నిజామాబాద్ లీగల్ : ప్రతి వ్యక్తి ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్ఎఫ్ బాయ్స్ పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
విద్యనభ్యసించే దశలో విద్యపైనే నిరంతర ధ్యాస ఉంచాలని, చెడు వ్యాపకాలపై దృష్టికోణం ఉండరాదని సూచించారు. చదువు ఒక మంచి భవిష్యత్తును నిర్మింపజేస్తుందని అన్నారు. అనాలోచిత చర్యలు అధ:పాతాళానికి గురి చేస్తాయన్నారు.
సంస్థ సభ్యుడు, సీనియర్ న్యాయవాది రాజ్కుమార్ సుబేదార్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి చట్టాలు ఉన్నాయని, బాలల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తాయని అదే క్రమంలో చట్ట వ్యతిరేక పనులకు పాల్పడిన వారిని శిక్షించడానికి చట్టం అనుమతినిస్తుందని తెలిపారు. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి చదువును మించిన సంపద లేదని ఆయన అన్నారు . సదస్సులో ఉపాధ్యాయులు అనుపమ సుబేదార్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.