కాలగమనంలో మరో ఏడాది ముగింపు దశకు చేరుకున్నది. మరికొద్ది రోజుల్లో 2023కు స్వస్తి పలికి 2024లో అడుగిడబోతున్నాం. రాబోయే ఏడాది యావత్ ప్రపంచానికి ఎంతో కీలకమైనది. ఎందుకంటే, ఈ ఏడాది ఎన్నికల నామ సంవత్సరంగా నిలవబోతున్నది. 21వ శతాబ్దాన్ని శాసిస్తున్న అనేక దేశాల్లో ఎన్నికల కోలాహలం కనిపించనున్నది.
Elections | ప్రపంచంలోని 40కి పైగా దేశాల్లో 2024లో ఎన్నికలు జరుగనున్నాయి. సుమారు 40 శాతానికిపైగా ప్రజలు ఈ క్రతువులో పాలుపంచుకోనున్నారు. ప్రపంచ జీడీపీలో అత్యధిక శాతాన్ని ఈ దేశాలు కలిగి ఉండటం గమనార్హం. ప్రపంచ పెద్దన్నగా చెప్పుకొనే అమెరికా, అప్పట్లో ఓ వెలుగు వెలిగిన రష్యా, ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందుతున్న భారత్, బ్రిటన్, మెక్సికో, దక్షిణాఫ్రికా, చిన్న దేశాలైన ఇరాన్, దక్షిణ సూడాన్, తైవాన్, భూటాన్తో పాటు యూరోపియన్ యూనియన్ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే వీటిలో కొన్ని దేశాల ఎన్నికలను యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్నది. ఎందుకంటే.. అక్కడ కొలువుదీరబోయే ప్రభుత్వాధినేతలను బట్టి ఆయా దేశాలతో పాటు ప్రపంచ భవితవ్యం ఆధారపడి ఉన్నది. అమెరికా, రష్యా, భారత్, మెక్సికో, బ్రిటన్, దక్షిణాఫ్రికా, యూరోపియన్ యూనియన్ ఈ జాబితాలో ఉన్నాయి.
భారతీయులు అత్యధికంగా ఉండే అమెరికా ఎన్నికలను అటు ఆ దేశంతో పాటు మన భారతీయులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. అక్కడ కొలువుదీరే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి ఆ దేశంలోని ప్రవాస భారతీయుల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. దాంతో పాటు వీసాల సంఖ్య పెంపు, గ్రీన్కార్డుల జారీ తదితర అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది నవంబర్లో అమెరికా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే 81 ఏండ్ల వయసు ఆయనకు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉన్నది.
అమెరికన్లు మరోసారి ఆయనపై నమ్మకం పెట్టుకుంటారా? లేదా? అనేది తేలాల్సి ఉన్నది. రిపబ్లికన్ పార్టీ తరఫున 77 ఏండ్ల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఆ పార్టీ తరఫున అభ్యర్థిత్వం విషయంలో ట్రంప్ కాస్త ముందంజలో ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే పలు అభియోగాలను ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా అక్కడి కోర్టు అనర్హత వేటు వేయడం ప్రతికూలంగా మారింది. పైకోర్టులకు అప్పీల్ వేసుకునే వెసులుబాటు ఉండటం ఊరట కలిగించే అంశం. ఒబామా హయాంలో తన కుమారుడు అయాచితంగా లబ్ధి పొందినట్టు ఆరోపణలు రావడంతో బైడెన్ ప్రచారంలో కాస్త వెనుకబడ్డారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం భారతీయ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కూడా బరిలో ఉండటం విశేషం. ఉక్రెయిన్కు ఆర్మీ పరంగా అమెరికా అధికంగా సాయం చేస్తున్నదని ఇప్పటికే ట్రంప్ విమర్శిస్తున్నారు. ట్రంప్ మరోసారి అధికారం చేపడితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కూడా ప్రభావం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఉక్రెయిన్తో సుదీర్ఘంగా యుద్ధం చేస్తున్న రష్యా కూడా 2024లో ఎన్నికలను ఎదుర్కొంటున్నది. మార్చిలో అక్కడ ఎన్నికలు. సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్న వ్లాదిమిర్ పుతిన్ మరోసారి బరిలో నిలుస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. 71 ఏండ్ల పుతిన్ 2036 వరకు అధికారంలో ఉండేందుకు వీలుగా గతంలోనే రాజ్యాంగ సవరణ చేశారు. అప్పటివరకు అధికారంలో కొనసాగితే అత్యధిక కాలం రష్యాను పాలించిన జోసెఫ్ స్టాలిన్ను అధిగమించి పుతిన్ సరికొత్త రికార్డు సృష్టిస్తారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపి తన రాజకీయ ప్రత్యర్థులపై ఆయన ఉక్కుపాదం మోపారు. చిరకాల ప్రత్యర్థి నావెల్నీ ఇప్పటికే జైలు శిక్షను అనుభవిస్తున్నారు. దీంతో ఆయనపై పోటీ పడేందుకు ప్రత్యర్థులే కానరావడం లేదు.
140 కోట్ల జనాభా మన దేశంలో ఏప్రిల్-మేలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ తప్పకపోవచ్చు. హిందీ బెల్టు రాష్ర్టాలు, హిందూ ఓటర్లపైనే బీజేపీ ఆశలు పెట్టుకున్నది. అందుకే ఆ వర్గాన్ని ఆకర్షించే దిశగా ప్రచారాస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నది.సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ భావించిన ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో చతికిలపడ్డ కాంగ్రెస్.. ఇండియా కూటమి సహకారంతో బీజేపీని ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నది.
వచ్చే ఏడాది జూన్లో యూరోపియన్ యూనియన్ ఎన్నికలకు తెరలేవనున్నది. 20కి పైగా దేశాలకు ఈయూ ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనించదగ్గ విషయం. బ్రిటన్లో ముందస్తు ఎన్నికల సూచనలు కనిపిస్తున్నాయి. జూన్లో మెక్సికో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఆ దేశ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన వారిలో ఇద్దరు మహిళలు ముందంజలో ఉండటం గమనార్హం. మెక్సికో సిటీ మాజీ మేయర్ క్లౌడియా షెన్బౌమ్, గాల్వేజ్లలో ఒకరు ఆ దేశ మొదటి మహిళా అధ్యక్షురాలిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా ఎన్నికలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. స్వతంత్రంగా ఉండేందుకు మొగ్గుచూపే డీపీపీ అభ్యర్థి లి చింగ్ తే.. తైవాన్ ఎన్నికల్లో గెలిచే సూచనలు కనిపిస్తుండటం చైనాకు మింగుడు పడని అంశం. హిమాలయ దేశం భూటాన్లో ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు ముగిశాయి. వచ్చే జనవరి 9న రెండో విడత జరుగనున్నది. రక్షణ పరంగా భారత్కు భూటాన్ వ్యూహాత్మక దేశం. అక్కడ జరిగిన మొదటి విడత ఎన్నికల్లో భారత్కు అనుకూలంగా వ్యవహరించే పీడీపీ ముందంజలో ఉండటం మన దేశానికి ఊరట కలిగించే అంశం. ప్రపంచ గతిని మలుపు తిప్పనున్న ఈ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారో చూడాలి మరి.
– ఎడిటోరియల్ డెస్క్