Vemula Prashanth Reddy | నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని RN ఫంక్షన్ హాల్లో జరిగిన BRS పార్టీ సభ్యత్వ నమోదు, SIR అవగాహనా, బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ.. విద్యుత్ డిస్కమ్ను మూడు ముక్కలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న కొత్త విధానం వెనుక వేల కోట్ల కుంభకోణం దాగి ఉందని వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఫ్యాక్టరీలు, కమర్షియల్, గృహ అవసరాల సంబంధించి ఆదాయం వచ్చే డిస్కమ్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వేల కోట్లు దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పథకం వేసిందని ఆరోపించారు. ఆదాయం లేని, బిల్లులు రాని రైతు వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరథ, లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లను కలిపి ‘రైతు డిస్కాం’గా మారుస్తున్నారని తెలిపారు.
గతంలో కమర్షియల్, ఇండస్ట్రియల్ విభాగాల నుండి వచ్చే ఆదాయంలో నుండి ఏటా రూ.10 వేల కోట్లు ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం వాడేవారమని, ఇప్పుడు లాభాలు వచ్చేవి ప్రైవేటుకు ఇచ్చి, కరెంట్ డిపార్ట్మెంట్పై ఉన్న రూ.35,000 కోట్ల బాకీని రైతు డిస్కాంపై నెడుతున్నారని మండిపడ్డారు. దీనివల్ల భవిష్యత్తులో రైతులకు ఉచిత కరెంట్ అందకుండా చేసి, వ్యవసాయ రంగాన్ని నిలువునా ముంచేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని, ఈ వేల కోట్ల కుంభకోణాన్ని ప్రజలందరికీ వివరించి కాంగ్రెస్ గుట్టు రట్టు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రజల అవసరాలకు కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం..
నిజామాబాద్ నగరంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అద్భుతమైన అభివృద్ధిని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నాశనం చేస్తున్నాయని, ప్రజల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ పార్టీ తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఎమ్మెల్యే ఈ సందర్బంగా ధ్వజమెత్తారు.
గతంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్గా ఉన్న సమయంలో నిజామాబాద్ జిల్లా ప్రజల అవసరాల కోసం మెయిన్ రోడ్డుపై, రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఇరిగేషన్ ఎస్ఈ ఆఫీస్ స్థలాన్ని కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం ఎంపిక చేసి ఆనాడు ఆర్టీసీ బోర్డు మీటింగ్లో రూ. 20 కోట్ల నిధులతో అత్యాధునిక బస్టాండ్ నిర్మించాలని ప్రతిపాదనలు కూడా ఆమోదించారు. కానీ నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, కోట్ల రూపాయల విలువైన ఆ బస్టాండ్ స్థలాన్ని ప్రజల అవసరాలకు కాకుండా, వారి సొంత కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం, కమర్షియల్ కాంప్లెక్స్ (షాపింగ్ మాల్స్) నిర్మించి కిరాయిల ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి కేటాయించుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే పవన్ కళ్యాణ్ ఇక్కడ సభల పెడుతా అనడం పై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే బాధపడి 11 రోజులు అన్నం తినని పవన్ కళ్యాణ్ ఇవాళ మన గడ్డపైకొచ్చి పునర్నిర్మాణం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, నియోజకవర్గ ఇంచార్జ్ రవీందర్ సింగ్, మాజీ మేయర్ నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సిర్ప రాజు, సత్య ప్రకాష్, సుజిత్ సింగ్ ఠాకూర్, నవీద్ ఇక్బల్, పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Small Habits | రోజువారీ జీవితంలో చాలా మంది చేసే చిన్న చిన్న పొరపాట్లు ఇవే.. వీటిని చేయకూడదు..
Nallagonda | డీసీఎంను ఢీ కొట్టిన మినీ ట్రావెల్ బస్సు..ఒకరు మృతి, 13 మందికి గాయాలు
Rayapol | ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో..భారీగా ట్రాఫిక్ జామ్