అవని నుంచి ఆకాశం దాకా.. ఇంటి బాధ్యతల నుంచి దేశ భద్రత దాకా.. ‘ఆమె’ లేని చోటు లేదు. సకల రంగాల్లో ఆమె ప్రతిభకు సాటిలేదు. ఒకనాడు వంటింటికే పరిమితమైన అతివ.. అడ్డంకులను ఎదురొడ్డి నిలిచింది. పురుష ఆధిపత్యాన్ని అధిగమించి అంతరిక్షం దాకా ఎదిగింది. పురాతన కళల నుంచి అధునాతన సాంకేతిక రంగాల్లో సత్తాచాటి గెలిచింది. రాజకీయాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ శాసించే స్థాయికి సైతం చేరింది. దేశ సంరక్షణలో కూడా మహిళలు తమదైన ముద్ర వేసుకుంటున్నారు. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. దేశ సేవలో నిమగ్నమైన అక్కాచెల్లెళ్ల గురించి ప్రత్యేక కథనం.
దూప్సింగ్తండాకు చెందిన కడావత్ బలరాం- బూలిబాయిల కుమార్తె పద్మ. వీరిది రైతు కుటుంబం. పద్మ 2008లో సీఐఎస్ఎఫ్ విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ఢిల్లీ, బెంగుళూరు, గుజారాత్తోపాటు వివిధ రాష్ర్టాల్లో విధులు నిర్వర్తించిన పద్మ ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈమె భర్త సైతం ప్రస్తుతం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఇటు కుటుంబభారం మోస్తూనే విధులు నిర్వర్తించడం విశేషం.
దూప్సింగ్తండాకు చెందిన గంగారాం కుమార్తె సబావత్ విజయ. 2004లో సీఐఎస్ఎఫ్ విధుల్లో చేరిన ఆమె ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం బరోడాలో విధులు నిర్వహిస్తున్నారు. 2004లో విధుల్లో చేరిన తర్వాత మూడేండ్ల అనంతరం 2007లో భర్త మృతి చెందాడు. భర్త మృతి చెందినప్పటికీ దేశ సేవకోసం ముందుకు నడిచారు. ఇప్పటి వరకు ముంబాయి, చెన్నై, జైపూర్తోపాటు ఇతర రాష్ర్టాల్లో పనిచేశారు.
శ్రీరాం-మంగ్లీబాయి దంపతుల కుమార్తె కృష్ణవేణి. ఈమె 2007లో సీఐఎస్ఎఫ్లో చేరారు. ఇప్పటి వరకు ఢిల్లీ, బెంగుళూరు, చెన్నైలో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం కర్ణాటకలోని బళ్లారీలో పనిచేస్తున్నారు. కృష్ణవేణి భర్త సైతం ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్నారు.
కడావత్ గోపాల్-బిజన్బాయి దంపతుల కూతురు కడావత్ ప్రియాంక. క్రీడల్లో సత్తా చాటుతూ ఇటీవలే పోలీసు కొలువు సాధించింది. ప్రస్తుతం పోలీసు శిక్షణలో ఉంది. పేద కుటుంబానికి చెందిన ప్రియాంక చిన్నతనం నుంచి ఎంతగానో కష్టపడి క్రీడల్లో రాణించింది. క్రీడాకోటలో పోలీసు కొలువు సాధించింది. తన లక్ష్యమైన పోలీసు ఉద్యోగాన్ని సాధించడంపై హర్షం వ్యక్తంచేస్తున్నది. తెలంగాణ వాలీబాల్ కెప్టెన్గానూ ప్రియాంక సేవలందించింది.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్త్రత్రా ఫలాః క్రియాః
ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. అలా జరగని చోట ఏ పనిలోనూ విజయం సాధించలేం.
దేశ రక్షణ కోసం తామేమీ తక్కువ కాదంటూ పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారు. భారతజాతి సంరక్షణ కోసం అహర్నిశలు విధులు నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఒకే రైతు కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు సీఐఎస్ఎఫ్లో విధులు నిర్వహిస్తూ.. దేశ భద్రతలో భాగస్వాములయ్యారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని దూప్సింగ్ తండాకు కడావత్ పద్మ, కడావత్ కృష్ణవేణి, సబావత్ విజయ సీఐఎస్ఎఫ్ విభాగంలో ఒక్కొక్కరూ ఒక్కో రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వీరంతా అన్నదమ్ముల కుటుంబానికి చెందినవారు కావడం విశేషం. నిత్యం కట్టుకున్న భర్తతోపాటు కన్న పిల్లలను లాలిస్తూ ఇటు కుటుంబాన్ని అటు భరతమాత సేవలో భాగస్వాములవుతున్నారు.