వినాయక్నగర్, మార్చి 24: బ్యాంకు ఖాతాదారుల సౌకర్యం కోసం అందుబాటులోకి తెచ్చిన ఏటీఎంల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. 24 గంటలపాటు డబ్బులు విత్డ్రాచేసుకోవడంతోపాటు జమచేసే వీలుకూడా ఉండడంతో వీటికి ఆదరణ పెరిగింది. చిన్నమొత్తాల ట్రాన్స్ఫర్ పూర్తిగా ఏటీఎంలలోనే జరుగుతున్నది. ఖాతాదాలకు మెరుగైన సేవలను అందించేందుకు అన్ని బ్యాంకులు తమ శాఖకు సంబంధించి ఏటీఎం సెంటర్లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో వినియోగదారుల సమయం కూడా ఆదా అవుతున్నది. పెద్దమొత్తంలో నగదు లావాదేవీలు, నగలు తదితర విలువైన వస్తువులను భద్రపర్చుకునేందుకు మాత్రమే ఖాతాదారులు బ్యాంకులకు వెళ్తున్నారు. అయితే ఎక్కడపడితే అక్కడ అందుబాటులో ఉన్న ఏటీఎంల నిర్వహణతోపాటు భద్రత మాత్రం బ్యాంకులు గాలికి వదిలేశాయి. ఇందుకు జిల్లాలో జరుగుతున్న ఏటీఎం చోరీలే ఉదాహరణగా నిలుస్తున్నాయి.
ప్రతి బ్యాంకు తమ సేవలను విస్తృతం చేయడంతోపాటు ఖాతాదారులకు ఇబ్బంది కలుగకూడదలే ఉద్దేశంతో పోటీపడి ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిని 24 గంటల పాటు వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తున్నాయి. ఒక్కో ఏటీఎంలో రూ.20-25 లక్షల వరకు డబ్బులను అందుబాటులో ఉంచుతున్నాయి. అయితే గతంలో ప్రతి ఏటీఎం సెంటర్ వద్ద ఒక సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేసేవారు. టెక్నాలజీ పెరిగిన కొద్దీ సీసీ కెమెరాలు, అలారమ్ సిస్టమ్ అందుబాటులోకి రావడంతో కాపలాగా ఉన్న సిబ్బందిని తొలగిస్తూ వచ్చారు. సీసీ ఫుటేజీలు, అలారమ్ను సంబంధిత శాఖ మేనేజర్తోపాటు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేశారు. ఏటీఎం సెంటర్లో ఎవరైనా చోరీకి ప్రయత్నిస్తే భారీ శబ్దంతోకూడిన అలారం అప్రమత్తం చేసుంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించే అవకాశం ఉంటుంది. ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ దొంగలు కూడా జాగ్రత్త పడుతూ చోరీలకు పాల్పడుతున్నారు.
గ్యారెంటీగా పెద్దమొత్తంలో నగదు ఉం టుందని భావిస్తున్న దుండగులు ఏటీఎంలనే టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఏటీఎంలలో రెండు..మూడు లాక్స్, సీసీ కెమెరాలు, అలారమ్ వంటి భద్రత ఉన్నప్పటికీ చోరీకి ప్రయత్నిస్తున్నారు. ఏటీఎం లాక్స్ ఓపెన్ కాక చోరీకి విఫలయత్నం చేసిన ఘటనలు జిల్లాలో అనేకం నమోదవుతున్నాయి. దీంతో దొంగలు ఏకంగా మెషిన్లనే పూర్తిగా ధ్వసం చేసి తమ టార్గెట్ను పూర్తి చేస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఈ నెల 13వ తేదీన రాత్రి ఎస్బీఐ ఏటీఎంను పూర్తిగా ధ్వసంచేసి రూ.20లక్షల నగదును ఎత్తుకెళ్లారు. దుండగులు తమ ఆనవాళ్లు రికార్డు కాకుండా తెలివిగా సీసీ కెమెరాలకు బ్లాక్ కలర్ను స్ప్రే చేసిన అనంతరం తమ పని మొదలు పెట్టారు. ఏకంగా మెషిన్ను ఊడబీకి అందులోని డబ్బులు తీసుకొని బయట పడేశారు. ఫిబ్రవరి 28వతేదీన నవీపేట్ మండలకేంద్రలోని ఓ ఏటీఎంలో దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. సెంటర్లోకి చొరబడి మెషిన్ కింది భాగాన్ని ధ్వంసం చేసినా డబ్బులు కనిపించకపోయేసరికి అక్కడి నుంచి పారిపోయారు.
ఏటీఎంల నిర్వహణ, భద్రతపై ప్రజల నుంచి అనేక విమర్శలు ఉన్నాయి. మెషిన్లు పనిచేయకపోయినా, సెంటర్లలో ఏం జరిగినా వాటిని పట్టించుకునేవారు ఉండరని అంటున్నారు. ప్రతిరోజూ పెద్దమొత్తంలో నగదు అందుబాటులో ఉండే ఏటీఎం సెంటర్ల వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని ఏటీఎం సెంటర్లలో మోసగాళ్లు వినియోగదారులకు మాయమాటలు చెప్పి డబ్బులు కాజేయడం, ఏటీఎం కార్డులను మార్చడం వంటివి చేస్తున్నారు. అమాయకులకు టోపీ పెట్టి క్షణాల్లో మాయమవుతున్నారు. ఏటీఎంల చోరీ ఘటనలపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. అయితే ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో బ్యాంకు అధికారులతో పోలీసులు సమావేశం నిర్వహించి ఏటీఎం సెంటర్ల భద్రతపై సూచనలు చేశారు. గతంలో మాదిరిగానే సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలన్నారు.