ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 26 : వేసవి రాకముందే ఎండలు ముదురుతుండడంతో కామారెడ్డి జిల్లాలో నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. చెరువులు, కుంటలు ఎండిపోతుండగా..రోజురోజుకూ భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. దీంతో పంటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు తగ్గడంతోపాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయం,చెరువుల్లో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో యాసంగి పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టుల నుంచి సరిపడా నీళ్లు వదలకపోవడం, కాలువలు, చెక్డ్యామ్లను నింపకపోవడంతో వరి, మక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటలు వేసిన రైతులు ఈసారి దిగుబడిపై నమ్మకం లేదని, పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని చాలా గ్రామాల్లో చెరువులు ఎండిపోతున్నాయి. దీంతో పంటలు పండకపోతే తీవ్రంగా నష్టపోయి, తమ బతుకులు ఆగమవుతాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలోని ప్రధాన చెరువులు ఎండిపోతున్నాయి. ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని రామారెడ్డి, సదాశివనగర్, గాంధారి, తాడ్వాయి మండల్లాలోని చాలా చెరువులు నీరులేక వెలవెలబోతున్నాయి. జిల్లాలో వంద ఎకరాల కన్నా ఎక్కువగా సాగునీరు అందించే చెరువులు 194 ఉన్నాయి. వీటి ద్వారా 46 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. వంద ఎకరాల కన్నా తక్కువ ఆయకట్టు ఉన్న చెరువులు 1056 ఉండగా, వీటికింద 39 వేల ఎకరాలకు సాగునీరు అందించాలి. వానకాలంలో వర్షాలు తక్కువగా కురవడం, సెప్టెంబర్ తరువాత వర్షాల జాడ లేకపోవడంతో చెరువులు ఖాళీగా కనిపిస్తున్నాయి. మరోసారి వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతులు యాసంగి పంటలు వేశారు. చెరువుల్లో నీటి నిల్వలు తగ్గుతుండడంతో పంటలు ఎండి పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. పంటల దిగుబడిపై ఆశలు వదులుకుంటున్నారు. రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి, కన్నాపూర్, రామారెడ్డి శివారులో ఉన్న చింతల కుంట చెరువు, కొచ్చెరువు, రంగ చెరువు, పటేల్ చెరువుల్లో నీరు ఇంకి పోవడంతో రైతులకు సాగునీరు ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో వరి పంట పొలాలు నెర్రెలు బారుతున్నాయి.
గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వాపూర్ విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో నాలుగు రోజుల క్రితం నాలుగు గంటల కరెంట్ మాత్రమే ఇచ్చినట్లు రైతులు చెబుతున్నారు. సబ్స్టేషన్ పరిధిలోని గౌరారం, సీతాయిపల్లి, మొండిసడక్, ముదెల్లి, చెన్నాపూర్ తదితర గ్రామాల్లో బోరు బావుల్లో నీటి ఊట తగ్గడం, కరెంటు సరిగా లేకపోవడంతో పంటలకు అవసరమైనంత సాగునీరు అందడంలేదని రైతులు చెబుతున్నారు. వేసవికి ముందే ఇబ్బందులు తలెత్తితే, మరో రెండు నెలల పాటు సాగునీరు ఎలాఇస్తారని ఆందోళన చెందుతున్నారు.
చెరువులో నీటి నిల్వలు ఉన్నాయని రెండెకరాల్లో వరిపంట వేశాను. కానీ చెరువులో నీరు ఎండిపోతున్నది. దీంతో పంటకు నీరు అందకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఎకరానికి రూ.16 వేల పెట్టుబడి పెట్టాను. చెరువు కిందనే బోరు వేసినప్పటికీ అదీ వట్టిపోతున్నది. చెరువులో నీరులేక, బోరుబావి నుంచి నీళ్లు రాక ఇప్పుడు పంట పూర్తిగా
దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.