కంఠేశ్వర్, జనవరి 19 : జిల్లాలో ఈనెల 20, 21వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా యువ ఓటర్ల పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధలో భాగంగా శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అసెం బ్లీ నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించి, ఆయా అంశాలపై దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యా రు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు భాగస్వాములయ్యేలా చూడాలని సూచించారు. ముఖ్యంగా 18 ఏండ్లు నిండిన యువత తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా చొరవ చూపాలన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద నిర్ణీత 6/7/8 దరఖాస్తు ఫారాలతో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఓటరు తుది జాబితాల్లో ఏ ఒక్క బోగస్ పేరు ఉండకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కొత్త ఓటర్ల గుర్తింపు కార్డుల ప్రింటింగ్ కోసం సమగ్ర వివరాలతో జాబితాను త్వరగా పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25న విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం మకరంద్, ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, వినోద్ కుమార్,రాజాగౌడ్, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.