భీమ్గల్, జూలై 2: రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై మండలంలోని భీమ్గల్, ముచ్కూర్, బాబాపూర్ గ్రామాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, యువకులు ఆదివారం మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో భీమ్గల్ నుంచి కర్నె సత్యగంగయ్య (కాంగ్రెస్), మాసం మధు (బీజేపీ), చింతకుంట సాయి (బీజేపీ)తోపాటు అనుచరులు, ముచ్కూర్ గ్రామం నుంచి బిసిరి బాలకృష్ణ అనుచరులు, బాబాపూర్ నుంచి ధరణికోట అశోక్ (కాంగ్రెస్ మాజీ ఉపసర్పంచ్), ఆయన అనుచరులు 50 మంది ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. కేసీఆర్, తనకు మద్దతుగా బీఆర్ఎస్లో చేరిన వారికి స్వాగతం తెలుపుతున్నామన్నారు. కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని భరోసానిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కేసీఆర్ కన్నా పదేండ్ల ముందు కాంగ్రెస్ అధికారంలో ఉందని, రైతులు, పేదల కోసం చేసిందేమీ లేదన్నారు. బీజేపీ బడా ఝూటా పార్టీ అని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులను కూడా తామే చేశామని బీజేపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన ప్రాజెక్టులు, నిధులను గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ర్టాలకు అన్యాయంగా తరలిస్తుంటే .. ఇక్కడి బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి రాజకీయాలు తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టవన్నారు. బీజేపీ, కాంగ్రెస్తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని మంత్రి పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నామని, అభివృద్ధి పరంపరను ఎవరూ ఆపలేరని మంత్రి వేముల స్పష్టం చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కండ్ల ముందే కనిపిస్తున్నదన్నారు. పుష్కలంగా సాగునీరు, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిగ్రామంలో బీటీ, సీసీ రోడ్లు, వాగులపై బ్రిడ్జిలు నిర్మించి, అన్ని మండల కేంద్రాల్లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టామన్నారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇలా వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం తాపత్రయ పడుతుంటే తన మీద ప్రతిపక్షాలు ప్రెస్మీట్లు పెట్టి మరీ బురదజల్లే నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారో జిద్దుగా తీసుకుని అంతకు మూడు రెట్లు అభివృద్ధి చేస్తూ సమాధానం చెబుతానని బీజేపీ, కాంగ్రెస్ నేతలకు మంత్రి ఘాటుగా చురకలంటించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎ స్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మధుశేఖర్, రాజారాంయాదవ్, జడ్పీటీసీ చౌట్పల్లి రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సయ్య, భీమ్గల్ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.