ఖలీల్వాడి, అక్టోబర్ 13 : కులమతాలకతీతంగా నగరంలో సంక్షేమ పథకాలను అందించామని.. నగరాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేశామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. మేరు సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేశామని, ప్రభుత్వం బీసీ కులస్తులకు అందించే రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. నగరంలోని ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని, స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు ఐటీ టవర్ను నిర్మించామన్నారు. వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి న్యాక్ భవనాన్ని ఏర్పాటు చేశామన్నారు. వచ్చే తరాలకు సైతం తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్ భగీరథ పైపులైన్లు నిర్మించామన్నారు. ఎల్లమ్మగుట్ట రైల్వే కమాన్ వద్ద ఆర్యూబీ, అత్యాధునిక సౌకర్యాలతో వైకుంఠధామాలు నిర్మించామన్నారు. హైదరాబాద్లోని మహా ప్రస్థానం కన్నా నిజామాబాద్ వైకుంఠధామాలు బాగున్నాయని మంత్రి కేటీఆర్ కితాబునిచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆలయాలు పూర్వవైభవం సంతరించుకున్నాయన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, సిర్ప రాజు, సామ హన్మంతురావు, కొత్తూర్ చంద్రకాంత్, మంతెన దశరథ్, ఎన్ను సుదర్శన్ పాల్గొన్నారు.
ఐకమత్యానికి నిదర్శనం పద్మశాలీలు..
ఐకమత్యానికి నిదర్శనం పద్మశాలీలని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని 15 తర్పల సభ్యులతో గాయత్రీనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నేతన్నల ఆత్మహత్యలతో ఆగిన మగ్గాలు.. నేడు సీఎం కేసీఆర్ భరోసాతో పరుగులు పెడుతున్నాయన్నారు. బతుకమ్మచీరల తయారీతో చేనేత కార్మికుల జీవితాల్లో ఉపాధి వెలుగులు నిండాయన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు పింఛన్లు సైతం ఇస్తున్నట్లు తెలిపారు. నగరంలోని పద్మశాలీల సంఘ భవనాల కోసం రూ.8 కోట్లు కేటాయించామన్నారు. రాజకీయాలతో పాటు వివిధ కమిటీల్లో పద్మశాలీలకు ప్రాధాన్యం కల్పించామని వివరించారు. రూ. కోటీ 50 లక్షలతో పద్మశాలీ కల్యాణ మండపాన్ని , రూ. 5 లక్షలతో ఉద్యోగుల సంక్షేమ భవనాన్ని నిర్మించామన్నారు. నగరంలో ప్రతి కులసంఘానికి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని వివరించారు. పద్మశాలీ హాస్టల్ నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరు చేశామన్నారు. పద్మశాలీల ఆరాధ్య దైవం భక్త మార్కండేయ ఆలయ పునర్నిర్మాణం కోసం రూ. 25 లక్షల నిధులు మంజూరు చేశామని తెలిపారు. మరింత అభివృద్ధి కోసం మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి చేస్తానన్నారు.
కార్యక్రమంలో గుజ్జేటి వెంకటనర్సయ్య, ఎనగందుల మురళి, సిరిగాద ధర్మపురి, సత్యపాల్, పుల్గం హన్మాండ్లు, దీకొండ యాదగిరి, బిల్ల మహేశ్, చింత మహేశ్, రాపెల్లి గురుచరణం, కస్తూరి గంగరాజు, శివలింగం, బింగి మోహన్ తదితరులు పాల్గొన్నారు.