యాదగిరిగుట్ట, జనవరి 12 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి చెంతకు మల్లన్న సాగర్ జలాలు వచ్చాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొండకండ్ల గ్రామంలోని క్రాస్ రెగ్యులేటర్ వద్ద 15వ ప్యాకేజీ ప్రధాన కాల్వలోకి ఇరిగేషన్ అధికారులు శుక్రవారం ఉదయం నీటిని విడుదల చేశారు. అక్కడి నుంచి 15వ ప్యాకేజీ ప్రధాన కాల్వ గుండా యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లి నుంచి కాళేశ్వరం 16వ ప్యాకేజీ ప్రధాన కాల్వ వరకు వచ్చాయి.
అక్కడి నుంచి 16వ ప్యాకేజీ ప్రధాన కాల్వ 8వ కిలోమీటరు వద్ద నిర్మించిన బ్రాంచ్ కెనాల్ గుండా యాదగిరిగుట్ట కొండ కింద నిర్మించిన గండి చెరువులోకి గోదావరి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతం గండి చెరువులో నీళ్లు తగ్గుముఖం పట్టడంతో గోదావరి జలాలతో మరోసారి చెరువును నింపుతున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు నెలల్లో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉన్నందున నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.