ఖలీల్వాడి, నవబంర్ 1: ఇందూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి తనను ఆశీర్వదించాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా కోరారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాలులో బుధవారం నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో బిగాల పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో దివ్యాంగుల కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలుకావడంలేదన్నారు. దివ్యాంగుల కష్టాలను సీఎం కేసీఆర్ మానవీయకోణంలో ఆలోచించారన్నారు. వారు ఎవరికీ భారం కాకూడదనే ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులను గుర్తించి దేశంలో ఎక్కడాలేని విధంగా అధిక పింఛన్ ఇస్తున్నారని తెలిపారు. 40శాతానికి పైగా వైకల్యం కలిగిన వారికి రుణాలు ఇచ్చి చేయూతనిచ్చారని చెప్పారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. నగరంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలను అందించామని చెప్పారు. ప్రతి గల్లీని అభివృద్ధి చేశామని, సంక్షేమంలో భాగంగా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అందిస్తున్నామని వివరించారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ఉచితంగా కార్పొరేట్ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీ అయితే రూ.12 వేలు, కేసీఆర్ కిట్ను ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.400లకే వంటగ్యాస్, రేషన్ కార్డు కలిగిన వారికి సన్నబియ్యం ఇస్తామన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా నిరుపేద మహిళలకు రూ. 3వేలు ఇస్తామని చెప్పారు. అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, బీఆర్ఎస్ నాయకులు దండు శేఖర్, ఎనుగందుల మురళి, పోల నారాయణ, పంచరెడ్డి సూరి, నవీన్, వెల్డింగ్ నారాయణ, ముత్యాలు, బైఖాన్ మధు, రాజేంద్రప్రసాద్, శివచరణ్, ఎర్రం గంగాధర్, మహిళా నాయకులు చంద్రకళ, చాంగుబాయి పాల్గొన్నారు.