రహదారి విస్తరణ పనులకు అడ్డువచ్చిన చెట్లకు ఫారెస్టు అధికారులు జీవం పోశారు. సంగారెడ్డి-నాందేడ్-అకోలా జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మూడేండ్ల క్రితం తొలగించిన భారీ వృక్షాలను ట్రాన్స్లొకేషన్ పద్ధతిలో ఇతర ప్రాంతాల్లో నాటి వాటిని సంరక్షించారు. దీంతో ఆ వృక్షాలు మళ్లీ ఏపుగా పెరిగాయి. నిజాంసాగర్, జుక్కల్ మండలాల్లో మొత్తం 107 చెట్లను ఈ పద్ధతిలో తిరిగి నాటగా 70 వరకు చెట్లు బతికి ఏపుగా పెరిగాయి. అటవీశాఖ అధికారులు తీసుకున్న చొరవకు ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు.
నిజాంసాగర్, జుక్కల్ మండలంలో మొత్తం 107 చెట్లను ట్రాన్స్లోకేషన్ పద్ధతిలో నాటగా వాటిలో సుమారు 70 వరకు చెట్లు బతికి ఏపుగా పెరిగాయి. అటవీశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంతో మంచి విజయాన్ని సాధించారంటూఉన్నతాధికారులు సైతం సిబ్బందిని అభినందిస్తున్నారు. నాటిన చెట్లను చక్కగా సరంక్షించడంతోనే ఈ రోజు ఏపుగా పెరిగాయి సంగారెడ్డి-నాందేడ్-అకోలా జాతీయ రహదారి విస్తరణ పనులు మూడేండ్ల కిందట ప్రారంభించారు. పనులు చేసే క్రమంలో పిట్లం రేంజ్ పరిధిలో భారీ చెట్లను తొలగించాల్సి వచ్చింది. దీంతో అటవీ శాఖ అధికారులు తొలగించిన చెట్లను (ట్రాన్స్లొకేషన్ పద్ధతిలో) భారీ క్రేన్ల సహాయంతో ఇతర చోట్ల నాటారు. ట్రాన్స్ లొకేషన్ అంటే చెట్లకు ఉన్న కొమ్మలను తొలగించి వేర్లతో సహా వెలికితీసి మరోచోట నాటడం. మూడేండ్ల క్రితం ఈ పద్ధతిలో నాటడంతో అవి భారీ వృక్షాలుగా మారాయి.
2019 సంవత్సరంలో భారీ వృక్షాలను రహదారి విస్తరణలో తీసేయాల్సి వచ్చింది. దీంతో రహదారి విస్తరణ చేసే సంస్థ అటవీ శాఖ అధికారులతో కలిసి మరో చోట నాటారు. నిజాంసాగర్ మండల పరిధిలో 92 చెట్లను తొలగించారు. ఆ సమయంలో రేంజ్ అధికారి సంజయ్గౌడ్, బీట్ అధికారి సిద్ధార్థ పర్యవేక్షణలో 46 చెట్లను మంగ్లూర్ అటవీ ప్రాంతంలో, 46 చెట్లను ఒడ్డెపల్లి శివారులో ట్రాన్స్లోకేషన్ పద్ధతిలో నాటారు. జుక్కల్ మండల శివారులో సైతం 15 చెట్లను తొలగించగా వాటిని శేఖాపూర్ శివారులో నాటారు. వాటిలో మర్రి, రావి, వేప, నెమలినార, నర్సింగ్, సోమ, ఇప్ప, మొర్రితో పాటు పలు రకాల చెట్లు ఉన్నాయి.
రహదారి విస్తరణ సమయంలో రహదారి పనులకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించిన సమయంలో వాటిని ట్రాన్స్లొకేషన్ ద్వారా మరో చోట నాటడంతో వాటిలో చాలా వరకు చెట్లు బతికి ప్రస్తుతం చక్కగా ఏపుగా పెరిగాయి. నాటిన చెట్లలో మర్రి, మేడి, రావి, జువ్వి వంటి చెట్లు వంద శాతం బతికాయి. వేప ఒక్కటి మాత్రమే అంతగా బతకలేకపోయాయి. నాటిన చెట్లను చక్కగా సంరక్షించడంతోనే విజయం సాధ్యమైంది.