మాట ఎంతో విలువైనది ! ఒక్క మాటతో బంధాలు దగ్గరవుతాయి ! అదే ఒక్క మాటతో బాంధవ్యాలు తెగిపోతాయి !! మాట చెడితే యుద్ధాలు జరగొచ్చు ! ఒక్క మంచిమాటతో యుద్ధాలను ఆపనూవచ్చు !! అంత శక్తివంతమైనది మాట ! వెనకటి రోజుల్లో అయితే మాట ఎలాగో.. ఇప్పటి సాంకేతిక యుగంలో సోషల్ మీడియా పోస్టు కూడా అంతే విలువైనది. ఏం నమ్మకం లేదా ? ఈ మధ్య కొందరు సెలబ్రెటీలు చేసిన ట్వీట్లతో పలు కంపెనీలు వేల కోట్ల రూపాయలను నష్టపోవాల్సి వచ్చింది. ఆ సంఘటనలు కొన్నింటిని గమనిస్తే అదే నిజమేనని ఒప్పుకుంటారు.
ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఇటీవల ఒక ప్రెస్మీట్లో అన్న ఒక్క మాటతో కొకా కొలా కంపెనీకి దాదాపు రూ.29వేల కోట్ల నష్టం వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది అంటారా.. నెల రోజుల కిందట జరిగిన ఒక ప్రెస్మీట్లో రొనాల్డో వచ్చి రాగానే టేబుల్పై ఉన్న రెండు కొకా కొలా బాటిళ్లను పక్కనబెట్టి మంచినీళ్లు తాగండి అని అన్నాడు. అంతే ఆ మాట సోషల్మీడియాలో వైరల్గా మారింది. అసలే ప్రపంచంలోనే అత్యధికంగా 30 కోట్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న సెలబ్రెటీ రొనాల్డో. అతని మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొకా కొలా కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి.
టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ చేసిన ఒక్క ట్వీట్తో ఆ కంపెనీ మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. టెస్లా స్టాక్ ప్రైజ్ ఈజ్ టూ హై అని గత ఏడాది మే 1న మస్క్ ఒక ట్వీట్ చేశాడు. దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ అయిన టెస్లా కంపెనీకి దాదాపు లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఈ కంపెనీలో తనకు ఉన్న షేర్ల వల్ల వ్యక్తిగతంగా ఎలన్ మస్క్ రూ.22వేల కోట్ల వరకు నష్టపోయాడు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు అంటే.. 2016 డిసెంబర్ 6న ఒక ట్వీట్ చేశాడు. బోయింగ్ చాలా డబ్బులు సంపాదించాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ మరీ ఇంత కాదు అని ట్విట్టర్లో రాశాడు. ఈ ట్వీట్తో బోయింగ్ షేర్ విలువ 2 డాలర్లు పడిపోయింది. దీంతో బోయింగ్ కంపెనీ దాదాపు 7వేల కోట్లు నష్టపోయింది.
అమెరికా నటుడు జెర్మీ జోర్డాన్ 2017లో ప్రముఖ రెస్టారెంట్ చిపోట్లెలో భోజనం చేశాడు. తర్వాత ఆనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో జోర్డాన్ ఓ ట్వీట్ చేశాడు. ఇంతకుముందు నేను తిన్న ఆహారం వల్ల దాదాపు చావు అంచుల దాకా వెళ్లొచ్చా. ప్రస్తుతం నేను ఆస్పత్రిలో ఉన్నా.. ఇప్పుడు ఫ్లూయెడ్స్ ఎక్కిస్తున్నారని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చాలా వైరల్ అయింది. దీంతో సదరు రెస్టారెంట్కు రూ.56వేల కోట్ల నష్టం తెచ్చింది.
అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్, మోడల్ కైలీ జెన్నర్ ట్వీట్ వల్ల స్నాప్ చాట్ కు 9647 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఇంతకీ ఆమె ఏం ట్వీట్ చేసిందంటే. ఈ మధ్య ఎవరూ స్నాప్చాట్ వాడట్లేదా.. నేను మాత్రమే ఓపెన్ చేయట్లేదా అని 2018 ఫిబ్రవరి 21న ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ కారణంగా స్నాప్చాట్ విలువ పాతాళానికి పడిపోయింది.
పాప్ సింగర్ రిహాన్నా 2018లో చేసిన ఒకే ఒక్క ట్వీట్తో స్నాప్చాట్ 7వేల కోట్లు నష్టపోయింది. స్నాప్చాట్లోని ఒక యాడ్లో వుడ్ యూ రాదర్ అనే గేమ్ ఉంది. మీరు రిహాన్నాను చెంపదెబ్బ కొడతారా అని ఒక ప్రశ్న ఆ గేమ్లో ఉందంట. అది చూసి కోపంతో రగిలిపోయిన రియాన్నా.. స్నాప్చాట్ను విమర్శిస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టింది. అసలే ఆమెకు ఇన్స్టాలో ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రిహాన్నా పోస్టు చూసిన ఆమె అభిమానులు పెద్ద ఎత్తున తమ స్మార్ట్ఫోన్ నుంచి స్నాప్ చాట్ను అన్ ఇన్స్టాల్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆషాఢంలో ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?
కార్పొరేట్ కొలువులు.. లగ్జరీ లైఫ్ వదిలేసి అడవిలో కాపురం
Pet Passport : శునకాలకూ పాస్పోర్టు ఉంటుందని తెలుసా !
వందేండ్లు కాదు.. 130 ఏండ్లు బతుకొచ్చు అంటున్న శాస్త్రవేత్తలు.. అదెలా?
కూలి పనులు మాని యూట్యూబ్లో లక్షలు సంపాదిస్తున్నాడు..