బాన్సువాడ రూరల్, జూన్ 2: దేశానికి అన్నంపెట్టే రైతన్న సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నది. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి..అన్నదాతకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నది. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా వినూత్న పథకాలు రూపొందించి పక్కాగా అమలుచేస్తున్నది. సీ మాంధ్ర పాలనలో వ్యవసాయం దండగ అనే పరిస్థితుల నుంచి స్వరాష్ట్రం సాధించాక కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో వ్యవసాయం నేడు పండుగలా మారిం ది. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం సాధించి తొమ్మిదేండ్లు పూర్తిచేసుకొని పదో వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం 21 రోజులపాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెల 3న (శనివారం) రైతు దినోత్సవంగా నామకరణం చేసి రైతులతో వివిధ రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ రంగం లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, రైతులకు మేలు చేసిన పథకాలపై అవగాహన కల్పించనున్నారు. రైతులతో కలిసి ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సామూహిక భోజనాలు చేయనున్నారు.
అప్పులిచ్చే స్థాయికి రైతులు ఎదగాలన్నదే సర్కారు లక్ష్యం
సీమాంధ్ర పాలనలో వ్యవసాయ రంగాన్ని పట్టించుకునే నాథుడు లేక తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులకు గురుయ్యారు. పంటలు వేయాలంటే చేతిలో డబ్బులు లేక అప్పు కోసం చెప్పులు అరిగేలా తిరిగేవారు. తీసుకొచ్చిన అప్పుతో పంటలను సాగు చేయగా కనీస మద్దతు ధర లేక, ప్రభుత్వ కాంటాలు లేక దళారులకు అమ్మేవారు. స్వరాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమంపై దృష్టి సారించింది. స్వయంగా రైతు అయిన సీఎం కేసీఆర్ అన్నదాతను రాజుగా చేయడమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. పంట సాగు చేసే రైతులకు పంట పెట్టుబడి కింద సాయం అందించాలనే గొప్ప సంకల్పంతో రైతుబంధు అనే చారిత్రాత్మక పథకాన్ని ప్రారంభించారు. పంట పెట్టుబడికి అప్పు కోసం తిరిగిన రైతులు ఈ పథకం అమలుతో నేడు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగారు.
పెరిగిన సాగు విస్తీర్ణం
రైతు సంక్షేమ పథకాల అమలుతో నేడు జిల్లాలో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. రైతులు పండించే ప్రతి గుంటకూ సాగు నీరు అందించాలనే సంకల్పంతో నిజాంసాగర్ ప్రధాన కాలువను రూ. 550 కోట్లతో ఆధునీకరించారు. ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటరీలను సైతం ఆధునీకరించడంతో నేడు చివరి ఆయకట్టు రైతులకు పుష్కలంగా సాగు నీరు అందుతున్నది.. నాడు బీడుగా ఉన్న భూములు నేడు సాగులోకి వచ్చాయి.
నేడు జిల్లా వ్యాప్తంగా రైతు దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు వేదికల్లో క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు రైతు వేదికలను ముస్తాబు చేశారు. మామిడి తోరణాలు, పువ్వులు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. వ్యవసాయరంగంలో ప్రభుత్వ సాధించిన సంపూర్ణ ప్రగతిని రైతులకు అధికారులు వివరించనున్నారు. రైతుబంధు, రైతుబీమా ద్వారా లబ్ధిపొందిన రైతులతో చర్చించనున్నారు. వ్యవసాయశాఖ ద్వారా గ్రామం లో సాధించిన ప్రగతిని రైతులకు వివరించి, సహపంక్తి భో జనాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు చేయనున్నారు.
సీఎం సారు సల్లంగా ఉండాలి
మా లాంటి రైతుల కోసం సీఎం కేసీఆర్ సారు పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ. 5వేల చొప్పున రెండు పంటలకు ఇస్తున్నాడు. అప్పులు తీసుకోకుండా పంటలను పండిస్తున్న. సీఎం సారు సల్లంగా ఉండాలి. సీఎం సారు పుణ్యంతో మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. పంట పండించి సర్కారుకే అమ్ముతున్నాం. పైసలు వారం రోజుల్లోనే మా ఖాతాల్లో జమచేశారు.
-దరావత్ లక్ష్మణ్ రైతు, జక్కల్దానితండా
కరెంట్ తో పుష్కలంగా నీరు
గతంలో సరిగ్గా కరెంట్ ఉండకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయేవి.కేసీఆర్ సర్కారు ఇస్తున్న 24 గంటల నాణ్యమైన కరెంట్తో మా పంటలకు పుష్కలంగా నీరు అందుతుంది. యాసంగి, వానకాలం పంటలు పండించుకొని ఉపాధి పొందుతున్న. మా కుటుంబమంతా వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే ఉంటున్నాం.
– బాలయ్య, రైతు, బోర్లం
పట్నం నుంచి వచ్చి ఊర్లోనే ఉంటున్నాం
గతంలో పంటలకు సాగు నీరందక ఎండిపోయి అప్పు ల పాలయ్యేవాళ్లం. దీంతో పట్నం పోయి పని చేసుకునేటోళ్లం. సీఎం కేసీఆర్ రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుండడంతో తిరిగి సొంతూరుకు వచ్చి పంటలను సాగు చేస్తున్నం.
– కుంటోల్ల బస్వయ్య, రైతు, బోర్లం క్యాంపు తండా