కేసీఆర్, కేటీఆర్ కోసం కోనాపూర్ గ్రామం ఎదురు చూస్తున్నది. గతేడాది కామారెడ్డి పర్యటనకు వచ్చిన సందర్భంగా మంత్రి తన నానమ్మ ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నానమ్మ జ్ఞాపకార్థం రూ.2.50 కోట్ల సొంత నిధులతో పాఠశాల భవనం, రూ.75 లక్షలతో సీసీ రోడ్లు, రూ.2.40 కోట్లతో బ్రిడ్జి పనులను ప్రారంభించారు. ప్రభుత్వ బడిని కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దారు. గ్రామ శివారులో బ్రిడ్జి నిర్మాణం సైతం పూర్తయ్యింది. గ్రామంలోని రోడ్లన్నీ కొత్త అందాలను సంతరించుకున్నాయి. గ్రామం రూపురేఖలు మార్చుకొని కొంగొత్తగా కనిపిస్తున్నది. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనుండడంతో కోనాపూర్ గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇప్పటికే కొత్తరూపు సంతరించుకున్న గ్రామం.. ఈ నియోజకవర్గంలోనే ఉండడంతో కేసీఆర్ రాకతో మరింత అభివృద్ధి చెందుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-బీబీపేట్, సెప్టెంబర్ 10
“మా నానమ్మ వెంకటమ్మ గ్రామమైన కోనాపూర్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నానమ్మ జ్ఞాపకార్థంగా రూ.2.50కోట్లతో నిర్మించే పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసిన. రూ.75లక్షలతో సీసీ రోడ్లకు, రూ.2.40కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టిన.”
-గతేడాది కోనాపూర్(పోసాన్పల్లి) పర్యటనలో మంత్రి కేటీఆర్.
బీబీపేట్, సెప్టెంబర్ 10: కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని కోనాపూర్ గ్రామం సరికొత్తగా రూపుదిద్దుకున్నది. సీఎం కేసీఆర్ తల్లి వెంకటమ్మ స్వగ్రామం కావడంతో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది కోనాపూర్ను సందర్శించిన మంత్రి కేటీఆర్..గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్లుగానే కోనాపూర్ను కొంగొత్తగా మార్చారు. సొంత నిధులు రూ.2.50కోట్లతో కార్పొరేట్ పాఠశాల తరహాలో భారీ భవనాన్ని నిర్మించారు. గ్రామంలోని వీధులన్నీ సీసీ రోడ్లతో అద్దంలా మెరుస్తున్నాయి. గ్రామ శివారులో బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యింది.
కేసీఆర్ పోటీతో మరింత ఆసక్తి..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయనుండడంపై మరింత ఆసక్తి నెలకొన్నది. ఈ నియోజకవర్గంలోనే కేసీఆర్ తల్లి వెంకటమ్మ స్వగ్రామమైన కోనాపూర్ ఉన్నది. ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న కోనాపూర్.. సీఎం కేసీఆర్ వస్తే మరింత అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులంతా ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మా ఊరి బిడ్డ అయిన కేసీఆర్ను గెలిపించుకొని తీరుతామని స్పష్టం చేస్తున్నారు. ఊరు ఊరంతా కేసీఆర్ వెంటే ఉంటామని వెల్లడిస్తున్నారు.
పల్లెలన్నీ గులాబీ బాస్ వెంటే..
పల్లెలను ప్రగతిపథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆరే.. స్వయంగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడంతో పల్లెసీమలు పట్టం కడతామంటున్నాయి. గ్రామాలన్నీ మరింత అభివృద్ధి బాటలో నడుస్తాయని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లోని ప్రజలు గులాబీ బాస్కు మద్దతు తెలుపుతూ తీర్మానాలు సైతం చేయడం విశేషం. కోనాపూర్ మాదిరిగానే తమ గ్రామాల్లో సైతం అభివృద్ధి పనులు చేపడతారని ఆకాంక్షిస్తున్నారు.
తుది దశకు మరిన్ని పనులు..
మంత్రి కేటీఆర్ కోనాపూర్ గ్రామానికి కురిపించిన వరాలజల్లులో మరిన్ని పనులు తుది దశకు చేరుకున్నాయి. మహిళా , కుల సంఘాల భవనాలు మంజూరు చేసిన విషయం తెలిసింది. మినీ లైబ్రరీ, గ్రామ పంచాయతీకి ప్రహరీ, పశువైద్యశాల, రెండు బస్ షెల్టర్లు, తాగునీటి కోసం పైప్లైన్ తదితర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
కోనాపూర్లో అభివృద్ధి పనులకు మంజూరు చేసిన నిధుల వివరాలు
భారీ మెజారిటీతో గెలిపిస్తాం…
సీఎం కేసీఆర్ను భారీ మెజారిటీతో గెలిపిస్తాం. కేసీఆర్ తల్లి వెంకటమ్మ సొంత గ్రామమైన కోనాపూర్ కామారెడ్డి నియోజకవర్గంలో ఉండడంతో మరింత అభివృద్ధి చెందుతుంది. కేసీఆర్ రావడంతో కామారెడ్డితోపాటు కోనాపూర్ గ్రామ రూపురేఖలు మారతాయి. మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన పనులన్నీ పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ వస్తారు.
– బస్వరాజ్, బీఆర్ఎస్ నాయకుడు, కోనాపూర్
మరింత అభివృద్ధి సాధిస్తాం..
సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయనుండడం మా అందరి అదృష్టం. మా ఊరి బిడ్డతోనే మేమంతా ఉంటాం. అవసరమైతే ప్రతి పల్లెకు వెళ్లి ప్రచారం చేస్తాం. కేసీఆర్ను తప్పకుండా గెలిపించుకుం టాం. కేసీఆర్ గెలుపుతో మా కోనాపూర్తోపాటు జిల్లా మొత్తం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
– మొగిలి లింగం, గ్రామస్తుడు, కోనాపూర్
చాలా సంతోషంగా ఉన్నది..
మా ఊరి మనువడు, మంత్రి కేటీఆర్ ఒక్కసారి వస్తేనే కోనాపూర్ ఇంతలా అభివృద్ధి చెందింది. కార్పొరేట్ను తలదన్నేలా బడిని కట్టించిండు. బురద రోడ్లన్నీ పోయి.. సీసీ రోడ్లు అయినాయి. మా ఊరి అభివృద్ధికి ఏం కావాలన్నా చేస్తామన్నారు. ఇప్పడు సీఎం కేసీఆరే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నడు. ఇంక ఆయనొస్తే మా ఊరు మస్త్ డెవలప్ అయితది.
– చెప్యాల గణేశ్, గ్రామస్తుడు, కోనాపూర్