Independence day special | అది 1947 ఆగస్టు 15.. ఎన్నో ఏండ్ల బానిస బతుకుల నుంచి విముక్తి లభించిన రోజు. ఆనాడు రాజధాని ఢిల్లీ సహా దేశమంతటా ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నారు. జవహార్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ సహా చాలామంది స్వతంత్య్ర సమరయోధులు, ప్రజలు ఢిల్లీ నగరానికి చేరుకుని సంబురాలు చేసుకుంటున్నారు. కానీ స్వరాజ్య స్థాపన కోసం తుదివరకు అహింసను ఆయుధంగా చేసుకుని పోరాడిన మహాత్మా గాంధీ మాత్రం ఢిల్లీలో లేరు. ఢిల్లీకి దూరంగా కలకత్తా వెళ్లారు. అక్కడ కూడా సంబురాల్లో పాల్గొనలేదు. రోజంతా ఉపవాసం చేస్తూ మౌనదీక్ష పూనారు.
ఎన్నో ఏండ్లుగా కలలు కన్న స్వరాజ్యం వచ్చిన రోజునే భారతదేశం రెండు ముక్కలైంది. మత ప్రాతిపాదికన భారత్, పాకిస్థాన్గా విడిపోయింది. ఆ సమయంలో హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే ఆనందం కంటే కూడా.. దేశం రెండుగా చీలిపోయిందనే బాధే గాంధీజీలో ఎక్కువగా ఉండిపోయింది. అదే సమయంలో బెంగాల్లో గొడవలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిసి బాపూజీ కలత చెందారు. వెంటనే కలకత్తా బయలుదేరి వెళ్లారు.
బెంగాల్లో శాంతి నెలకొంటే దేశవ్యాప్తంగా హిందూ, ముస్లింల మధ్య వివాదాలు సద్దుమణుగుతాయన్నది గాంధీజీ నమ్మకం. అందుకే 1947 ఆగస్టు 9న ఆయన కలకత్తాకు వెళ్లారు. బంగ్లాదేశ్లో ఉన్న నౌకాలి ప్రాంతంలో ఎక్కువగా మత ఘర్షణలు జరుగుతున్నాయని తెలిసి.. అక్కడికి కూడా వెళ్లాలని గాంధీ అనుకున్నారు. కానీ చాలామంది అడ్డుతగిలి ఆయన్ను బంగ్లాదేశ్లోకి వెళ్లనివ్వలేదు. దీంతో మియాబగన్ సమీపంలో ఉన్న హైదరీ మంజిల్లో బాపూజీ బస చేశారు. కానీ అప్పటికే గాంధీజీపై ముస్లింల నుంచి వ్యతిరేకత మొదలైంది. ముస్లిం వ్యతిరేకి గాంధీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ముస్లింలు ఆందోళనలు చేశారు. అయినా గాంధీ వెనక్కి తగ్గలేదు.
రోజురోజుకీ ఆందోళనలు ఎక్కువైపోతుండటంతో.. వాటిని ఆపేందుకు ఆగస్టు 13 ఘర్షణల్లో చురుగ్గా పాల్గొంటున్న వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాల వారితో భేటీ అయి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లెవరూ గాంధీ మాటలను వినేందుకు సుముఖంగా లేరు. కానీ గాంధీజీ మాత్రం తన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. శాంతియుతంగా వారితో చర్చలు జరుపుతూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆగస్టు 15వ తేదీన గాంధీజీ 24 గంటల పాటు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. మౌనంగా ఉంటూ చరఖా తిప్పుతూ గడిపేశారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే వివాదం మొత్తం సద్దుమణిగింది. మత ఘర్షణలు తగ్గుముఖం పట్టాయి. ఇదంతా గమనించిన లార్డ్ మౌంట్ బాటెన్.. పంజాబ్లో 55 వేల మంది సైనికులను పెట్టి కూడా ఆందోళనలను ఆపలేకపోయాం.. కానీ బెంగాల్లో మాత్రం ఒకే ఒక వ్యక్తి వీటిని నిలవరించాడని పేర్కొనడం విశేషం.
కలకత్తాలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించి సఫలీకృతుడైన గాంధీజీని అభినందించేందుకు సి. రాజగోపాలాచారి అక్కడికి వెళ్లారు. అయితే ప్రజలు ఒక్కటిగా లేనప్పుడు ఈ స్వాతంత్య్రం తనకు ఆనందం ఇవ్వలేదని ఆ సందర్భంగా రాజగోపాలాచారితో గాంధీ చెప్పాడు. హిందూ, ముస్లింలు మళ్లీ కలిసి ఉంటే తప్ప నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు కాదని ఆయన పేర్కొన్నాడు. కలకత్తా తర్వాత భారత్, పాకిస్థాన్లోని హిందూ, ముస్లింల మధ్య శాంతిని నెలకొల్పాలని గాంధీ ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో ఉండగానే గాంధీని గాడ్సే హత్య చేశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
1947 నుంచి ప్రతి రోజు ఎగురుతున్న జాతీయ జెండా
Independence day Celebrations | మువ్వన్నెల మురిపాలు
జాతీయ జెండా ఏర్పాటులో అపశృతి.. క్రేన్ ట్రాలీ విరిగి ముగ్గురు మృతి
భర్తకు గుడికట్టి నిత్య పూజలు.. పతిభక్తి చాటుకుంటున్న మహిళ..!