ఎల్లారెడ్డి, అక్టోబర్ 28 : జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి తగిన గుణపాఠం చెబుతామని ఆ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వడ్డేపల్లి సుభాష్రెడ్డి హెచ్చరించారు. తనకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఉద్వేగానికి లోనైన వడ్డ్డేపల్లి సుభాష్రెడ్డి.. ఎల్లారెడ్డిలోని ఆయన నివాసంలో కార్యకర్తలు, అభిమానులతో శనివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. 2018లో నామినేషన్ వేస్తే అదే రోజు రేవంత్ రెడ్డి, జైరాం రమేశ్, డీకే శివకుమార్లు తనకు లోక్సభ కు అవకాశం ఇస్తామని నమ్మించారని తెలిపారు. 2019లో పార్లమెంటు ఎన్నికలు రాగా.. అప్పుడు కూడా మదన్ మోహన్ రావుకే టికెట్ ఇచ్చారన్నారు. దీనిపై గట్టిగా నిలదీస్తే మల్కాజిగిరి నియోజక వర్గంలో పని చేయాలని చెబితే అక్కడ పనిచేశానని చెప్పారు. మదన్ మోహన్ తన ఇంటికి వస్తే తాను నాగిరెడ్డిపేట, పిట్లం, లింగంపేట, గాంధారిలో పనిచేసి నియోజకవర్గంలో నాలుగు వేల మెజారిటీ తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఆయన క్యాలెండర్లు రూపొందిస్తే మదన్మోహన్రావు ఫొటో మాత్రమే ఉంటదని, కానీ తాను అంబులెన్సు ఏర్పాటు చేసి దానిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీల, రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ ఫొటోలు పెట్టి గ్రామ గ్రామాన సేవలు అందించినట్లు వివరించారు.తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మదన్మోహన్రావును గెలువనివ్వబోనని స్పష్టం చేశారు. తాను రెబల్గా నామినేషన్ వేసి ఆయనను ఓడిస్తానని అన్నారు. రేవంత్రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలుకు పోతే దోమలు కుట్టినా ఆయనతోనే ఉన్నానని గుర్తుచేశారు. ఆయన కోసం కోర్టుకు వెళ్లానన్నారు. తన కుటుంబీకులు, బంధువులు ఎవరు కాలం చేసినా.. నా ప్రజలు, నా పార్టీ అంటూ వెళ్లకుండా తాను ఎల్లారెడ్డికే పరిమితమైనట్లు చెప్పారు. తన కుటుంబ సభ్యులు, కార్యకర్తల అభీష్టం మేరకు తాను బరిలో ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ లాబియింగ్ పార్టీగా మారిందని విమర్శించారు. మదన్ నాన్ లోకల్ అని, ఆయన ఇక్కడ రాజకీయాలు చేస్తే అంగీకరించేంది లేదని హెచ్చరించారు. ఆరు గ్యారంటీ పథకాలు అని చెబుతున్న రేవంత్ రెడ్డి.. ఆయన వెంట ఉన్న నలుగురిని దక్కించుకోలేక పోతే ఆయనేమి పీసీసీ చీఫ్ అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ కండువాల దహనం
ఆత్మీయ సమ్మేళనం అనంతరం కాంగ్రెస్ పార్టీ కండువాలు, పార్టీ ఫ్లెక్సీలను సుభాష్రెడ్డి అనుచరులు దహనం చేశారు. కార్యాలయం ఎదుట రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
నియోజకవర్గంలో ఏ ఒక్క సర్పంచ్, ఎంపీటీసీని గెలిపించని మదన్ మోహన్కు టికెట్ ఇవ్వడం అన్యాయం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెంటనే టికెట్ క్యాన్సిల్ చేసి సుభాష్ రెడ్డికి ఇవ్వాలి. మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే కార్యకర్తలుగా ఆయనను ఓడించి తీరుతాం.
-శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు
రేవంత్రెడ్డి టికెట్ను అమ్ముకున్నాడు..
2018 లో జరిగిన అన్యాయం మరోసారి జరుగదని ప్రకటించిన రేవంత్ రెడ్డి ..ఇప్పుడు ఎన్ని కోట్లకు టికెట్ అమ్ముకున్నాడో చెప్పాలి. అప్పుడు ఎవరూ అడుగకుండానే సుభాష్ రెడ్డికి టికెట్ ఖాయమని చెప్పిన రేవంత్ రెడ్డి ఐదేండ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన తరువాత మోసం చేశాడు.
-నారెడ్డి మోహన్ రెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్
డబ్బు సంచులకు అమ్ముడు పోయారు
ప్రజలు, పార్టీ కోసం పనిచేసిన సుభాష్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా..కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డబ్బులకు అమ్ముడుపోయింది. మల్లికార్జున ఖర్గే ఎల్లారెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటమి ఖాయం. మేమే గెలుస్తాం.. మీరు ఎల్లారెడ్డికి వచ్చి మళ్లీ సుభాష్రెడ్డిని కలవాలి. ఆయనకున్న సైన్యం కాంగ్రెస్ పార్టీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తది.
-నర్సింహులు, వైస్ ఎంపీపీ, ఎల్లారెడ్డి
తగ్గేదేలేదు..
ఇంటింటికీ తిరిగి సుభాష్ రెడ్డిని గెలిపిస్తాం. ఇప్పుడు ఎవరు చెప్పినా తగ్గేదేలేదు. కాంగ్రెస్ పార్టీ ని భుజం మీద పెట్టుకొని పని చేసిన సుభాష్ అన్నకు టికెట్ ఇవ్వకుంటే ఇక్కడ ఆ పార్టీ గెలిచేది లేనేలేదు. ఇప్పటి నుంచి ఆడోళ్లందరం కలిసి అన్న కోసం పనిచేస్తాం.
-భూదవ్వ, కాంగ్రెస్ నాయకురాలు, బ్రాహ్మణపల్లి, గాంధారి మండలం