బీర్కూర్, జూలై 26 : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. వృద్ధ దంపతులను దుండగులు అతి దారుణంగా హత్యచేశారు. బాన్సువాడ డీఎస్పీ జగన్నాథరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నారాయణ (70) కిరాణాషాపు నిర్వహించేవాడు. అతనితోపాటు భార్య సులోచన(65) నివసించేది. వీరికి సంతానం లేరు. మంగళవారం అర్దరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించి నారాయణను కొట్టి చంపారు. భార్య సులోచనను సైతం హాల్లోకి తీసుకెళ్లి చీరతో ఉరేసి హతమార్చారు. బుధవారం ఉదయం నారాయణ మేనల్లుడు కృష్ణమూర్తి వచ్చి ఎంతపిలిచినా ఇంట్లోనుంచి స్పందన రాలేదు. దీంతో ఇంటి వెనుకవైపు నుంచి లోపలికి వెళ్లి చూడగా వేర్వేరు గదుల్లో నిర్జీవంగా పడిఉన్న దంపతులు కనిపించారు.
వెంటనే స్థానికులు, పోలీసులకు సమాచారం అందజేశాడు. సీఐ మురళి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్టీం ద్వారా ఆధారాలను సేకరించారు. డాగ్ స్కాడ్తో హంతకుల జాడ కోసం గాలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ హత్యలు డబ్బుల కోసం దొంగలు చేసిన పనా? లేదంటే వేరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి గ్రామానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అందరితో చనువుగా ఉండే దంపతుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నారాయణ, సులోచన దంపతుల హత్య గురించి తెలిసిన వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం రైతునగర్ గ్రామానికి వెళ్లారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. దంపతులకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 40 ఏండ్లుగా వారితో తనకు అనుబంధం ఉన్నదని, అందరితో కలుపుగోలుగా ఉండే దంపతులు దారుణహత్యకు గురికావడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను త్వరగా పట్టుకొని కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులకు సూచించారు. అనంతరం దంపతుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సర్పంచ్ నాగేశ్వర్రావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఎర్వాల కృష్ణారెడ్డి, గోపాల్రెడ్డి, పిట్ల శ్రీధర్ తదితరులు ఉన్నారు.