Dhanush Fan Club | కోయంబత్తూరులోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేయాలని, కొత్త సభ్యులను చేర్చుకోవాలని కోరుతూ ప్రముఖ నటుడు ధనుష్ ఫ్యాన్ క్లబ్ పిలుపునిచ్చింది. ఈ పరిణామంతో ధనుష్ రాజకీయ అరంగేట్రంపై కోలీవుడ్లో మళ్లీ తీవ్ర చర్చలు మొదలయ్యాయి. ఈ విషయంపై ఇప్పటివరకు నటుడు ధనుష్ వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, ఆయన ఫ్యాన్ క్లబ్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ‘ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్’ తరఫున కోయంబత్తూరు నార్త్, కౌండంపాలయం, సింగనల్లూర్, సులూర్, మేట్టుపాళ్యం నియోజకవర్గాల్లో అభిమాన సంఘాలను ఏర్పాటు చేయాలని కోరుతూ సంఘం కార్యవర్గం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 8 నాటి ఈ నోటీసును ఆ సంఘం జాతీయ కార్యదర్శి బి. రాజా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కోయంబత్తూరు జిల్లా అధ్యక్షుడు జి. శంకర్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని అందులో పేర్కొన్నారు. ధనుష్ ఫోటోతో ఉన్న ఈ నోటీస్పై ఆ సంఘం అఖిల భారత అధ్యక్షుడు వి. సుబ్రమణ్య శివ, కార్యదర్శి బి. రాజా సంతకాలు చేశారు.
ఈ ప్రకటనలో ఎక్కడా ప్రత్యక్షంగా రాజకీయాల గురించి లేదా కొత్త పార్టీ ప్రకటన గురించి ప్రస్తావించనప్పటికీ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేయడం, భారీగా సభ్యులను చేర్చుకోవడం వంటి అంశాలు ఆయన పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు మళ్లీ ఊతమిస్తున్నాయి. సాధారణంగా తమిళనాడులో సినీ నటుల ఫ్యాన్ క్లబ్లు ఇలాంటి కార్యక్రమాలతోనే క్షేత్రస్థాయిలో బలపడటం, ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించడం గతంలో చాలాసార్లు జరిగింది. దీంతో ధనుష్ కూడా అదే బాటలో పయనిస్తున్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది.
ప్రస్తుతానికైతే ధనుష్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఎలాంటి అధికారిక సంకేతాలు లేవు. ఆయన సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘ఓం: చాప్టర్ 1’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ వెంటనే తమిళరసన్ పచముత్తు దర్శకత్వంలో ‘డీ56’ (D56) సినిమాను ప్రారంభించనున్నారు. అలాగే ‘కర్ణన్’ తర్వాత మరోసారి మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఏ.ఆర్. రెహమాన్ సంగీతంలో నటించనున్నారు. అంతేకాకుండా, వెట్రిమారన్ తోనూ ‘తమిళ్ మురుగన్’ కోసం మరోసారి చేతులు కలపనున్నారు.