మద్నూర్, అక్టోబర్ 2: జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, తనను మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే హన్మంత్ షిండే కోరారు. మండలకేంద్రంలో సోమవారం మద్నూర్, డోంగ్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.అంతకుముందు మండలంలోని పెద్ద ఎక్లారా గేటు నుంచి వందల సంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మండల కేంద్రానికి ఇటీవల డిగ్రీ కళాశాల, సెంట్రల్ లైటింగ్ మంజూరుచేసినట్లు తెలిపారు. గతేడాది డోంగ్లిని నూతన మండలంగా ఏర్పాటు చేయడంతో అక్కడి ప్రాంత వాసులకు ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అడిగింది కాదనుకుండా తమకు సీఎం కేసీఆర్ నిధులను విడుదల చేస్తున్నారని, ఆయనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సలాబత్పూర్ ఆలయానికి రూ. 7 కోట్ల నిధులు మంజూరుకావడంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సెంట్రల్ లైటింగ్ కోసం మరిన్ని నిధులు తీసుకువస్తామన్నారు. సుమారు 12వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీ మూబారక్ పథకం ద్వారా లబ్ధి జరిగినట్లు తెలిపారు. త్వరలో దళితులందరికీ దళితబంధు పథకం వర్తింపజేస్తామన్నారు. ఓపిక పట్టాలని, అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. పేద విద్యార్థుల కోసం కార్పొరేట్ తరహాలోగురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. సమావేశంలో పార్టీ మండలాల అధ్యక్షులు బన్సీపటేల్, శశాంక్పటేల్, సర్పంచుల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు దరాస్ సురేశ్, గఫార్, సొసైటీ చైర్మన్ శ్రీనూ పటేల్, ఆత్మ కమిటీ చైర్మన్ కొండ గంగాధర్, విండో మాజీ చైర్మన్లు విజయ్కుమార్, పండిత్రావుపటేల్, సీనియర్ నాయకులు బస్వరాజ్పటేల్, బాబూపటేల్, శంకర్పటేల్, శివకుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.