సీఎం కేసీఆర్ నిరంతరం పేదలకు మేలు చేయడం కోసమే ఆలోచిస్తారని.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆరాటపడుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ముప్కాల్ మండలంలో రూ.7.62 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపు బోర్డు పేరిట రైతులను మోసం చేసిన ఎంపీ అర్వింద్ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తాడన్నారు. కాంగ్రెస్,బీజేపీ పార్టీల మాటలు నమ్మి మోసపోతే..గోస పడతామన్నారు. వేముల సురేందర్రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
-ముప్కాల్/వేల్పూర్, ఆగస్టు 27
ముప్కాల్, ఆగస్టు 27: పేదలకు మేలు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీ ఆరాటం, ఆతృత చూపుతున్నాయని విమర్శించారు. ఆదివారం ఆయన ముప్కాల్ మండలంలో రూ.7.62 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. ఆకాశంలో ఉన్న చందమామను తెచ్చి ఒళ్లో పెడతాం.. సూర్యుడిని కిందికి తెస్తామంటూ కాంగ్రెస్ నాయకులు గప్పాలు మాట్లాడుతున్నారని అన్నారు. వారి పార్టీ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు దివ్యాంగులకు రూ. 4వేల పెన్షన్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అప్పుడు ఇవ్వనోళ్లు..ఇప్పుడిస్తామంటే ఎలా నమ్ముతామన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఆ పార్టీ పాలించే రాష్ర్టాల్లో తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. బీజేపీ మాటలు అన్ని అబద్ధాలే అని, అర్వింద్ ఐదు రోజుల్లో పసుపు బోర్డు కథ మాదిరే అని ఎద్దేవా చేశారు.
రైతులను మోసం చేసిన అర్వింద్ ఏం మొహం పెట్టుకొని ప్రజల్లోకి వస్తాడని అన్నారు. వయస్సు చూడకుండా, మహిళలు అని కనీస మర్యాద లేకుండా కేసీఆర్, కేటీఆర్, కవిత, తనపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ధాన్యపు కల్లాలు ఎత్తినప్పుడు అడుక్కోవడానికి వచ్చినట్లు ఎన్నికలప్పుడు కూడా అలాగే వస్తారని, వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ మాట లు నమ్మి మోసపోతే.. గోస పడతామన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడని, మళ్లీ పాత రోజులే మనకు కావాలా అని అన్నారు. రైతు రుణాలను రెండు దఫాల్లో మాఫీ చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలాలుగా అభివృద్ధి చేస్తున్న తనను తొమ్మిదేండ్లు విమర్శించని కాంగ్రెస్, బీజేపీ నేతలు రెండు నెలలుగా తనపై ఎందుకు బురద జల్లుతున్నారో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. తనను అడ్డుకోవాలని ప్రతిపక్ష నేతలు కుటిల రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ అర్వింద్ ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి ఎంత సహాయం అందించారో చెప్పాలని నిలదీశారు. మోసపూరిత హామీతో ఇక్కడి ప్రజల ఓట్లు దండుకున్న ఎంపీ.. ఈ ఊరిలో ఒక్కరికైనా సహాయం అందించాడా అని ప్రశ్నించారు.
వేల్పూర్, ఆగస్టు 27 : మండలంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పసుపు (టర్మరిక్) ఆధారిత పరిశ్రమ (ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్) ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మండలంలోని అమీనాపూర్ గ్రామ సమీపంలో స్పైస్ పార్కులో కేటాయించిన స్థలాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఎకరం స్థలం కేటాయిస్తూ మార్కింగ్ చేయాలని ఆర్డీవో వినోద్, వేల్పూర్ తహసీల్దార్ నాగార్జునను మంత్రి ఆదేశించారు. స్థల కేటాయింపుపై అధికారులకు ఆదేశాలు ఇచ్చినందుకు మహిళా సమాఖ్య సభ్యులు మంత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేసి మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని, ప్రభుత్వ సహాయ, సహకారాలు ఎప్పుడూ ఉంటాయని మంత్రి భరోసా ఇచ్చారు.
వేల్పూర్, ఆగస్టు 27 : రైతు నాయకుడు దివంగత వేముల సురేందర్రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పలువురు రైతునాయకులు, అభిమానులు ఘన నివాళులర్పించారు. వేల్పూర్ గ్రామశివారులోని సురేందర్రెడ్డి స్మృతివనంలో పుష్పాంజలి ఘటించారు. అనంతరం వేల్పూర్ ఎక్స్ రోడ్డులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వరాష్ట్ర కాంక్షతో ఆది నుంచి కేసీఆర్ వెన్నంటే ఉండి రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా పని చేశారని, బీఆర్ఎస్ రైతు విభాగం అధ్యక్షుడిగా ఉంటూ రైతులను సంఘటితం చేశారని ఈ సందర్భంగా మంత్రి వేముల గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో తన తండ్రి ఆశయాలు కొనసాగిస్తానని మంత్రి తెలిపారు.