ఖలీల్వాడి/కామారెడ్డి, ఏప్రిల్ 28: పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. బాలుర కంటే బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు, టెన్త్ ఫలితాల్లో ఉభయ జిల్లాలు ఈసారి కూడా నిరాశ పరిచాయి. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఎక్కువగానే ఉన్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మరోసారి మెరుగైన పనితీరు ప్రదర్శించలేక పోయాయి. 97.47 శాతం ఉత్తీర్ణతతో కామారెడ్డి జిల్లా 18వ స్థానంలో నిలువగా, 94.24 శాతం ఉత్తీర్ణతతో నిజామాబాద్ జిల్లా 27వ ప్లేస్కి పడిపోయింది. రీ కౌంటింగ్తో పాటు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. రీకౌంటింగ్ కోసం మే 14లోపు, సప్లిమెంటరీ పరీక్షలకు మే 14 నుంచి 16 లోపు ఫీజు చెల్లించాలని అధికారులు ప్రకటించారు. జూన్ 5 నుంచి 12 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
టెన్త్ ఫలితాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు రాష్ట్రం లో నంబర్వన్ స్థానంలో ఉండేది. అలాంటిది ఇప్పుడు అట్టడుగు స్థానానికి పడిపోయింది. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా ఉభయ జిల్లాల్లో విద్యావ్యవస్థ గాడి తప్పిందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు, విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత రెండేండ్లుగా ఉభయ జిల్లాల స్థానాలు కిందకు దిగజారడమే ఉదాహరణ. కేసీఆర్ పాలనలో పాఠశాల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించే వారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ, ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ వంటివి ఏర్పాటు చేసి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేసే వారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. తాజా ఫలితాలతోనైనా అధికారులు స్పందించి విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలని కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లా 97.47 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 32వ స్థానానికి పడిపోయిన జిల్లా.. టెన్త్ ఫలితాల్లో కాసింత పరువు నిలబెట్టుకున్నది. గతేడాది కంటే ఈసారి రెండు స్థానాలు మెరుగు పచుకుంది. జిల్లాలో మొత్తం 13,119 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 12,787 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 98.16 శాతం, బాలురు 96.75 శాతం పాసయ్యారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. కేజీబీవీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్, మాడల్ స్కూళ్లతో పాటు జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలు సాధించాయి.
టెన్త్ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా మరోసారి వెనుకబడింది. రాష్ట్రంలో 94.24 శాతం ఉత్తీర్ణతతో 27వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 24,365 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 22961 మంది పాసయ్యారు. బాలికలు 95.48 శాతం, బాలురు 93.01 శాతం ఉత్తీర్ణత సాధించారు.