Kotagiri | కోటగిరి, మార్చి 12 : పశువులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు చేయిస్తే మూగ జీవాలకు వ్యాధులు దరి చేరవని కోటగిరి మండల పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేస్తున్నామని ఆయన తెలిపారు. కోటగిరి మండలంలోని వలాభపూర్ గ్రామంలోని పశువులకు గురువారం ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు చేశామన్నారు. ఈ శిబిరాన్ని స్థానిక సర్పంచ్ రొట్టె పుష్పవతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పుష్పవతి మాట్లాడుతూ గ్రామాల్లో పశువులకు డాక్టర్లు చేసే గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా చేయించాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పాడి పశువులతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయిలు, విఠల్ పటేల్, పశు వైద్య సహాయకులు సుధీర్, సిబ్బంది భూమేష్, రైతులు పాల్గొన్నారు.