Tollywood | ‘చూపే బంగారమాయెనే…’ పాటేమో గానీ, బన్ని స్టెప్పు ప్రపంచ వ్యాప్తమైంది. ‘నాటు నాటు..’ పాటలో తారక్, చరణ్ ఆట ఆస్కార్లో అదరగొట్టింది. ఇప్పుడు టాలీవుడ్ స్టెప్పేస్తే… హాలీవుడ్ కూడా చిందేస్తున్నది. దశాబ్దాలు వెనక్కి వెళ్తే… అప్పటి కాలానికి తగ్గ నృత్యాలు వెండితెరపై బంగారు కాంతులీనాయి. నవరసాలనూ ఆవిష్కరించగలిగే కళా సాధనం నాట్యం. సినిమా సకల కళల సమ్మేళనం అయినప్పుడు… అందులో డ్యాన్స్ పాత్రను తక్కువ చేసి చూడలేం.
1932లో తొలి తెలుగు సినిమా ‘భక్తప్రహ్లాద’ వచ్చిన నాటినుంచి నేటి వరకూ వెండితెరపై నృత్యం రకరకాల స్టెప్పులు వేస్తూ వచ్చింది. ట్రెండుకు తగ్గట్టుగా నయా రీతుల్ని సంతరించుకుంది. మూడు గంటలు సుదీర్ఘంగా కథ చెప్పాల్సి వచ్చినప్పుడు.. ప్రేక్షకులకు విసుగు రాకుండా, మధ్య మధ్య పంచదార పలుకుల్లా ఒక నృత్యరూపకాన్ని సినిమాలో చొప్పించేవారు నాటి దర్శకులు. ఇది.. సినిమా తొలినాళ్ల ముచ్చట. దాని కోసం ప్రత్యేకంగా కొందరు నర్తకీమణులు ఉండేవాళ్లు. అసందర్భంగా కాకుండా, కథకు ఎక్కడ అవసరమో అక్కడ శాస్త్రీయ నృత్యరూపకమో, జానపద నృత్యమో వచ్చేలా చూసేవాళ్లు. ఎందుకంటే తొలినాటి కథానాయికలెవరూ నాట్యం పెద్దగా తెలిసినవాళ్లు కాదు. మంచి గాత్రం, అభినయ పాటవం ఉన్న రంగస్థల కళాకారులనే సినిమాల్లో తీసుకునే రోజులవి. కన్నాంబ, కాంచనమాల, కృష్ణవేణి, బి.జయమ్మ, శాంతకుమారి.. వీరంతా రంగస్థల కళాకారులే.. డ్యాన్సర్లుకాదు.
తెలుగుతెరపై నాట్యంలో మెలకువలు తెలిసిన తొలి కథానాయిక అంటే భానుమతి రామకృష్ణ అనే చెప్పాలి. అంతగొప్పగా కాకపోయినా.. సంప్రదాయ నృత్యాన్ని తాళానుగుణంగా లయబద్ధంగా నర్తించగిలిగేవారు ఆమె. 1945లో భానుమతి నటించిన ‘స్వర్గసీమ’లో ‘ఓ హోహో.. పావురమా..’ పాటలో ఆమె నాట్యం, హావభావాలు నాటి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయని చెప్పుకొంటారు. ఆ తర్వాత ‘రత్నమాల’(1947), ‘లైలామజ్ను’(1949) చిత్రాల్లో కూడా తనదైన శైలిలో చక్కని డ్యాన్స్ మూమెంట్స్ ఇచ్చారు. మల్లీశ్వరి, చింతామణి, విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ తదితర చిత్రాల్లో భానుమతి నాట్యకౌశలాన్ని చూడొచ్చు.
నృత్యం పరంగా తెలుగు సినిమాను మరోస్థాయిలో నిలబెట్టిన నటి అంజలీదేవి. స్వతహాగా అంజలి నాట్యతార. సినిమాల్లోకి రాకముందే ఆమె నర్తకి. ఆమెలోని నృత్య ప్రతిభను గమనించే దర్శకుడు సి.పుల్లయ్య ‘గొల్లభామ’ (1947)లో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత బాలరాజు (1948), కీలుగుర్రం (1949), పల్లెటూరిపిల్ల (1950) చిత్రాలతో అప్పటి యువతరానికి హాట్ ఫేవరెట్ అయ్యారు అంజలి. అప్పట్లో ఆడపిల్లలంతా ‘అందానికి నేను అంజలినోయీ..’ అనేవారట.
రానురాను వెండితెరపై డ్యాన్స్ తప్పనిసరి అయింది. సినిమాకు చెందిన 24 శాఖల్లో నృత్యం ప్రధాన శాఖగా రూపాంతరం చెందింది. వేదాంతం రాఘవయ్య, వెంపటి పెద్ద సత్యం, వెంపటి చిన సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి, గోపీనాథ్, పీఎస్ గోపాలకృష్ణన్, ఏకే చోప్రా వంటి ఉద్దండులైన డాన్స్మాస్టర్లు తెలుగు తెరను తమ నృత్యరీతులతో దేదీప్యం చేశారు. ముఖ్యంగా 1950 నుంచి 1970 మధ్య కాలంలో తెలుగు సినిమా డ్యాన్స్కు స్వర్ణయుగం. ఈ కాలంలో పరిచయమైన రాజసులోచన, ఎల్.విజయలక్ష్మి, జయలలిత, కాంచన, రాజశ్రీ, వాణిశ్రీ తదితర తారలు గొప్ప నర్తకీమణులుగా కూడా రాణించారు. ఈవీ సరోజ, రీటా, కుచలకుమారి, జ్యోతిలక్ష్మి, పి.ధర్మరాజు, ముక్కురాజు లాంటి డ్యాన్సర్లు తెలుగుతెరకు పరిచయమైంది కూడా ఈ జమానాలోనే. విజయావారి మాయాబజార్, జగదేకవీరుడికథ, లలిత శివజ్యోతి వారి ‘లవకుశ’, రాజ్యం పిక్చర్స్ ‘నర్తనశాల’, ఇంకా తెనాలి రామకృష్ణ, మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరుసు, పాండవ వనవాసం, శ్రీకృష్ణ పాండడవీయం.. ఇలా అద్భుతమైన సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రరాజాలు వచ్చింది ఈ దశాబ్దాల్లోనే. వీటిలో అద్భుతమైన పాటలకు, అంతే మనోహరమైన నృత్యాలు అమరాయి.
1973లో అక్కినేని ‘బంగారుబాబు’ విడుదలైంది. అప్పటివరకూ హీరోయిన్లకూ, నృత్యతారలకు మాత్రమే పరిమితమైన ‘డ్యాన్స్’.. హీరోలకు కూడా తప్పనిసరి అయింది. అందులో ‘చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది..’ అంటూ వాణిశ్రీతో కలిసి అక్కినేని చేసిన డ్యాన్స్.. కొత్త ట్రెండ్కు నాంది పలికింది. ఆ పాటతో తెలుగు సినిమా నడకను సమూలంగా మార్చేశారు నృత్య దర్శకుడు హీరాలాల్. ఓ విధంగా ఏయన్నార్ కారణంగా ఎన్టీయార్కు కూడా డ్యాన్సులేయక తప్పలేదు.. అదంతా ‘బంగారుబాబు’ పుణ్యమే.
ఎన్టీయార్ ‘అడవిరాముడు’ డ్యాన్సులకు ఓ ట్రెండ్ సెట్టర్. అందులోని ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె..’, ‘అమ్మతోడు అబ్బతోడు నాతోడు నీతోడు..’ పాటలు ప్రేక్షకులతో కూడా స్టెప్పులేయించాయి. ఆ సినిమా కొరియోగ్రాఫర్ పేరు సలీమ్. నృత్య దర్శకుడిగా సలీమ్ ఓ సంచలనం. అక్కినేనిని మినహాయిస్తే అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీయార్, కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజు.. వీరెవరూ డ్యాన్సుల్లో అంత ప్రవీణులు కాదు. కానీ వారి శారీరకభాషకు తగ్గట్టు స్టెప్పుల్ని క్రియేట్చేసి, తెలుగు సినిమా డ్యాన్సులను కొత్త పుంతలు తొక్కించాడు సలీమ్ మాస్టర్. ఆయనది ఏ స్థాయి ప్రభావం అంటే.. ఉమ్మడి రాష్ట్రంలో రికార్డింగ్ డ్యాన్స్ కల్చర్కి నాంది పలికింది సలీమ్ మాస్టర్ పాటలే. ఎన్టీయార్ చేసిన అడవిరాముడు, వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్చౌదరి, అలాగే అక్కినేని నటించిన శ్రీరంగనీతులు, ఏడంతస్తుల మేడ, ప్రేమాభిషేకం, యువరాజు, అనుబంధం, సూపర్స్టార్ కృష్ణ నటించిన ఊరికి మొనగాడు, అగ్నిపర్వతం, వజ్రాయుధం, ఖైదీ రుద్రయ్య.. ఇలా చెప్పుకొంటూ పోతే సలీమ్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చిన ఎన్నో సినిమాల పాటలు రికార్డింగ్ డ్యాన్స్ కళాకారులకు జీవనోపాధిగా మారాయి.
ఇక 1970ల్లో కమల్హాసన్, చిరంజీవి లాంటి గొప్ప డ్యాన్సర్లు వెండితెరకు హీరోలుగా పరిచయం అయ్యారు. చిరంజీవి డ్యాన్సులకైతే ప్రేక్షకులు భక్తులుగా మారిపోయారు. సినిమా హీరో కావాలంటే డ్యాన్స్ ఒక అర్హతగా మారిపోయింది. హీరో అవ్వాలనుకునే ప్రతి నటుడూ డ్యాన్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్టీయార్, ఏయన్నార్ కూడా తమ వారసులకు డ్యాన్స్లు నేర్పించి పరిశ్రమకు పరిచయం చేశారంటే, దానికి కారణం చిరంజీవి. హీరోయిన్లలో కూడా జయప్రద, శ్రీదేవి, భానుప్రియ, రమ్యకృష్ణ లాంటి అద్భుతమైన డ్యాన్సర్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
సలీమ్తోపాటు తార, సుందరం మాస్టర్, శివసుబ్రహ్మణ్యం లాంటి డ్యాన్స్ మాస్టర్లు 80ల్లో తెలుగు సినిమాను చిందులు వేయించారు. చిరంజీవితోపాటు బాలకృష్ణ కూడా మంచి డ్యాన్సర్గా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. అప్పటి డ్యాన్స్మాస్టర్లు ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్. పాట చూడగానే.. ఇది ఫలానా కొరియోగ్రాఫర్ది అని చెప్పేవాళ్లు. నృత్య దర్శకుల్లో ఈ తరానికి ఆదర్శం ప్రభుదేవా. సలీమ్ మాస్టర్లా హీరో బాడీలాంగ్వేజ్కు తగ్గట్టు స్టెప్పులు క్రియేట్ చేయడం ప్రభుదేవా స్టయిల్. డ్యాన్స్ను ఇరగదీసే చిరంజీవి, బాలకృష్ణలకూ, అంతగా స్టెప్పులు వేయలేని మోహన్బాబు, రాజశేఖర్కు ప్రత్యేకమైన నృత్యరీతుల్ని సృష్టించిన ఘనత ప్రభుదేవాదే. లారెన్స్ కూడా దాదాపు ప్రభుదేవా దారిలోనే పయనించాడు.
ఇక నేటి సినిమాల్లోని డ్యాన్సుల విషయానికొస్తే.. దాదాపు అన్ని సినిమాల్లో డ్యాన్సులు ఒకేలా ఉంటున్నాయనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అప్పట్లో ప్రతి నృత్య దర్శకుడికీ ఓ స్టయిల్ ఉండేది. హీరో శారీరక భాషకు తగ్గట్టు స్టెప్పుల్ని క్రియేట్ చేసేవారు. ఒకరిద్దరికి తప్ప ఇప్పుడు అందరు హీరోలూ ఒకే తరహా స్టెప్పులను ఆశ్రయిస్తున్నారు. అయినా.. కొన్ని డ్యాన్సులు ట్రెండ్ సృష్టిస్తున్నాయి. పాటల్లో లాలిత్యం తగ్గినా.. డ్యాన్సుల్లో మాత్రం వైవిధ్యం కనిపిస్తున్నది. తారక్, బన్నీ, చరణ్ లాంటి అద్భుతమైన డ్యాన్సింగ్ స్టార్లు అవకాశం వచ్చిన ప్రతిసారీ.. అదరగొడుతున్నారు. అయితే, ప్రతి సినిమాలోనూ వారి డ్యాన్సులు కూడా ఒకేలా ఉంటున్నాయనే అభిప్రాయం జనాల్లో నెలకొని ఉంది. చివరిగా, డ్యాన్సుల్లో టాలీవుడ్ తర్వాతే ఏ పరిశ్రమ అయినా అన్న వాదనా వినిపిస్తుంటుంది!
– బుర్రా నరసింహా