ధర్పల్లి, జనవరి 25 : అవి స్వాతంత్య్రం కోసం ఉధృతంగా పోరాటాలు జరుగుతున్న రోజులు. భరతమాత దాస్యశృంఖలాలు తెగిపోయే రోజులు ఎంతో దూరంలో లేవని, భయం వీడి ఉద్యమంలో పాల్గొనాలంటూ స్వాతంత్య్ర సమరయోధులు పిలుపునిస్తున్నారు. అదే సమయంలో ఏర్పడిందీ పాఠశాల. విద్యాబుద్ధులతోపాటు స్వాతంత్య్ర సమర పాఠాలు బోధిస్తూ విద్యార్థుల్లో ధైర్య సాహసాలను నింపారు ఇక్కడి గురువులు. పాఠ్యంశాలే కాకుండా స్వాతంత్య్ర సమర పాఠాలు బోధించిన ఆ పాఠశాల… నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల.
1942లో ఏర్పాటైందీ దుబ్బాక పాఠశాల. 1947లో స్వాతంత్య్రోద్యమం తీవ్రరూపం దాల్చిన సమయంలో విద్యార్థులకు పాఠ్యాంశాలతోపాటు ఉద్యమ పాఠాలు బోధించిన బడి ఇది. 1942లో ప్రాథమిక స్థాయి విద్యాలయంగా ప్రారంభమై స్వాతంత్య్రానంతరం క్రమంగా అభివృద్ధి చెందింది. 1975లో ప్రాథమికోన్నత పాఠశాలగా, 1989లో ఉన్నత పాఠశాల స్థాయి చేరుకున్నది. అప్పట్లో 8వ తరగతి వరకు మాత్రమే బోధన కొనసాగేది. 1991-92 విద్యా సంవత్సరంలో ఈ స్కూల్ నుంచి మొట్టమొదటి ఎస్సెస్సీ బ్యాచ్ బయటికి వచ్చింది. ప్రస్తుతం మొత్తం 270 మంది విద్యార్థులు కాగా, అందులో 153 మంది బాలురు, 117 మంది బాలికలు ఉన్నారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో పాఠాలు చెబుతున్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి వీడీసీ, గ్రామానికి చెందిన దుబాయ్ కమిటీ, ఫ్రెండ్స్ యూత్ క్లబ్ తమవంతు సహకారం అందిస్తున్నాయి. పాఠశాలను పచ్చదనంతో నింపుతున్నదీ ఉపాధ్యాయ బృందం.
దుబ్బాక పాఠశాల 71 ఏండ్ల చరిత్రలో ఎందరో విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిపింది. అప్పట్లో కనీస సౌకర్యాలు లేకున్నా అడ్డంకులను ఎదుర్కొంటూ వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన బడి.. పాఠశాలలో చదివిన విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ప్రసాదించింది. ఇక్కడ అక్షరాలు దిద్దినవారు వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లుగా మరెన్నో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పాఠశాలలో చదివిన వారు ఆయా వృత్తుల్లో సేవలందిస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రగతి హాస్పిటల్ వ్యవస్థాపకుడు డాక్టర్ లక్ష్మారెడ్డి చదివింది ఇక్కడే. తనకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల రుణం తీర్చుకోవాలనే లక్ష్మారెడ్డి ఇప్పటికీ తరచూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు ఉచిత వైద్యసేవలందిస్తున్నారు. ప్రగతి దవాఖానకు వెళ్లిన తమతో అక్కడి వైద్యసిబ్బంది మర్యాదగా చూసుకుంటారని, ఎంతో ఓపికగా సలహాలు సూచనలు ఇస్తారని గ్రామస్తులు చెబుతున్నారు.
దుబ్బాక పాఠశాల పచ్చదనంతో జిల్లాకే ఆదర్శంగా నిలిచింది. పరిశుభ్రత నిర్వహణలో జిల్లా ఉత్తమ గ్రీనరీ పాఠశాలగా ఇదివరకే గుర్తింపు పొందినట్లు పాఠశాల ఉపాధ్యాయులు చెప్పారు. పాఠశాల ముఖద్వారంలో ఏపుగా పెరిగిన చెట్లు పచ్చగా నవ్వుతూ అందరికీ ఆహ్వానం పలుకుతున్న అనుభూతిని కలిగిస్తాయి. పాఠశాల ఆవరణ అంతా పచ్చదనంతో నిండుగా కనిపిస్తుంది. గ్రామంలోని ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో చదువుల తల్లి సరస్వతీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కొన్నేండ్లుగా ఎస్సెస్సీలో 90 శాతం ఫలితాలు వస్తుండడం విశేషం.
ఎందరినో ఉన్నతంగా తీర్చిదిద్దిన దుబ్బాక పాఠశాలలో చదివినందుకు పూర్వ విద్యార్థిగా ఎంతో గర్వంగా ఉంది. గ్రామస్తులందరి సహకారంతో పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలందిస్తున్నాము. ఉన్నతమైన విద్యావిధానాలను అందిస్తూ పాఠశాల మంచి గుర్తింపును సొంతం చేసుకోవడం గ్రామానికే గర్వకారణం.
– ఎన్.రమేశ్, పూర్వ విద్యార్థి, దుబ్బాక
స్వాతంత్య్రం రాక ముందు 1942 సంవత్సరంలో ఈ పాఠశాల ఏర్పడడం ఎంతో సంతోషదాయకం. ఇక్కడ చదివిన వాళ్లు ఎంతో గొప్పవాళ్లయ్యారు. లక్ష్మారెడ్డి డాక్టర్ సైతం ఈ పాఠశాలలోనే చదివి జిల్లాస్థాయిలో పేరు గడించారు. ఇప్పటికీ తమ గ్రామానికి అన్ని రకాలుగా సహకారమందిస్తున్నారు. ఈ పాఠశాలలో చదివిన వారు ఎందరో ఇంజినీర్లు అయ్యారు.
– శేఖర్రెడ్డి, పూర్వవిద్యార్థి, దుబ్బాక
చారిత్రాత్మక నేపథ్యమున్న దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తి అదనపు ఇన్చార్జి హెచ్ఎంగా పని చేస్తున్నందుకు గర్వంగా ఉన్నది. గ్రామస్తుల సహకారంతో మెరుగైన విద్యాబుద్ధులు అందించేందుకు కృషి చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనకు లోటు లేకుండా గ్రామస్తులు సైతం పూర్తి సహకారమందిస్తున్నారు. పాఠశాలలోని విద్యార్థులు చదువుతోపాటు క్రీడా, అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించేలా తగిన శిక్షణ ఇస్తున్నాం.
– గంగాసావిత్రి, హెచ్ఎం, దుబ్బాక