భీమ్గల్, సెప్టెంబర్ 17: పనిచేసే ప్రభుత్వానికే పట్టం కట్టాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముఅన్నారు. అభివృద్ధి చేశాం.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఆదివారం భీమ్గల్ పట్టణంలో ఆర్టీసీ చైర్మన్ బాజరెడ్డి గోవర్ధన్తో కలిసి బస్డిపో పునఃప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి వేముల మాట్లాడుతూ.. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి సహకారంతో భీమ్గల్ బస్డిపోను ప్రారంభించినట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో 2006లో బస్డిపోను మూసివేశారని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ వారే బస్డిపో అంటూ గొడవలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బస్డిపో విషయంలో చాలా మంది రాజకీయం చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఎత్తులు వేస్తారో అంతకు మూడింతలు ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిన్న మున్సిపాలిటీ అయిన భీమ్గల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రూ.18 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు కోడిగుడ్డుపై ఈకలు లెక్కపెడుతున్నారని దుయ్యబట్టారు. వారు నీచస్థాయికి దిగజారారని అన్నారు. అంగన్వాడీ దీక్షల్లో ఆ పార్టీ నాయకులకు ఏం పని అని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీలకు రూ. 13,650 వేతనం ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కేవలం రూ.8వేలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. హైదరాబాద్లో సీడబ్ల్యూసీ మీటింగ్ ఏర్పాటుచేసి పనికి మాలిన హామీలు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. అమలుకు నోచుకోని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్రెడ్డి సరిపోడని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి అధినాయకత్వం ఏది ఇస్తే అది చదవడం తప్ప మరొకటి తెలియదన్నారు. తెలంగాణకు ఎప్పటికైనా సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.
భీమ్గల్ డిపోకు 22 బస్సులు: ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
పద్నాలుగేండ్ల క్రితం మూతబడ్డ బస్డిపోను మళ్లీ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆర్టీసీ ఇంజినీర్ల కష్టం వల్లే కేవలం రెండు నెలల్లో బస్డిపోను పునః ప్రారంభించినట్లు చెప్పారు. డిపోకు 22 బస్సులను కేటాయించినట్లు తెలిపారు. రాబోవు రోజుల్లో మరిన్ని బస్సులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో భీమ్గల్ నుంచి తిరుపతికి కూడా బస్సులను ప్రారంభిస్తామన్నారు. ఆర్టీసీని ఆదరించాలని కోరారు. తెలంగాణ వస్తే ఏం వస్తది అని ఎద్దేవా చేసిన వారికి మూతబడ్డ బస్డిపోలు ప్రాంభమవుతాయని వారికి చెప్పివచ్చామన్నారు. ఆర్టీసీని బతికించేందుకు సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేశారని తెలిపారు. చివరికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 43వేల కుటుంబాలకు కేసీఆర్ దేవుడయ్యాడని చెప్పారు.
గతంలో ఎంతో మంది సీఎంలను చూశామని, కానీ కేసీఆర్లాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ ప్రయోజనం పొందాలని చూస్తోందన్నారు. ఓట్లు దండుకొని బయటపడేవారి మాటలు నమ్మవద్దని సూచించారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత, ఎంపీపీ మహే శ్, జడ్పీటీసీలు రవి, జగన్, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్, విండో చైర్మన్ నర్సయ్య, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ముత్తెన్న, మున్సిపల్ వైస్చైర్మన్ భగత్, ఆర్టీసీ ఈడీ వినోద్ కుమార్,ఆర్ఎం జానిరెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మోయిజ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
పనులు నాణ్యతతో చేపట్టాలి
భీమ్గల్, సెప్టెంబర్ 17: ప్రభుత్వ దవాఖాన పనులను నాణ్యతతో చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాంట్రాక్టర్కు సూచించారు. ఆదివారం ఆయన భీమ్గల్లో కొనసాగుతున్న వంద పడకల దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థను మంత్రి ఆదేశించారు.