నిజాంసాగర్, జూన్ 21: సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులు ఇబ్బందులు పడొద్ద్దనే నిజాంసాగర్ నుంచి నీటి విడుదలకు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో కలిసి నిజాంసాగర్ నీటి విడుదలను ఆయన బుధవారం ప్రారంభించారు.
ప్రపంచంలోనే మొదటి అది పెద్ద సాగునీటి ప్రాజెక్టు నిజాంసాగర్… ఈ వానకాలంలో మొట్టమొదటగా ఆయకట్టుకు నీటిని విడుదల చేసింది కూడా నిజాంసాగర్ ప్రాజెక్టే అని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. వానకాలం పంటల సాగుకోసం నిజాంసాగర్ ప్రాజెక్టులోని వరద గేట్ల ద్వారా 1500 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదలను బుధవారం ఎంపీ బీబీపాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్తో కలిసి స్పీకర్ ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రాజెక్టులో నీటి నిలువలు, ఆయకట్టు కింద ప్రస్తుతం వరి నాట్లు వేసుకున్న వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ వ్యవసాయ, సాగునీటి రంగాల్లో 70 ఏండ్లలో సాధించిన ప్రగతి గత ఏడేండ్లలోనే సాధించామని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు అని.. ప్రాజెక్టు నిర్మించడం వెంటనే కాలువలను తవ్వడంతో ఫలితాలు త్వరితగతిన వస్తున్నాయని బీడు భూములకు సాగునీరు అందుతున్నదని అన్నారు.
సీఎం సూచనలతో ఆయకట్టుకు సాగు నీరు
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ రోజు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశామన్నారు. జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలో లక్షా30వేల ఎకరాల ఆయకట్టు సాగు కానున్నదని తెలిపారు. నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యేతో కలిసి సీఎంకు విన్నవించగానే అంగీకరించారని ఇందుకు ఆయకట్టు రైతులందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుతం నిజాంసాగర్లో 5 టీఎంసీల నీరు నిలువ ఉందని, పంటలు చేతికి అందాలంటే సుమారు 9 టీఎంసీల నీరు అవసరం ఉందన్నారు. పరిస్థితులు అనుకూలించక నిజాంసాగర్లోకి నీరు రాకపోతే కొండపోచమ్మ సాగర్, లేదా సింగూరు నుంచి నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని అన్నా రు. మొత్తం ఆరు విడుతల్లో ఆయకట్టుకు సాగు నీటిని అందిస్తారని ఆయకట్టు రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో పెరిగిన ధాన్యం ఉత్పత్తి
సీఎం కేసీఆర్ సాగునీరు, వ్యవసాయ రంగాలపై దృష్టి సారించడంతో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. 2014లో రాష్ట్రంలో 36లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయితే నేడు 3 కోట్ల టన్నుల ఉత్పత్తికి చేరిందని ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి రాష్ట్రంలో ప్రస్తు తం ఉన్న రైస్ మిల్లులు సరిపోవడం లేదన్నారు. అందుకే రాష్ట్రంలో రెండు వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నూతనంగా రైస్ మిల్లులను ఏర్పాటు చేయలని సీఎం నిర్ణయించార న్నారు. ఒక్కో రైస్ మిల్లు 100 ఎకరాల స్థలంలో రూ.250 కోట్లతో జిల్లాకు ఒకటి చొప్పున గంటకు 60 టన్నుల మిల్లింగ్ కెపాసిటీతో నిర్మించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారని అన్నారు. త్వరలో ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రైతులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, ఎస్ఈ వాసంతి, ఈఈ సొలోమాన్, డీఈ శ్రావణ్కుమార్, ఆర్డీవో రాజాగౌడ్, సర్పంచ్ సంగమేశ్వర్గౌడ్, ఏఈ శివకుమార్, తహసీల్దార్ నారాయణ తదితరులు ఉన్నారు.