖ్య 37.77 లక్షలు.
సాగునీరు: వ్యవసాయానికి భూమి ఎంత అవసరమో సాగునీరు కూడా అంతే అవసరం. తెలంగాణ దక్కన్ పీఠభూమిలో ఉంది. ఇక్కడ వ్యవసాయం అంతా కూడా వర్షాధారమే! ఇక్కడి రైతులు సాగునీటి కోసం బోర్ల మీద బోర్లు వేసి అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నారు. గంగాళంలా ఉన్న మన చెరువులన్నీ సీమాంధ్ర పాలనలో తాంబాలంలా అయ్యాయి. చెరువుల పునర్నిర్మాణం కోసం ‘మిషన్ కాకతీయ’ పేరుతో 2015, మార్చి 12న 20 వేల కోట్లతో 46,531 చెరువుల పునరుద్ధరణను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. అంతేకాకుండా కోటి ఎకరాల భూమికి నీరందించాలనే ఉద్దేశంతో గోదావరి నదిపై సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చుచేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. 150 టీఎంసీల నీటి నిల్వ కోసం మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్, సుందిళ్ల లాంటి రిజర్వాయర్లను నిర్మించింది. 38 లక్షల ఎకరాల భూమికి సాగునీరందిస్తున్నారు. 20 జిల్లాలకు శాశ్వత సాగు నీరందుతున్నది. ఎండకాలంలోనూ వాగులు, వంకలు, చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయి.
సాగు విస్తీర్ణం: తెలంగాణ భూ విస్తీర్ణం 2,45,05,758 ఎకరాలు. సాగుకు యోగ్యమైన భూమి 1,50,12,603 ఎకరాలు. 2013లో యాసంగి, వానకాలంలో 1,31,34,135 ఎకరాల భూమిని సాగు చేయగా 2021-2022లో యాసంగి, వానకాలంలో 2,02,38,181 ఎకరాలు సాగు చేశారు. స్వపరిపాలనలో సాగు గణనీయంగా విస్తరించింది.
పంటల దిగుబడి: 2014-15లో యాసంగి, వానకాలంలో 24.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, 2021-22 యాసంగి, వానకాలం మొత్తం 139.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయింది. రాష్ట్రంలో అమలుచేస్తున్న వ్యవసాయ విధానాల మూలంగా 115 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా ఉత్పత్తి అవుతున్నది.
రైతు రుణమాఫీ, ధరణి, మార్కెట్లో రైతులకు సద్దిమూట, హరితహారం, సాదా బైనామాల రిజిస్ట్రేషన్, ప్రతి ఐదువేల జనాభాకు ఒక ఏఈఓ నియామకం, నకిలీ విత్తనాలపై పీడీ యాక్ట్, రైతు సమితి ఏర్పాటు, విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్, భూసార పరీక్షలు, 2,601 రైతు వేదికలు, 23 వేల పంట కల్లాలు, ప్రతి ఊరికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. తెలంగాణ ఆవిర్భవించి పదో ఏట అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్రం లో 21 రోజులపాటు చేపట్టిన దశాబ్ది ఉత్సవాలను వ్యవసాయ శాఖతో ప్రారంభించడం వ్యవసాయరంగంపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమకు నిదర్శనం.
(వ్యాసకర్త: సామాజిక కార్యకర్త)
రైతులకు పెట్టుబడి పెద్ద గుదిబండ. ఈ పెట్టుబడి లేకనే అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారని, రైతులకు ప్రత్యక్ష పెట్టుబడిని అందించాలని 2018, మే 10న ‘రైతుబంధు’ పథకాన్ని ప్రారంభించారు. రైతులకు ప్రత్యక్ష పెట్ట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. సగటు మనిషి నుంచి ఐరాస వరకు ప్రశంసలు పొందిన పథకం రైతుబంధు.