అడవి బిడ్డల బతుకుల్లో కొత్త పొద్దు‘పోడు’పు పొడువనున్నది. దశాబ్దాలుగా దున్నుకుంటున్న భూములకు చట్టపరంగా హక్కు దక్కనున్నది. గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన, చారిత్రక ఘట్టానికి నేడు శ్రీకారం చుట్టనున్నది. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ‘పట్టా’భిషేకం చేయనున్నది. సమైక్య పాలనలో పోడు రైతుల గోస పోసుకున్న తీరు ఇంకా కళ్లముందే కదలాడుతున్నది. సాగు చేసిన పంటలను దున్నేసి, గిరి బిడ్డలను ఘోరంగా ఈడ్చుకెళ్లిన దృశ్యాలు మదిలో మెదులుతూనే ఉన్నాయి. కానీ స్వరాష్ట్రంలో అడవి బిడ్డల ఆక్రందన, ఆవేదనను కేసీఆర్ ప్రభుత్వం అర్థం చేసుకున్నది. అటవీ భూములను నమ్ముకుని బతుకుతున్న వారికి యాజమాన్య హక్కులు కల్పించనున్నది. తద్వారా ఉమ్మడి జిల్లాలో 9,249 మందికి పైగా లబ్ధి కలుగనున్నది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పోడు రైతులకు పట్టాలు అందించనున్నారు.
డిచ్పల్లి/కామారెడ్డి, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : ఏండ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనుల సమస్యకు ఇక తెరపడనున్నది. పోడు పట్టాల పంపిణీ పండుగ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. గిరిపుత్రుల కండ్లలో ఆనందం చూడాలనే ఆ సమయం రానే వచ్చింది. రైతును రాజు చేయాలనే తెలంగాణ సర్కారు లక్ష్యం.. పోడు పట్టాల పంపిణీతో నెరవేరనున్నది. రైతన్నకు పట్టాభిషేకం చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ పోడు పట్టాల పంపిణీలో ఉమ్మడి జిల్లాలో సుమారు 13 వేల మందికి పైగా హక్కు పత్రాలను అందుకోనున్నారు. సీఎం కేసీఆర్ చేపట్టే ఈ గొప్ప కార్యంతో పోడు రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.
గిరిపుత్రుల కల సాకారం అవుతున్న వేళ..
అడవి తల్లిని నమ్ముకుని బతుకుతున్న గిరిపుత్రుల నమ్మకం నేటి నుంచి నిజం కానున్నది. అది ఒక్క సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందన్న ఆకాంక్ష గిరిపుత్రుల్లో వెల్లివిరుస్తున్నది. పోడు భూములకు హక్కుపత్రాలు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని దశాబ్ది వేడుకల్లోనే అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ సాంకేతిక కారణాలతో అది వాయిదా పడింది. జూన్ 30న రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములకు చెందిన పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని లాంఛనంగా నేడు ప్రారంభించనున్నారు. మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అర్హులైన వారికి పట్టాలను అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు పోడు పట్టాల హక్కు పత్రాలను అందించనున్నారు. పోడు పట్టాలు పంపిణీ చేసిన తర్వాత రక్షిత, రిజర్డ్ అటవీ భూముల్లో మానవ ప్రమేయాన్ని పూర్తిగా నిషేధించి పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సర్కారు పని చేయనున్నది.
నిజామాబాద్లో 8వేల ఎకరాలు..
అటవీ భూములను ఆక్రమించిన వారు గిరిజనులే అయితే 2006కు ముందు నుంచి సాగులో ఉండాలి. అలాంటి వారి ఆర్థిక స్థితిగతుల వివరాలను ప్రభుత్వం పరిశీలన చేసింది. 10 ఎకరాల్లోపు కబ్జాలో ఉండి ఆ భూమే జీవనాధారంగా ఉంటే ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పొందేందుకు అర్హులు. ఇందుకోసం గతేడాది అర్హులైన వారి క్లెయిమ్స్ స్వీకరించారు. సాగు చేసుకుంటున్న వారు ఆధారాలతో ఎఫ్డీవో స్థాయి అధికారులు దరఖాస్తులు అందించారు. గ్రామ, డివిజనల్ కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి సిఫారసు చేయగా జిల్లా కమిటీ అర్హులను ఎంపిక చేసింది. గిరిజనేతరులైతే ఆ కుటుంబం నుంచి మూడు తరాల వారు ఆ భూమిలో సాగు చేసుకుంటున్నట్లు ఆధారాలుండాలి. నిజామాబాద్ జిల్లాలో అటవీ భూముల్లో సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారు 19 మండలాల్లో ఉన్నారు. జిల్లాలో మొత్తం అటవీ భూమి 2,14,700 ఎకరాలున్నది. పోడు పట్టాల కోసం 14 వేల 50 దరఖాస్తులు రాగా 4,229 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందులో సుమారు 8611.14ఎకరాలకు పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం తీసుకున్నది.
కామారెడ్డి జిల్లాలో
కామారెడ్డి జిల్లాలో మొత్తం 8,00,588 సర్వే నంబర్లలో 8,45,621 ఎకరాల భూవిస్తీర్ణం ఉన్నది. భూ ప్రక్షాళనలో ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్బోర్డు, దేవాదాయ శాఖ, అటవీ శాఖ భూములను వేరు చేశారు. ఇందులో దేవాదాయ శాఖకు 1,823 ఎకరాలు, వక్ఫ్బోర్డుకు చెందిన 1090 ఎకరాలు, అటవీ శాఖకు చెందిన 2,04,727 ఎకరాలు, అసైన్మెంట్ భూములు 1,36,101 ఎకరాలు, 5,36,000 వ్యవసాయ భూమి ఉంది. జిల్లాలో 27,554ఎకరాల అటవీ భూమి వివాదాల్లో ఉండ గా, అందులో 750 ఎకరాల్లో సివిల్ కేసులు, 377 ఎకరాల్లో రెవెన్యూ కేసులు, 15వేల ఎకరాల్లో అటవీ శాఖ కేసులు ఉన్నట్లు స్పష్టమైంది. రైతులు భూములను సాగు చేస్తే వారికే పట్టాలివ్వాలనే ప్రభుత్వ నిబంధన ప్రకారం దశాబ్దాలుగా రైతన్నలు అటవీ భూముల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. మరోవైపు అటవీ భూముల్లో పంటలను సాగు చేయరాదని, చేస్తే కేసు నమోదు చేస్తామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించేవారు. ఇలా రైతులకు, అటవీ శాఖ అధికారులకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం సాగేది. బాన్సువాడ నియోజకవర్గంలో గతంలోనే అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి 2020లో అప్పటి ఆర్డీవో రాజేశ్వర్రావు ద్వారా అటవీ భూములకు సంబంధించిన సమస్యను పరిష్కరించి సుమారు 750 మందికి పట్టాలను అందజేశారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో మొత్తం 5,020 రైతులను గుర్తించారు. వారికి 11వేల ఎకరాలకు సంబంధించిన పట్టాలను అందజేయనున్నారు.
దశాబ్దాల సమస్యకు చెక్
పోడు భూముల సమస్య దశాబ్దాల నుంచి సాగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత హక్కులను ప్రసాదిస్తామని కేసీఆర్ స్పష్టమైన హామీనిచ్చారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములపై రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్త సర్వే నిర్వహించాయి. పారదర్శకంగా చేపట్టిన ఈ సర్వేలో ఎవరు కబ్జాదారులు, ఎవరు అసలైన పోడు వ్యవసాయదారులో తేల్చారు. అటవీ ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరిస్తూనే పేద ప్రజలకు మేలు చేసేందుకు రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. పోడు సమస్యను గతంలోని కాంగ్రెస్ పార్టీ కనీసం పట్టించుకోలేదు. రాజకీయ ఆక్రమణదారులతో చేతులు కలిపి ఏకంగా అడవులను భక్షించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ మాత్రం అడవులను కాపాడుతున్నారు. కబ్జాలను నిరోధిస్తున్నారు. గిరిజనులకు అనేక రకాలుగా మేలు చేస్తున్న సీఎం కేసీఆర్, పోడు భూములకు పట్టాలు ఇవ్వడం ద్వారా వేలాది కుటుంబాల్లో మరోసారి వెలుగులు ప్రసాదిస్తున్నారు.
సీఎం సార్ చెప్పింది చేసి చూపిస్తుండు..
గింతకు ముందు మస్తు ప్రభుత్వాలు అచ్చినయ్, పోయినయ్. ఆళ్లు మస్తు మాటలు చెప్పిండ్రు. కానీ గవన్నీ గాలికి పోయినయ్. గిప్పుడు గీ సీఎం కేసీఆర్ సార్ చెప్పింది చేసి చూపిస్తున్నడు. పట్టాల కోసం ఏండ్ల సంది ఎదురు చూస్తున్నం. గిప్పుడు సీఎం కేసీఆర్తోటే మాకు పట్టాలు అస్తున్నయ్. గిసుంటి సీఎం మల్లా దొరకడు. మళ్లమళ్ల ఆయనే సీఎం కావాలి. మాకు మస్తు మంచిగ జేస్తున్నడు. కేసీఆర్ సార్ను ఎప్పటికీ యాద్ మర్వ..
-అనూబాయి, ఇందల్వాయితండా
అర్హులైన వారికి పట్టాలు
కామారెడ్డి జిల్లాలోని గిరిజన తండాల్లో పంటలను సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులను గుర్తించాం. జిల్లాలో మొత్తం 5,020 మంది అర్హులైన గిరిజనులు ఉన్నారు. వారికి పట్టాలను అందజేస్తున్నాం. పారదర్శకంగా ఎంపిక జరిగింది. సుమారు 11వేల ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను అందజేస్తున్నాం.
-శ్రీనివాస్రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, కామారెడ్డి
సంతోషంగా ఉంది…
చాలా ఏండ్లుగా పోడు భూములను నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్నాం. మాలాంటి పోడు రైతులకు (గిరిజనులకు) పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉన్నది. పట్టాలతోపాటు రైతుబంధు డబ్బులు ఇవ్వనున్న సీఎం కేసీఆర్ను జీవితాంతం గుర్తుంచుకుంటాం.
-మెగావత్ రవీందర్, లొంక తండా, గాంధారి
కేసీఆర్ సార్ సల్లంగుండాలె..
సీఎం సార్ మాటిచ్చిండు. గిప్పుడు పట్టాలు ఇస్తుండు. గీ భూములను నమ్ముకొనే బతుకుతున్నం. గిప్పుడు పట్టాలిచ్చుడుతోటి మాకు రంది లేకుండా జేశిండు. కేసీఆర్ సారును జీవితాంతం మరిశిపోం. పట్టాలు ఇచ్చుడుతోటి మా భూమే అన్న భరోసా అచ్చింది.
-మెగావత్ రుక్కిబాయి, మొండిసడక్ తండా, గాంధారి
ఇగ పెట్టుబడి పైసల్ అస్తయ్
పోడు భూములను సాగు చేసుకుంటున్న నా లాంటి చాలా మంది గిరిజన రైతులకు పోడు పట్టాలు ఇస్తుండ్రు. ఇగ పంటలు సాగు చేసుకునేతందుకు రైతు బంధు పైసల్ గుడా అస్తయ్. మస్తు సంతోషం అనిపిస్తుంది. ఏండ్ల సంది పట్టాల కోసం పడుతున్న రందిని దూరం చేసిన సీఎం కేసీఆర్కి రుణపడి ఉంటాం.
-కొల్లా లక్ష్మి, మొండిసడక్ తండా, గాంధారి
సీఎం సార్కు రుణపడి ఉంటాం..
ఏండ్లుగా గీ భూమినే నమ్ముకుని ఉన్నాం. దానిలో పంటలేసుకునే బతుకుతున్నాం. ఎప్పుడు ఎవరు వచ్చి మాకు పట్టాలిస్తారోనని ఎదురుచూస్తున్నాం. గిప్పుడు కేసీఆర్ సార్తోనే మాకు న్యాయం జరుగుతున్నది. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.
-చందర్నాయక్, ఇందల్వాయి తండా సర్పంచ్
కేసీఆర్ రైతు బాంధవుడు..
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ సార్ సీఎం కావడం మనందరి అదృష్టం. ఆయన చెప్పిన మాటలన్నీ నిజం చేశిండు. రైతును రాజు చేస్త అన్నడు. అన్నంత పని చేసి చూపించిండు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు. ఆయన ఎప్పుడూ సల్లంగా ఉండాలి. మరోసారి కూడా ఆయనే సీఎం కావాలని మా కోరిక.
-భాస్కర్, తండావాసి, ఇందల్వాయి