నిజాంసాగర్, డిసెంబర్14: యాసంగి పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటి విడుదలను గురువారం ఉదయం ప్రారంభించారు. ప్రధాన కాలువ ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ ఏఈ శివకుమార్ తెలిపారు. నీటి విడుదల నిర్ణయాన్ని ఈనెల 13న హైదరాబాద్లో ఈఎన్సీ మురళీధర్రావు నేతృత్వంలో జరిగిన శివం కమిటీ సమావేశంలో తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు ఆయకట్టు కింద నిజాంసాగర్ నుంచి అలీసాగర్ వరకు లక్షా 25వేల ఎకరాలకు 11 టీఎంసీల నీటిని ఏడు విడుతల్లో ఏప్రిల్ వరకు విడుదల చేయనున్నట్లు తీర్మానించినట్లు తెలిపారు.
ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1405.00 అడుగుల (17.80 టీఎంసీలు) కెపాసిటీకి గాను 1403.86 అడుగుల (16.16 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు. ఆయకట్టు రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల హెచ్చుతగ్గులుగా విడుదల చేయనుండగా పది రోజులకు ఒక తడి చొప్పున నీటిని విడుదల చేసి పది రోజులు గ్యాప్ ఇస్తూ ఏడు విడుతల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని వృథా చేయవద్దని సూచించారు. జీరో డిస్ట్రిబ్యూటరీ నుంచి 49 డిస్ట్రిబ్యూటరీ వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తూ నీటి విడుదల చేయనున్నామని పేర్కొన్నారు.