నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు చకచకా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటాకు సంబంధించిన నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. కేంద్రానికి సంబంధించిన పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. నిజామాబాద్-హైదరాబాద్ మార్గంలో మాధవనగర్ రైల్వే గేటు వద్ద బ్రిడ్జి లేక నిత్యం గంటల కొద్దీ రాకపోకలు నిలిచి పోయేవి. దశాబ్దాలుగా నెలకొన్న ఈ సమస్య పరిష్కారం కోసం మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రంగా కృషి చేశారు. కేంద్రంతో పోరాడి మరీ ఆర్వోబీ నిర్మాణానికి లైన్ క్లియర్ చేయించారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. కానీ మోదీ సర్కారు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో వంతెన నిర్మాణానికి ముందుకొచ్చింది. చివరకు తలొగ్గిన రైల్వే శాఖ ఆర్వోబీ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. రూ.93.12 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ రైల్వేఓవర్ బ్రిడ్జికి రైల్వే శాఖ కేవలం రూ.30 కోట్లు కేటాయిస్తే, కేసీఆర్ సర్కారు రూ.63.07 కోట్లు వెచ్చిస్తున్నది. ఇప్పటికే ఆ నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తన వంతు పనులను త్వరత్వరగా పూర్తి చేయిస్తున్నది. భారీ పిల్లర్ల నిర్మాణంతో పాటు రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేసింది.
నిజామాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులకు ఇచ్చిన పసుపు బోర్డు హామీని నెరవేర్చని ఎంపీ అర్వింద్ తీరు మరోసారి ప్రస్ఫుటమైంది. మాధనగర్ ఆర్వోబీ విషయంలో కనీసం ఉలుకుపలుకు లేకుండా వ్యవహరిస్తున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడడం తప్ప అభివృద్ధి పనుల్లో మాత్రం చొరవ శూన్యంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్మిస్తున్న మాధవనగర్ ఆర్వోబీలో కేంద్రం వాటాగా చేయాల్సిన పనుల్లో వేగం పుంజుకోవడం లేదు. రైల్వే ట్రాక్కు అటు, ఇటు భారీ పిల్లర్ల నిర్మాణంతో పాటు రోడ్డు వెడల్పునకు చేపట్టాల్సిన పనులు చకచకా జరుగుతున్నాయి. 2023-24 బడ్జెట్లో నిజామాబాద్ జిల్లాకు నయా పైసా తీసుకు రాని ఎంపీ అర్వింద్.. గతంలోనే మంజూరైన కేంద్రం వాటా పనుల్లోనూ ఉత్సాహం చూపకపోవడంపై నగరవాసుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆర్వోబీ అందుబాటులోకి వస్తే లక్షలాది మంది వాహనాదారులకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం ట్రాఫిక్ను డైవర్షన్ చేయించి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం చూస్తోంది.
నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు వెళ్లే దారిలో కీలకమైన మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితమే నిధులు మంజూరు చేసింది. రూ.63.07 కోట్లు విడుదల చేస్తూ జీవో విడుదల చేయడంతో పాటు పనులను శరవేగంగా చేపడుతున్నది. ఈ ప్రాంతంలో రైల్వే గేటుకు బదులుగా పైవంతెన నిర్మించాలని ఏడేండ్లుగా తెలంగాణ సర్కారు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా పని చేసిన కల్వకుంట్ల కవిత సైతం ఆర్వోబీ కోసం తీవ్రంగా శ్రమించారు. మొదట్లో రెండు వరుసల వంతెనకు మాత్రమే రైల్వే శాఖ అనుమతివ్వగా పెరుగుతోన్న రద్దీని దృష్టిలో పెట్టుకుని నాలుగు వరుసలో వంతెన నిర్మాణానికి సర్కారు ప్రయత్నాలు చేసింది.
అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాత్సారం జరిగింది. రాష్ట్ర సర్కారు ముందుకొచ్చి వంతెన నిర్మాణానికి నిధులు భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయగా రైల్వే శాఖ అంగీకారం చెప్పింది. నిజానికైతే ఆర్వోబీకి రైల్వే శాఖనే పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించాల్సి ఉన్నప్పటికీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. మొత్తం రూ.93.12 కోట్లు వ్యయం అవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.63.07 కోట్లు భరించనుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేవలం రూ.30.05 కోట్లు మాత్రమే వెచ్చించబోతున్నది.
మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు ప్రత్యేక చొరవ చూపారు. ఎంపీగా ఉన్న సమయంలో కవిత చూపిన శ్రద్ధతోనే ఆర్వోబీకి రూపం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి సైతం ఉమ్మడి జిల్లా అభివృద్ధికి విశేషంగా పాటుపడుతూ మాధవనగర్ ఆర్వోబీ విషయంలో కేసీఆర్తో ఒప్పించి నిధులను మంజూరు చేయించారు. మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆర్ అండ్ బీ శాఖ ద్వారా దక్షిణ మధ్య రైల్వేపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెచ్చారు. నాలుగు లైన్ల ఆర్వోబీ నిర్మాణం మూలంగా నిజామాబాద్ నగర ప్రజలకు భవిష్యత్తులో 30 ఏండ్ల పాటు ఎలాంటి ఇక్కట్లు ఎదురు కాబోవు. రెండు లైన్ల బ్రిడ్జితో పెరిగిన ట్రాఫిక్కు సరిపోవడం కష్టతరంగా మారనుంది. టీవీయూ 3లక్షలు దాటినందున ప్రస్తుతం మాధవనగర్ వద్ద నాలుగు లైన్ల ఆర్వోబీకి లైన్ క్లియర్ చేసుకుని పనులను చకచకా మొదలు పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సైతం పలు దఫాలుగా బ్రిడ్జి నిర్మాణం ఆవశ్యకతపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
రోడ్లు, భవనాల శాఖ నుంచే ఆర్వోబీ పనులను చేపడుతున్నాం. కొద్ది రోజులుగా జెట్ స్పీడ్తో బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నది. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిత్యం ఈ విషయంపై ఫాలో అప్ చేస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఆదేశాల మేరకు పనులు అత్యంత నాణ్యతతో, పటిష్టవంతంగా నిర్మిస్తున్నాం. నగరవాసుల చిరకాల కల త్వరలోనే పూర్తి చేసే దిశగా ప్రయత్నిస్తున్నాం.
– రాజేశ్వర్ రెడ్డి, ఆర్ అండ్ బీ, ఎస్ఈ