డిచ్పల్లి : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటల్లోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎస్ ఆర్టీసీ పరిస్థితి యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. దాదాపు 48వేల కుటుంబాలకు చెందిన కార్మికులు, అధికారులు పని చేస్తున్న సంస్థ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 97 బస్ డిపోలు ఉండగా, 29 డిపోలు సిటీకి చెందినవని వెల్లడించారు. జిల్లాల వారీగా కొంత ఆదాయం వస్తున్నా సిటీలో ప్రతిరోజూ 3 కోట్ల రూపాయల నష్టం వస్తుందని అన్నారు. గతంలో రూ. 14 కోట్ల ఆదాయం ఉండేది. కరోనా ప్రభావం,కేంద్ర ప్రభుత్వం డిజిల్ ధరలు పెంచడంతో 14 కోట్ల ఉన్న ఆదాయం 3 కోట్లకు తగ్గిపోయిందని, దాదాపు 15 కోట్ల రూపాయల వరకు ప్రతి రోజు నష్టం వస్తున్న సంస్థ అని వివరించారు.
ఈ పరిస్థితి నుంచి ఆర్టీసీని గట్టెక్కించేందుకు సమర్ధులైన అధికారి సజ్జనార్ను ఎండీగా, చైర్మన్గా తనను నియమించారని తెలిపారు. సంస్థను కాపాడి లాభాల బాటలో వేసేందుకు ప్రతి నిత్యం అధికారులు, తాను సమాలోచనలు జరుపుతున్నామని వెల్లడించారు. ఆర్టీసీకి చైర్మన్గా నియమించినందుకు సీఎం కేసీఆర్కు సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు.