మిగ్జాం తుఫాన్ ప్రభావమేమో కానీ ఉమ్మడి జిల్లా గజగజ వణికిపోతున్నది. ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతుండడంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బంది పడుతున్నది. చలికాలం ఇలా ప్రారంభమైందో లేదో శీతల గాలులు దడ పుట్టిస్తున్నాయి. డిసెంబర్ నెలలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలను శుక్రవారం మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం తొమ్మిది దాటినా పొగమంచు వీడకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
నిజామాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మిగ్జాం తుఫాన్ ధాటికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శీతాకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నప్పటికీ.. ఇప్పుడుప్పుడే చలి ప్రభావం కనిపిస్తున్నది. మొన్నటి వరకు ఎండకాలమా? చలికాలామా? తెలియనట్లుగా పరిస్థితులుండగా, ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఎండ తీవ్రత తగ్గిపోయింది. చల్ల గాలులతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజులుగా పడిపోతున్న ఉష్ణోగ్రతలకు తోడుగా మిగ్జాం తుఫాన్ ధాటికి చలి తీవ్రత మరింత పెరిగింది. మూడు రోజులుగా మబ్బులు కమ్ముకున్న ఆకాశంతోనే జనజీవనం కొనసాగుతున్నది. ప్రజలు ఒకింత చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. వాతావరణ మార్పులతో వృద్ధులు, చిన్న పిల్లలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. శీతల గాలుల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే ధాన్యం సేకరణ ప్రక్రియ ముగింపునకు చేరడంతో రైతుల్లోనూ ఆందోళన తగ్గింది. అక్కడక్కడా వడ్లను రోడ్లపై ఆరబెట్టిన అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఫలితంగా చలి విజృంభించి అందరినీ అల్లాడిస్తున్నది. తెల్లవారు జాము నుంచే చలి గాలులతోపాటు ఆకాశం నేలను తాకినట్లుగా పొగమంచు కమ్ముకుంటున్నది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం పూట బయటికి వెళ్లేందుకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం ఉదయం 9గంటల వరకు తీవ్రమైన పొగ మంచుతో రోడ్లన్నీ కమ్ముకుపోవడంతో వాహనదారులు లైట్ల సహాయంతో ప్రయాణించాల్సి వచ్చింది. జనం స్వెట్టర్లు, ఇతర ఉపకరణాలను ధరించి బయట అడుగుపెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఓ వైపు ఎండ, మరోవైపు చలితో ఇబ్బందికరమైన పరిస్థితిని ఉమ్మడి జిల్లా వాసులు ఆస్వాదిస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీన గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదైంది. తాజాగా శుక్రవారం గరిష్ఠంగా 23.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు పడిపోయింది. మిగ్జాం తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసిన సమయంలో ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు చోటుచేసుకున్నది.
తెల్లవారుజాము నుంచే పల్లెలు, నగరాలు మంచు దుప్పటిలో కప్పుకుపోతున్నాయి. రోడ్డుపైకి వస్తే.. తీవ్ర మంచు ప్రభావంతో కనీసం ఎదురుగా ఉన్నవారు కనిపించడంలేదు. ఉదయంపూట ప్రయాణం కత్తి మీది సాములా మారింది. పడిపోయిన ఉష్ణోగ్రతల కారణంగా చలి గాలుల తీవ్రత పెరుగుతున్నది. ఉదయం 10 గంటల వరకూ చలి గజగజ వణికిస్తున్నది. మోటర్ సైకిళ్లపై ప్రయాణించేవారు చలి తీవ్రతను తట్టుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాత్రుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. సాయంత్రం 5 గంటలు దాటితే చాలు… చలి వణికిస్తున్నది. ఈ ఏడాది అధికంగా వర్షాలు కురవడంతో చెరువులన్నీ నిండుగా ఉన్నాయి. ఫలితంగా చల్లగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. మరోవైపు అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ డివిజన్ ప్రాంతంలో చలి తీవ్రత మరింత ఎక్కువగానే కనిపిస్తున్నది. గాలిలో తేమశాతం పెరగడంతో వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకూ ఉమ్మడి జిల్లా పరిధిలోని 44వ జాతీయ రహదారిని మంచు తెర కమ్మేస్తున్నది.