పోతంగల్ ఏప్రిల్ 29: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. దుండగులు పలు వస్తువులతో పాటు బైక్ను ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్టి రాములు రాత్రి తన డాబాపై నిద్రించారు. తెల్లవారి లేచి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో అవాక్కయ్యారు.
ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువా తెరిచి ఉండటాన్ని గమనించారు. సుమారు ఐదు తులాల బంగారం, రెండు తులాల వెండితో పాటు ఇంటి ముందు నిలిపిన ద్విచక్ర వాహనం కనిపించలేదు. వెంటనే కోటగిరి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.