నిజామాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పసుపు రైతుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ఎంపీ అర్వింద్కు దిమ్మతిరిగేలా అన్నదాతలు షాక్ ఇచ్చారు. ఎక్కడికక్కడ ‘పసుపుబోర్డుల’ ఏర్పాటుతో బీజేపీ నాయకుల తీరును ఎండగట్టారు. ఇదిగో పసుపుబోర్డు అంటూ నిజామాబాద్తో పాటు డిచ్పల్లిలోనూ శుక్రవారం పెద్దపెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పసుపుబోర్డుపై అర్వింద్ మాట తప్పడంతో కడుపు మండిన రైతన్నలు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. ఎంపీ ఎక్కడికి వెళ్లినా నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా పసుపుబోర్డు ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్రం పార్లమెంట్ వేదికగా ప్రకటన చేయడంతో అన్నదాతలు రగిలిపోతున్నారు. ‘పసుపుబోర్డు.. ఇది మా ఎంపీ గారు తీసుకొచ్చిన బోర్డు’ అని పెద్దపెద్ద ఫ్లెక్సీలను ప్రధానకూడళ్ల వద్ద ఏర్పాటు చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కర్షకులు కన్నెర్ర చేస్తుండడంతో బీజేపీ నేతలు హడలిపోతున్నారు. రానున్న రోజుల్లో మరింత నిరసన సెగ తగిలే ప్రమాదముందనే భయంతో వణికి పోతున్నారు.
పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఆలోచనే తమ వద్ద లేదని మోదీ సర్కారు ఇటీవల పార్లమెంట్లో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో తమ ఆశలపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లడంతో పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సర్కారు చేసిన భారీ మోసాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పసుపు పంటను విక్రయించేందుకు నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్కు వచ్చిన రైతన్నలంతా కలిసి రాత్రికి రాత్రి(గురువారం) జిల్లా కేంద్రంలో దాదాపు 30 చోట్ల పసుపు బోర్డుతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. బీజేపీ ఎంపీ చేతకానితనాన్ని తమదైన శైలిలో ఎండగట్టారు. ఇదే పసుపు బోర్డు అంటూ వ్యంగ్యంగా స్పందించి ఎంపీ అర్వింద్కు బుద్ధి వచ్చే విధంగా నిరసనను వ్యక్తంచేశారు. నగర ప్రజలంతా బీజేపీ చేసిన మోసాన్ని సులువుగా తెలుసుకునేలా, వచ్చే ఎన్నికల్లో ఎంపీకి డిపాజిట్ గల్లంతు అయ్యే విధంగా ఐక్యంగా ఉద్యమించాలని పసుపు రైతులు భావిస్తున్నారు. నమ్మించి మోసం చేసిన కేంద్ర ప్రభుత్వానికి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని అన్నదాతలు నిర్ణయించారు.
పసుపు బోర్డు ఆలోచనే లేదన్న కేంద్రం..
ఏడాదిన్నర క్రితమే రాష్ట్ర ఎంపీలు ఉత్తమ్కుమార్ రె డ్డి, కేఆర్ సురేశ్రెడ్డి వేర్వేరుగా అడిగిన ప్రశ్నలకు కేంద్రం బదులిస్తూ పసుపు బోర్డు ఏర్పాటు ఆలోచన లేదని చెప్పింది. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తూ కేంద్రం విస్పష్ట ప్రకటన చేసింది. బీజేపీ ప్రభు త్వం పసుపు బోర్డు హామీని విస్మరించి, బోర్డు ఏర్పాటే తమ పరిధిలో లేదని చెప్పింది. అలాంటి ప్రతిపాదన కానీ ఆలోచన అన్నదే తమకు లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంట్లో ప్రకటించడంతో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ బండారం మరోసారి బట్టబయలైంది. ఎక్స్టెన్షన్ కార్యాలయంతోనే పసుపు బోర్డు వచ్చిందన్నట్లుగా ప్రచారం చేసిన ఎంపీ ఈ పరిణామంపై స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆగ్రహంతో పసుపు రైతులంతా కలిసి నిరసన రూపానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిర్వాకాన్ని ఎండగడుతూ.. ‘పసుపు బోర్డు.. ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు..’ అని పేర్కొని పసుపు రంగులో ఫ్లెక్సీలను రైతులు ఏర్పాటుచేశారు.
అర్వింద్.. రాజీనామా చెయ్..
ఎంపీ అర్వింద్ తమను మోసం చేశారని ఆందోళన బాట పట్టిన రైతులు.. అతడు తక్షణం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకు వస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న అర్వింద్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాండ్ పేపర్ రాసిచ్చినప్పటికీ పసుపు బోర్డును సాధించకపోవడమే కాకుండా బోర్డును ఏర్పాటు చేయలేమని కేంద్రం చెప్పినా.. ఏమీ పట్టనట్లు ఉండడంపై రైతులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. బోర్డు సాధించలేని అర్వింద్.. ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు రాజ్నాథ్ సింగ్, రామ్మాధవ్ వంటి వారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీని గెలిపిస్తే ఐదు రోజుల్లోనే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని మోసపూరిత హామీ ఇచ్చారని రైతులు గుర్తు చేస్తున్నారు. కేంద్రాన్ని ఒప్పించలేని బీజేపీ నాయకులకు ప్రజల్లో తిరిగే నైతిక హక్కు లేదంటున్నారు. అన్నదాతలను మోసం చేసిన ఎంపీ అర్వింద్కు పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్నారు. బోర్డు కోసం కొంత కాలంగా నిరసనలు తెలుపుతున్న రైతులు పలుసార్లు అర్వింద్ను అడ్డుకున్నారు. ఇంకెంత కాలం మోసం చేస్తారని నిలదీశారు. ఇకపై పసుపు బోర్డు కోసం ఆందోళనలను ఉధృతం చేస్తామని బీజేపీ నేతలు, ముఖ్యంగా అర్వింద్ను ఎప్పటికప్పుడు నిలదీస్తామని రైతులు చెబుతున్నారు.
అడుగడుగునా పసుపు బోర్డులు..
పసుపు రైతుల సరికొత్త నిరససతో బీజేపీ నేతలంతా కంగుతిన్నారు. పొద్దున లేచినప్పటి నుంచి నగరంలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డులతో వీధుల్లో తిరగలేకపోయారు. ఎంపీ అర్వింద్ చేసిన నిర్వాకానికి బీజేపీ నేతలంతా తలెత్తుకునే పరిస్థితి లేకుండాపోయింది. నిజామాబాద్లోని బైపాస్ రోడ్డు, కంఠేశ్వర్, న్యూ కలెక్టరేట్, దుబ్బా, ఎన్టీఆర్ చౌరస్తా, పాత కలెక్టరేట్, పులాంగ్ చౌరస్తా, వినాయక్నగర్, బోర్గాం, ముబారక్నగర్, వర్ని ఎక్స్ రోడ్డు, నాగారం, శివాజీనగర్, గాంధీ చౌక్, నెహ్రూ చౌక్, నాందేవ్వాడ, గంజ్ ప్రాంతం, హమాల్వాడి, జడ్పీ చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఖలీల్వాడి ఇలా నగరంలోని అనేక ప్రదేశాల్లో పసుపుబోర్డు ఫ్లెక్సీలు దర్శనం ఇచ్చాయి. పసుపు బోర్డుకు పంగనామాలు పెట్టడంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై రైతులు కన్నెర్ర చేయడంతో బీజేపీలో భయం మొదలైంది. పెద్ద ఎత్తున హామీలిచ్చిన అర్వింద్కు రైతుల నిరసనతోనైనా బుద్ధి రావాలని నగర ప్రజలంతా భావిస్తున్నారు. మాట లే తప్పా చేతలు తెలియని ఎంపీని వచ్చే ఎన్నికల్లో ఇంటి కి సాగనంపేందుకు పసుపు రైతులు సిద్ధం అవుతున్నట్లు గా ఈ పసుపు బోర్డుల నిరసనతో స్పష్టం అవుతున్నది.
డిచ్పల్లిలోనూ ఏర్పాటైన ఫ్లెక్సీలు..
డిచ్పల్లి, మార్చి 31: ఎంపీ అర్వింద్కు వ్యతిరేకంగా డిచ్పల్లిలోనూ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. డిచ్పల్లి రైల్వేస్టేషన్తో పాటు 44వ నంబర్ జాతీయ రహదారి వద్ద రైతులు ‘పసుపు బోర్డు’ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు అర్వింద్ వంద రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేశాడని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఫ్లెక్సీల ఏర్పాటుతో బీజేపీ నాయకుల్లో వణుకు మొదలైంది.