చందూర్, జూన్ , 18 : రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ జలాలను సరఫరా చేస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చందూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఆదివారం మంచినీళ్ల పండుగ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సభాపతి పోచారం హాజరై మాట్లాడారు. ప్రతి మనిషికీ ఆరోగ్యం ముఖ్యమని, ఆరోగ్యమే మహా భాగ్యమని పేర్కొన్నారు. మానవ మనుగడకు నీరు, గాలి, మంచి ఆహారం చాలా అవసరమని అన్నారు. హైదరాబాద్లో ఒకప్పుడు ఒక్క దవాఖానను నడిపిస్తున్న వ్యక్తి.. ఈరోజు రెండు దవాఖానలను నిర్వహిస్తున్నాడని తెలిపారు. దీనికి కారణం మన ఆరోగ్య సమస్యలే అని పేర్కొన్నారు. అనేక ఆరోగ్య సమస్యలతోమనిషి నేడు దవాఖానల చుట్టూ తిరుగుతున్నాడని అన్నారు. ముఖ్యంగా చాలా మంది కిడ్నీ, లివర్, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారని తెలిపారు. వీటన్నింటికీ మనం తాగే కలుషితనీరే అని చెప్పారు.
తన చిన్నతనంలో పోచారం గ్రామంలో చెలిమల నీరు తాగితే ఏ జబ్బుకు గురికాలేదని, బోర్ల నుంచి వచ్చే నీటిని తాగడంవల్ల తన సోదరికి మోకాళ్ల నొప్పులు వచ్చాయని గుర్తుచేశారు. 250 నుంచి 350 ఖనిజ లవణాలు ఉండే నీటిని తాగితే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ప్రస్తుతం విషపూరితమైన కెమికల్తో తయారుచేస్తున్న బాటిళ్ల నీటిని తాగుతూ అనారోగ్యానికి గురవుతున్నామని తెలిపారు. అన్ని రకాల నీటిని పరిశీలిస్తే మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న నీరు సురక్షితమని నిర్ధారణ అయినట్లు చెప్పారు. వర్షపు నీటిని నదుల నుంచి సేకరించి శుద్ధి చేసి ఖనిజ లవణాలతో ఇంటింటికీ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రభుత్వం రూ. 500 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా 70 వేల కుటుంబాలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నదని చెప్పారు. ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నదని తెలిపారు. కలుషిత మైన నీరు తాగి అనారోగ్యానికి గురై దవాఖానల్లో రూ. లక్షలు ఖర్చు చేస్తున్నారని, ప్రజలు రోగాల బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన వివరించారు.
గతంలో రాష్ట్రంలో మూడు డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, స్వరాష్ట్రంలో 600 కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. నిమ్స్ దవాఖానలో కిడ్నీ మార్పిడి చికిత్స ఉచితంగా చేస్తున్నారని, కుటుంబంలో ఎవరైనా డోనర్ ఉంటే సరిపోతుందన్నారు. రైతులు సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు పండించాలని తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారు చేయవచ్చన్నారు.
కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, ఎంపీపీలు లావణ్యా రాంరెడ్డి, పిట్ల ఉమా శ్రీరాములు, సర్పంచులు సాయారెడ్డి, బొడ్డోళ్ల సత్యనారాయణ, గంగారాం, దేవీసింగ్, రవి, ప్యారం అశోక్, మాధవరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.