అమరావతి: సాధారణంగా భార్యభర్తల మధ్య ఉండాల్సింది పవిత్రమైన బంధం..! ఆ బంధం పవిత్రమైనది అయినప్పుడే ఆ సంసారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు సాఫీగా సాగుతుంది. కానీ కొందరు దంపతుల మధ్య ఈ పవిత్రబంధం అనేది కనిపించదు. కొందరు భార్యలు భర్తలను లెక్కచేయరు, కొందరు భర్తలు భార్యలను లెక్కచేయరు. మరికొన్ని జంటల్లో భార్యభర్తలు ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఏమాత్రం ప్రేమానురాగాలు ఉండవు. ఏదేమైనా భార్యభర్తలకు పొంతన కుదరని సంసారాలు నరకంలా మారుతాయి. నిత్య గొడవలు సాధారణమైపోతాయి.
కానీ చాలామటుకు జంటల మధ్య మాత్రం అన్యోన్య అనుబంధం ఉంటుంది. భార్యపైన భర్తకు, భర్తపైన భార్యకు అమితమై ప్రేమ ఉంటుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతారు. ఇంకొన్ని జంటల్లో అంతగా కాకపోయినా ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది. ఇక అత్యంత అరుదుగా కొందరు దంపతుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు మెండుగా ఉంటాయి. భార్యలు భర్తలను ప్రత్యక్ష దైవాలుగా చూసుకుంటారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ చాటుకుంటున్న పతిభక్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన చెందిన పద్మావతి, అంకిరెడ్డి భార్యభర్తలు. 21 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే నాలుగేండ్ల క్రితం అంకిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన పద్మావతి భర్త అంకిరెడ్డి విగ్రహం చేయించుకుని ఇంటి ఆవరణలో పెట్టుకుంది.
తాజాగా ఆ విగ్రహానికి గుడి కూడా కట్టించింది. ఆ గుడిలో నిత్యం పూజలు చేస్తున్నది. తాను బతికి ఉన్నంత కాలం తన జీవితం ఆయనకే అంకితం అని పద్మావతి చెబుతున్నది. ప్రతి పౌర్ణమితోపాటు ప్రతి శని, ఆదివారాలలో పద్మావతి తన భర్త పేరుమీద నిరుపేదలకు అన్నదానం కూడా చేస్తున్నది. అంతేగాక అంకిరెడ్డి పేరుమీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పతిభక్తి చాటుకుంటున్నది. కాగా, బతికి ఉన్నన్ని రోజులైనా పద్మావతి లాంటి భార్యతో కలిసి ఉన్నందుకు అంకిరెడ్డి చాలా అదృష్టవంతుడంటున్నారు ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ.