డిచ్పల్లి, నవంబర్ 16: పదేండ్ల క్రితం నిజామాబాద్ రూరల్ ప్రాంతం ఎలా ఉండేది..? ఇప్పుడెలా ఉందో ప్రజలు గుర్తించాలని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. సీఎం కేసీఆర్ పుష్కలంగా నిధులు ఇవ్వడంతోనే రూరల్ను అభివృద్ధి చేశామన్నారు. మండలంలోని గాంధీనగర్లో సమీపంలో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బాజిరెడ్డి మాట్లాడుతూ.. మూడోసారి రూరల్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు. తన కోరిక మేరకు రూరల్ నియోజకవర్గంలో ఇందల్వాయి, మోపాల్ మండలాలను ఏర్పాటు చేశారని, మరోసారి సీఎంతో కొట్లాడి రామడుగు మండలాన్ని సాధించుకున్నామని చెప్పారు. గుండారం గ్రామాన్ని కూడా మండలంగా చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. ధర్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ దవాఖాన, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీ ఉన్నందున ఇటీవలే డిగ్రీ కళాశాలను కూడా మంజూరు చేశారని, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు కూడా ఇవ్వాలని సీఎంను కోరారు.
నియోజకవర్గ పరిధిలోని 50 తండాలను బీఆర్ఎస్ ప్రభుత్వం జీపీలుగా మార్చిందని, ఇది సీఎం కేసీఆర్ ఘనతేనని కొనియాడారు. గిరిజనులకు 3వేల 80 ఎకరాల పోడు పట్టాలు అందించామని తెలిపారు. జక్రాన్పల్లి మండలంలో విమానశ్రయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, ఇందుకోసం అవసరమైతే రూ. 100కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో 17 చెక్డ్యాంలు, ఏడు బ్రిడ్జీలకు కేసీఆర్ నిధులు మంజూరు చేశారని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 17వేల కోట్ల రుణమాఫీ జరిగిందని, ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతో రూ. 4వేల కోట్లు మిగిలిపోయా యని వెల్లడించారు. వాటిని కూడా మాఫీ చేయాలన్నారు. రూరల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా ఉన్నందున 10వేల కుటుంబాలకు గృహలక్ష్మి పథకం అందించాలన్నారు. 21వ ప్యాకేజీ పనులు చురుగ్గా సాగుతున్నాయని, మంచిప్ప రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలకు తగిన పరిహారం ఇప్పించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు.
రిజర్వాయర్ పూర్తి అయితే లక్షా 20వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. తనకు ఆర్టీసీ చైర్మన్గా క్యాబినేట్ హోదా కల్పించిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తన హయాంలోనే 43వేల మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సంతోషంగా ఉందని, వారు కేసీఆర్ను దేవుడిలా కొలుస్తున్నారని చెప్పారు. బాజిరెడ్డి గోవర్ధన్ వినతులకు సీఎం స్పందిస్తూ రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆశీర్వాద సభలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేశ్రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నుడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ మంజుల, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, కమ్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్రావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.