భోపాల్: స్వాంతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో జాతీయ జెండా ఏర్పాటులో అపశృతి జరిగింది. క్రేన్ ట్రాలీ విరగడంతో ముగ్గురు మరణించారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో శనివారం ఈ ఘటన జరిగింది. గ్వాలియర్ నగరంలోని చారిత్రక మహారాజా బడా పోస్టాఫీస్ భవనంపై జెండా ఏర్పాటుకు గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ప్రయత్నించారు. హైడ్రాలిక్ ఫైర్ బ్రిగేడ్ ట్రాలీ ద్వారా బిల్డింగ్ పైకి వెళ్లిన నలుగురు సిబ్బంది జెండా ఏర్పాటు చేస్తున్నారు. ఇంతలో క్రేన్ విరగడంతోపాటు ట్రాలీ అదుపుతప్పింది. దీంతో ముగ్గురు సిబ్బంది కిందపడి మరణించారు. ట్రాలీ డ్రైవర్తోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తులసి రామ్ సిలావత్ చెప్పారు. మరోవైపు ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్ నాథ్ డిమాండ్ చేశారు.