మోర్తాడ్, నవంబర్ 17: వరదకాలువ, కాకతీయ కాలువ, పెద్దవాగులో చెక్డ్యాంల నిర్మాణంతో మోర్తాడ్ మండలంలోని పాలెం, తిమ్మాపూర్ గ్రామాలకు సాగునీటి ఇబ్బందులు దూరమైనట్లు బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. పదేండ్ల క్రితం వరకు బీడుభూములుగా ఉన్న భూములన్నీ సాగుభూములుగా మారాయన్నారు. ఇప్పుడు పాలెం, తిమ్మాపూర్ శివారుల్లో ఎటు చూసినా పంటపొలాలే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు లీకేజీ వా టర్ అడుక్కునే పరిస్థితులు ఉండేవని, రాష్ట్రం వచ్చాక రైతుల పరిస్థితులను గమనించి కేవలం రెండేండ్లలోనే లీకేజీ నీటిని అడుక్కునే దుస్థితి లేకుండా చేశామన్నారు. 365 రోజులు వరదకాలువ, కాకతీయకాలువలో నీళ్లు ఉండేలా చేశామన్నారు. శుక్రవారం ఆయన మోర్తాడ్, మెండోరా మండలాల్లో పర్యటించారు. ఉదయం మోర్తాడ్ మండలం తిమ్మాపూర్, పాలెం, మోర్తాడ్, సాయంత్రం మెండోరా మండలం కొడిచెర్ల, మెండోరా, పోచంపాడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ గ్రామాల్లో యువకులు బైక్ర్యాలీ, డ్యాన్సులతో స్వాగతం పలకగా, మహిళలు బోనాలు, మత్స్యకార్మికులు వలగొడుగులతో మంత్రి వేములకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వేముల మాట్లాడుతూ.. గతంలో చుక్క సాగునీరు లేక బాధపడ్డ రైతులు ఎస్సారెస్పీ లీకేజీ వాటర్ కోసం తనను సైతం కోపగించుకున్నారని గుర్తు చేశారు.
ఆ సమయంలో ప్రాజెక్ట్లో నీళ్లు లేక లీకేజీ వాటర్ను అందించలేని పరిస్థితి ఉండేదని, ఆనాడే తాను రైతులకు మాట ఇచ్చానని తెలిపారు.365రోజులు సాగునీటిని అందుబాటులో ఉంచుతానని మాట ఇచ్చిన ప్రకారం కాళేశ్వరం జలాలను రివర్స్ పంపింగ్తో వరదకాలువ ద్వారా ఎస్సారెస్పీని నింపినట్లు తెలిపారు. 70 ఏండ్ల పాలనలో బీజేపీ, కాంగ్రెస్లు కరెంటు, తాగునీరు ఎందుకివ్వలేదో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సారెస్పీ నుంచి నీటిని శుద్ధి చేసి ఇంటింటికీ ఫిల్టర్ నీటిని మిషన్భగీరథ ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. పాలెం, తిమ్మాపూర్ గ్రామాల్లో రూ.130కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో ఆలోచించాలన్నారు. జరిగిన అభివృద్ధి అంతా కండ్ల ముందే కనిపిస్తుందని చెప్పారు. దేశంలో నాలుగు రాష్ర్టాల్లో కాంగ్రెస్, 18 రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉన్నాయని ఆ రాష్ర్టాల్లో తెలంగాణలో అమలవుతున్న 24గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. అక్కడ పింఛన్ కేవలం రూ.750 నుంచి వేయిరూపాయల వరకు మాత్రమే ఉన్నాయని చెప్పారు. పక్కనే ఉన్న రాష్ర్టాలకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వెళ్లి చూసి రావాలని సూచించారు. ఇక్కడ అమలవుతున్న పథకాలు అక్కడ లేనట్లయితే కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా తనకే ఓటు వేయడం న్యాయమన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్, బీజేపీల పేర్లు చెప్పి ముస్లింల ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తుందని, ఈ రెండు పార్టీలతో మైనార్టీలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో హైదరాబాద్లో మాటిమాటికీ కర్ఫ్యూలు ఉండే పరిస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించాలన్నారు. కానీ తెలంగాణ సాధించుకున్నాక రాష్ట్రంలో శాంతియుత వాతావరణ నెలకొందని చెప్పారు. అభివృద్ధి చేసే విషయంలో ఎక్కడ కూడా రాజీపడలేదన్నారు. తారురోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, సాగు, తాగునీటి కష్టాలను దూరం చేశామన్నారు. ఓటు అనేది అతి విలువైనదని, ఆషామాషీగా వేసేది కాదని అభ్యర్థి ఏం చేశాడు, మనం వేసే ఓటు అభ్యర్థికి సంబంధించిన పార్టీ మనకేం చేసిందో ఆలోచించి వేయాలని సూచించారు. ఆనాడు ఏం చేయని వారు ఈరోజు ఏమో చేస్తామని వచ్చి చెప్పితే మోసపోవద్దన్నారు. ప్రచార కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మధుశేఖర్, కోటపాటి నర్సింహనాయుడు, ఎంపీపీ శివలింగుశ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచులు గడ్డం చిన్నారెడ్డి, సంతోష్, బోగ ధరణి ఆనంద్, ఎంపీటీసీలు అస్మా అజారుద్దీన్, రాజ్పాల్ తదితరులు పాల్గొన్నారు.
వేములకు ఏకగ్రీవ తీర్మాన కాపీ అందజేత
భీమ్గల్ మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు తీర్మాన కాపీని వేల్పూర్ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో గూండ్ల గంగపుత్ర సం ఘం సభ్యులు అశోక్, సురేశ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం ముప్కాల్, ఏర్గట్ల మండలాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ముప్కాల్ మండలం వేంపల్లి, 10.30 గంటలకు కొత్తపల్లి, మధ్యాహ్నం ఒంటి గంటకు నల్లూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు ఏర్గట్ల మండలం బట్టాపూర్, 6 గంటలకు తడ్పాకల్, 7.30 గంటలకు ఏర్గట్ల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
మెండోరా, నవంబర్ 17 : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి రైతులు, వ్యవసాయంపై అవగాహన లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం సాయంత్రం మెండోరా మండలం కొడిచెర్ల, మెండోరా, పోచంపాడ్లో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పది హర్స్పవర్ పంపు సెట్లతో నీటిని పారించుకోవడమంటూ కొత్త పాట మొదలెట్టాడన్నారు. రేవంత్ కొత్త పాటపై అందరూ ఎద్దేవా చేస్తూ నవ్వుకుంటున్నారన్నారు.