నిజామాబాద్ క్రైం,జూన్ 23 : కట్నం డబ్బుల కోసం అత్తింటి వారి వేధింపులు భరించలేక పిల్లలతో సహా తల్లులు ఆత్మహత్యకు యత్నించిన హృదయవిదారక సంఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకున్నది. ఇందులో నలుగురు సురక్షితంగా బయటపడగా మూడేండ్ల బాలుడు చెరువులో గల్లంతయ్యాడు. బాధితులతోపాటు పోలీసులు తెలిపిన మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన అక్షయ, నిఖిత ఇద్దరు అక్కాచెల్లెళ్లు. వీరిలో అక్షయను మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్కు చెందిన వ్యక్తికి, నిఖితను హైదరాబాద్లోని జీడిమెట్లకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. వివాహ సమయంలో నగరంలోని కొత్త కలెక్టరేట్ సమీపంలో ఉన్న స్థలాన్ని ఇద్దరు కూతుళ్లకు ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున తల్లిదండ్రులు రాసిచ్చారు. అయితే ప్రస్తుతం అక్షయ, నిఖితలకు ఇచ్చిన ప్లాట్లకు వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. దీంతో వారి ప్లాట్లను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అక్షయ, నిఖిత భర్తలు తమకు కట్నం కింద రాసిచ్చిన ప్లాట్లను విక్రయించి డబ్బులు తీసుకొని రావాలంటూ వేధింపులకు గురిచేస్తూ వస్తున్నారు. దీంతో ఇద్దరూ పిల్లలతో వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చేశారు. ఇక్కడ ప్లాట్లు అమ్మేందుకు వీలులేకపోవడంతో అత్తింటి వారి నుంచి ఇంకా ఎలాంటి వేధింపులు ఉంటాయోనని తీవ్ర మనస్తాపం చెందారు. శుక్రవారం ఉదయం అక్షయ తన కుమారుడు చిన్న (3), నిఖిత తన కుమారుడు భవేశ్, కూతురు క్షేమతో కలిసి నగర శివారులోని నెహ్రూనగర్ గ్రామ పరిధిలో గల అశోక్ సాగర్ వద్దకు చేరుకున్నారు. అత్తింటి వేధింపుల నుంచి తప్పించుకునేందుకు చావే శరణ్యమని భావించి ముగ్గురు పిల్లలతో సహా అశోక్ సాగర్లో దూకేశారు. అదే సమయంలో అటు వైపుగా వెళ్తున్న వారు గమనించి అక్షయ, నిఖితతో పాటు ఇద్దరు పిల్లలు భవేశ్, క్షేమలను కాపాడి ఒడ్డుకు చేర్చారు. అయితే చిన్న మాత్రం నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బాలుడి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సై సాయికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కాచెల్లితో పాటు ఇద్దరు పిల్లలను చికిత్స నిమిత్తం హుటాహుటిన జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు.