భువనేశ్వర్ : ఒడిషాలోని సంబల్పూర్ జిల్లాలో దినసరి కూలీ ఇసాక్ ముండా యూట్యూబ్ ఛానెల్తో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. కరోనా కట్టడికి గత ఏడాది మార్చిలో దేశవ్యాప్త లాక్డౌన్ విధించిన సమయంలో ఫ్రెండ్ ఫోన్లో కొన్ని వీడియోలు చూసిన తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. రూ 3000 అప్పుగా తీసుకుని కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్తో ఇసాక్ ముండా ఈటింగ్ అనే ఛానెల్ను లాంఛ్ చేసాడు. తొలి వీడియోగా ఎలాంటి కూర లేకుండా బాయిల్డ్ రైస్ను తాను తింటున్న వీడియోను పోస్ట్ చేశాడు.
ఆ వీడియోను ఏకంగా 4.99 లక్షల మంది వీక్షించారు. తమ గ్రామంలో పేదింటి తన జీవన విధానాన్ని వీడియోలుగా మలిచి ఛానెల్లో పోస్ట్ చేయడంతో వాటికి అనూహ్యంగా లక్షల్లో వ్యూస్ దక్కాయి. వీక్షణలతో పాటు ఆదాయం లభిస్తుండటంతో కూలి పనులు మాని వీడియోలపై ఫోకస్ పెట్టాడు. తొలి వీడియో పోస్ట్ చేసిన మూడు నెలల తర్వాత ఇసాక్ బ్యాంక్ ఖాతాలో రూ 37,000 సమకూరాయి. మరో మూడు నెలల తర్వాత అతడికి ఏకంగా రూ 5 లక్షలు యూట్యూబ్ నుంచి రాబడి వచ్చింది.
ఏడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు కలిగిన ఇసాక్ ఛానెల్లో ఇప్పటివరకూ 250కి పైగా వీడియోలు పోస్ట్ చేశాడు. తాను కేవలం ఏడవ తరగతి వరకూ మాత్రమే చదివానని, అందుకే తాను కేవలం తమ ఆదివాసీలు, గ్రామ జీవనశైలిపై మాత్రమే వీడియోలు చేయగలనని చెప్పుకొచ్చాడు. తమ నిరాడంబర జీవన శైలిని తెలిపే వీడియోలను దేశ ప్రజలు, విదేశీయులు సైతం అమితంగా వీక్షిస్తున్నారని అన్నాడు.