– ఏఐయూకేఎస్ డిమాండ్
దమ్మపేట, జూలై 27 : వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలని ఏఐయుకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆగస్టు 3 నుండి 10వ తేదీ వరకు మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో రైతు ఆందోళనలు జరపాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆఫీస్ బేరర్స్ ఆన్లైన్ సమావేశం బుర్ర వెంకన్నఅధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కెచ్చెల రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా విత్తనాలు ఎండిపోవడం, మొలకెత్తినా పంటలు వాడి పోవడం జరిగిందన్నారు. కావునా నష్టపడ్డ రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. ముఖ్యంగా స్వల్పకాలిక పంట విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలన్నారు.
రైతుల పాత రుణాలు పూర్తిగా ఒకేసారి మాఫీ చేయాలని, కొత్తగా వడ్డిలేని పంట రుణాలు ఇవ్వాలన్నారు. అలాగే పంటల బీమా అమలు చేయాలని, పశుగ్రాసం, మంచినీటి సరఫరా గ్రామాలకు సమకూర్చాలని కోరారు. పోడు సాగుకు అటవీ అధికారులు సృష్టిస్తున్న ఆటంకాలు తొలగించాలని, పట్టా పోడు భూముల్లో ట్రాక్టర్లు వాడరాదనే ఆంక్షలు ఎత్తేయాలన్నారు. దుర్భిక్ష పరిస్థితుల్లో పనిలేని రైతు, కూలీలకు ఉపాధి హామీ చట్టం ద్వారా పనులు కల్పించి రోజుకు రూ.600 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ఆగస్టు 3 నుండి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు జరపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము, కల్లూరి కిషోర్, బానోత్ ధర్మ పాల్గొన్నారు.