దళితుల జీవితాలకు కొత్త కళ
ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ప్రభుత్వ సాయం
ఒకప్పుడు కూలీలు, డ్రైవర్లు.. ఇప్పుడు యజమానులు
ఇతరులకు ఉపాధి కల్పించే స్థితికి చేరిన దళితులు
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామంటున్న లబ్ధిదారులు
70 ఏండ్ల స్వాతంత్య్ర దేశంలో నేటికీ దళిత కుటుంబాలు అట్టడుగులోనే ఉండిపోయాయి. వారి అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చినంక దళితుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చినం. దళితబంధు పథకంతో వారి బతుకులు మరింత బాగుపడతాయి. – సీఎం కేసీఆర్
పేదరికంలో మగ్గుతున్న వారి జీవితాల్లో ‘దళితబంధు’ కొత్త కాంతులు నింపింది. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న దళితులకు కొండంత ఆసరాగా నిలిచింది. గతంలో సామాజిక వివక్ష, వెనుకబాటుకు గురైన కుటుంబాలు స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. సొంతంగా వ్యాపారాలు చేసి, సమాజంలో గౌరవంగా బతికేలా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఒకప్పుడు కూలీలు, డ్రైవర్లుగా పని చేసిన దళితులు.. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో యజమానులుగా మారారు. గతంలో పేదరికంతో పాటు అవమానాలు ఎదుర్కొన్న వారు.. నేడు ఆత్మగౌరవంతో పాటు ఆర్థిక స్థిరత్వం సాధించి ఉన్నతమైన జీవితాలు గడుపుతున్నారు. ఇతరులకు పని కల్పించే స్థాయికి ఎదిగారు. తమ బతుకులను బాగు చేసిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని వారు చెబుతున్నారు.
నిజాంసాగర్ మండలంలో దళితబంధు యూనిట్ను అందుకున్న సందర్భంగా ఉద్వేగంతో మంత్రి ప్రశాంత్రెడ్డిని గుండెలకు హత్తుకున్న మంగ ప్రకాశ్ (ఫైల్)
నాడు వర్కర్లు.. నేడు ఓనర్లు!
ఈ కింది చిత్రంలో కనిపిస్తున్నది నిజామాబాద్లోని సంజీవయ్య కాలనీకి చెందిన ప్రసాద్. ఆయనకు ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసిన అనుభవం ఉన్నది. సొంతంగా దుకాణం పెట్టుకునేంత స్థోమత లేదు. దళితబంధు పథకానికి ఎంపికవ్వడంతో యూనిట్ మంజూరైంది. దీంతో ప్రింటింగ్కు సంబంధించిన కొత్త మిషన్లు, కంప్యూటర్, స్టేషనరీని కొనుగోలు చేశారు. రూపాయి అప్పు లేకుండా ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేశాడు. తాను ప్రారంభించిన ప్రింటింగ్ ప్రెస్తో మరో ఎనిమిది మందికి ఉపాధి చూపుతున్నాడు ప్రసాద్. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు కింద రూ.10లక్షలు ఇచ్చి తనను వెనుకుండి నడిపిస్తున్నారని అంటున్నాడు. బాగా కష్టపడి లాభాలు సాధిస్తానని వివరిస్తున్నాడు. ఎవ్వరికిందనో పని చేయకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహించిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపాడు.
గోర్గల్ గ్రామానికి చెందిన మంగ ప్రకాశ్కు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. కూతురికి పెండ్లి చేసినా అందరూ కలిసి గోర్గల్ గ్రామంలోనే ఉంటున్నారు. దళితబంధు పథకంలో భాగంగా ప్రకాశ్తోపాటు కొడుకు పాల్దినకర్, కూతురు నాగమణి ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున మంజూరయ్యాయి. ఈ ముగ్గురూ కలిసి రూ.30లక్షలతో వరి కోతయంత్రం యూనిట్ను ఎంచుకోగా, నెల కిందట వాహనం అందింది. ఇటీవలే వరి కోతలు ఊపందుకోవడంతో వారు తీసుకున్న హార్వెస్టర్ బిజీగా మారిపోయింది. నెల రోజుల్లో సుమారు 120 గంటలపాటు పంట నూర్పిళ్లు చేశారు. గంటకు రూ.2800 చొప్పున సంపాదించగా డీజిల్, డ్రైవర్ ఖర్చులు పోను గంటకు వెయ్యి రూపాయల చొప్పున రూ. లక్షా 20వేలు సంపాదించారు. మొన్నటి వరకు రైతు కూలీలుగా పనులు చేసుకునే తాము నెల రోజుల్లో ఒక్కొక్కరూ రూ.40వేల చొప్పున సంపాదించామంటే సీఎం కేసీఆర్ పుణ్యమేనంటున్నారు. మరో 20రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటకలో ఆరుతడి పంటల నూర్పిళ్లు ప్రారంభం కానున్నాయని, అక్కడికి కోతయంత్రాన్ని తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ అందించిన దళితబంధు పథకంతో గర్వంగా బతుకుతున్నామని చెబుతున్నారు.
–నిజాంసాగర్, మే 26
నాడు కేబుల్ ఆపరేటర్.. నేడు షోరూం యజమాని
బీర్కూర్ మండలకేంద్రానికి చెందిన రాంసాని సావిత్రి- భూమయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రాంసాని వెంకటేశ్, రెండో కొడుకు శ్రీనివాస్. వెంకటేశ్ డిగ్రీ వరకు చదివి ఐదేండ్లుగా కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ పదో తరగతి చదువుతున్నాడు. దళితబంధు పథకానికి రాంసాని వెంకటేశ్ ఎంపికయ్యాడు. ప్రభుత్వం అందజేసిన రూ.10లక్షలతో మండలకేంద్రంలో ఎలక్ట్రానిక్ దుకాణం పెట్టుకున్నాడు. కేబుల్ ఆపరేటర్గా పని చేస్తూ టీవీ, కూలర్, ఫ్యాన్లు రిపేర్ చేస్తూ జీవిస్తున్న తనను.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం తనను ఓనర్ను చేసిందంటున్నాడు వెంకటేశ్. డిగ్రీ చదివిన తాను నిరుద్యోగిగా మారకుండా రూ.10లక్షలు అందించి సొంతంగా ఎలక్ట్రానిక్ దుకాణం పెట్టుకొనేలా చేసిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నాడు.
–బీర్కూర్, మే 26
కామారెడ్డి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన డోకూరి ధన్రాజు గతంలో డ్రైవర్ పనిచేస్తూ నెలకు రూ.10వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదించేవాడు. దళితబంధు పథకం కింద ఈయన.. తన తండ్రితో కలిసి హార్వెస్టర్ను యూనిట్గా ఎంచుకున్నాడు. నెలన్నర క్రితం దీనిని అందజేయగా సొంతంగా పని చేసుకుంటున్నారు. మరో ఇద్దరిని డ్రైవర్లుగా నియమించుకొని పంట కోత పనుల్లో బిజీ అయ్యారు. వీరికి నెల రోజుల్లోనే రూ.3 లక్షల ఆదాయం వచ్చింది. 45 రోజుల్లో డీజిల్, డ్రైవర్ల ఖర్చులు పోను రూ.2 లక్షలు మిగిలాయి. ఇంతపెద్ద మొత్తంలో సంపాదిస్తామని కలలో కూడా ఊహించలేదని, ఇదంతా సీఎం కేసీఆర్ పుణ్యంతోనే సాధ్యమైందని చెప్పారు. జీవించినంత కాలం ఆయను గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటామని ఆనందంతో చెప్పారు.
–కామారెడ్డి, మే 26
నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామానికి చెందిన జంజురు రాములు దళితబంధు పథకంలో భాగంగా 20 రోజుల కిందటే గూడ్స్ వాహనాన్ని అందుకున్నాడు. మొన్నటి వరకు గ్రామంలో డ్రైవర్గా పనిచేసిన రాములు.. ప్రభుత్వం ఇచ్చిన వాహనంతో హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ గూడ్స్ వాహనంతో ఇంటింటికీ వాటర్ డబ్బాలను చేరవేస్తున్నాడు. దీంతో డీజిల్ ఖర్చులు పోను రోజూ రూ.2500 నుంచి రూ.3000 వరకు సంపాదిస్తున్నాడు. సీఎం కేసీఆర్ దళితబంధు యూనిట్ అందించడంతోనే తాను రోజుకు రెండు వేల నుంచి రెండున్నర వేలు సంపాదిస్తున్నట్లు చెబుతున్నాడు రాములు.
–నిజాంసాగర్, మే 26
కమ్మర్పల్లి మండలం అమీర్నగర్కు చెందిన గుర్రపు సాగర్ పేద దళితుడు. కుటుంబంలో పెద్ద కొడుకు. నైపుణ్యమున్న వృత్తిని నమ్ముకోవాలని ఎలక్ట్రికల్ పని నేర్చుకున్నాడు. కొత్తగా నిర్మించిన ఇండ్లలో, కరెంటు పనులు చేయించే కాంట్రాక్టర్ దగ్గర పనిచేసేవాడు. తనతోపాటు తమ్ముడిపై కుటుంబ బరువు బాధ్యతలు ఉన్నాయి. సాగర్ తల్లి ఈ మధ్యనే పక్షవాతం బారిన పడింది. కూలి డబ్బులతో ఇలాంటి కఠిన పరిస్థితిని ఎలా అధిగమించేది అనే ఆవేదనలో ఉన్న సాగర్కు.. కేసీఆర్ సర్కారు ప్రారంభించిన దళితబంధు పథకం కొండంత వరంలా ఆదుకున్నది. దళితబంధు పథకంలో సాగర్కు రూ.9 లక్షల 99వేల విలువైన ఎలక్ట్రికల్ షాపు యూనిట్ మంజూరైంది. సొంత గ్రామం అమీర్నగర్లోనే ఇప్పుడు షాపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా దళితబంధు పథకంతో ఎలక్ట్రీషియన్ కూలి పని చేసుకునే గుర్రపు సాగర్.. ఎలక్ట్రికల్ దుకాణానికే ఓనరయ్యాడు.
–కమ్మర్పల్లి, మే 26
ధర్పల్లి మండలం వాడి గ్రామానికి చెందిన తెడ్డు సాయికిరణ్కు దళితబంధు పథకంలో భాగంగా ఓ యూనిట్ మంజూరైంది. దీంతో మండల కేంద్రంలో సాయి నెట్వర్క్ పేరిట ఆన్లైన్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేసుకొన్నాడు. గతంలో ఇంటర్నెట్ సెంటర్లో పని చేసిన అనుభవం ఉన్న సాయికిరణ్.. దళితబంధు పథకంలో వచ్చిన డబ్బులతో ఆన్లైన్ సెంటర్ను ఏర్పాటు చేసి మరొకరికి ఉపాధి కల్పిస్తున్నాడు. 25 రోజుల కిందట ప్రారంభమైన ఆన్లైన్ సెంటర్ ద్వారా ఖర్చులన్నీ పోను సుమారు రూ.15వేలకు పైగా సంపాదిస్తున్నాడు.
–ధర్పల్లి, మే 26
కొత్త కారుతో ఉన్న ఈయన.. బోధన్ మండలం ఊట్పల్లికి చెందిన బేగరి నవీన్. మొన్నటి వరకు ఇతరుల వద్ద డ్రైవర్గా పనిచేసి చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.. సొంతంగా స్థిరాస్తులేమీ లేవు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘దళితబంధు’ నవీన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించింది. డ్రైవర్గా ఉన్న నవీన్.. ఇప్పుడు కారు ఓనరయ్యాడు. ఇతరులపై ఆధారపడకుండా ఇప్పుడు సొంత కాళ్లపై నిలబడ్డాడు. అన్నింటికీ మించి ఆత్మగౌరవం పెరిగింది. సొంత కారును కిరాయికి నడుపుకొంటూ రోజుకు దాదాపు రూ.1,500 వరకు సంపాదిస్తున్నాడు.
–బోధన్, మే 26
ఆర్మూర్ పట్టణానికి చెందిన మాదరి నరేశ్.. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు నానా ఇబ్బందులు పడేవాడు.. ఈ తరుణంలో రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఉపాధి మార్గాన్ని చూపింది. ప్రభుత్వం మంజూరు చేసిన కారుకు ఓ డ్రైవర్ను ఏర్పాటు చేసుకొని కిరాయికి తిప్పుతున్నాడు. తనకున్న పరిచయాలతో కారు దాదాపు బిజీగా మారింది. దీంతో నెలకు అన్ని ఖర్చులూ పోను రూ.50వేల నుంచి రూ. 60 వేల వరకు సంపాదిస్తున్నాడు. డ్రైవర్కూ ఉపాధి కల్పిస్తున్నాడు.
–ఆర్మూర్, మే 26
సీఎం కేసీఆర్.. దేవుడిలా ఆదుకున్నరు
వేరొకరి వద్ద పనిచేస్తూ చాలీచాలని జీతంతో ఇబ్బంది పడుతూ ఇలా ఇంకెన్ని రోజులంటూ మదనపడ్డా.. సీఎం కేసీఆర్ దేవుడి మాదిరిగా దళితబంధు పథకం ప్రవేశపెట్టి.. నాలాంటి నిరుపేదకు ఆర్థికంగా సాయం చేసి స్వయంగా ఉపాధి పొందేలా చేశారు. ఆదాయ మార్గాన్ని పెంచి ఉన్నత స్థానానికి చేర్చిన సీఎం కేసీఆర్, ఈ పథకానికి ఎంపిక చేసిన ఆర్టీసీ చైర్మన్, బాజిరెడ్డి గోవర్ధన్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
–తెడ్డు సాయికిరణ్, వాడి, ధర్పల్లి మండలం
లీజుకు ట్రాక్టర్ నడిపేవాన్ని..
డబ్బులు లేక ఏటా పంటల సీజన్లో ట్రాక్టర్ లీజుకు తీసుకొని పొలాలు దున్నేవాడిని. ప్రస్తుతం దళితబంధు పథకం కింద ట్రాక్టర్ మంజూరైంది. ఇక నుంచి ఇతరుల వద్ద కిరాయి తీసుకొని నడిపే బాధ తప్పింది. లీజు డబ్బులు కూడా మిగులుతున్నాయి. ఒక డ్రైవర్ను కూడా పెట్టుకున్న. కేసీఆర్ను జీవితకాలం మర్చిపోలేను.
–డప్పు సాయిలు, బాణాపూర్ లింగంపేట మండలం
కష్టాలన్నీ దూరమయ్యాయి..
మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కిరాయి ఇంట్లో బతుకుతున్నం. డ్రైవింగ్ పనితో నెలకు రూ.11 వేల దాకా వచ్చేది. ఇల్లు గడిచేందుకు ఆ డబ్బులు సరిపోకపోతుండె. పానం బాగలేకపోయినా పనికి పోవాల్సి వచ్చేది. లేదంటే జీతం తక్కువ ఇచ్చేటోళ్లు. దళితబంధు పథకం కింద టీఆర్ఎస్ సర్కారు నాకు కారు మంజూరు చేసింది. దీంతో నా బతుకు పూర్తిగా మారిపోయింది. సీఎం కేసీఆర్ సార్ పుణ్యామా అని.. నా కష్టాలన్నీ దూరమయ్యాయి. సీఎం కేసీఆర్ సార్ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను.
–బేగరి నవీన్, ఊట్పల్లి, బోధన్ మండలం